breaking news
Drugs Free Society
-
మత్తు ముఠాలూ.. ఈగల్ ఉంది జాగ్రత్త: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే సమీక్ష పెట్టి మరీ హెచ్చరించా..తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని. మళ్లీ అదే చెబుతున్నా.. తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తు ముఠాలు రావాలంటే వణికే పరిస్థితి ఉండాలి. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ మూలాలు గుర్తిస్తే యాజమాన్యాలపైనా కేసులు పెడతాం. తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ మూలాలు ఉన్నా కనిపెట్టేలా ‘ఈగల్’ రంగంలోకి దిగుతుంది..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ‘ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా? ఉద్యమాల గడ్డ తెలంగాణ. ఇక్కడ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బలవుతుంటే చూస్తూ కూర్చుందామా?..’ అంటూ ప్రశ్నించారు. అంతా కలిస్తేనే ఆదర్శవంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా పాల్గొన్న సినీ హీరోలు రామ్చరణ్, విజయ్ దేవరకొండ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడారు. పంజాబ్, హరియాణా పరిస్థితి రావొద్దు ‘ఒకప్పుడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణను గంజాయి, డ్రగ్స్ గడ్డగా మార్చొద్దు. ఒకప్పుడు దేశ స్వాతంత్య్ర పోరాటంలో, దేశ రక్షణలో ముందున్న పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని యువత ఇప్పుడు డ్రగ్స్ మహ్మమ్మారితో నిరీ్వర్యమైపోతోంది. అలాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా ఉండాలనే సదుద్దేశంతోనే తెలంగాణలో గంజా యి, ఇతర మత్తుపదార్థాల రవాణా, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక దేశాన్ని దెబ్బ తీసేందుకు శత్రు దేశాలు డ్రగ్స్ను సైతం ఆయుధంగా మార్చుకునే పరిస్థితులు నేడు ఉన్నాయి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో.. ఇకపై ‘ఈగల్’ ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్బీ)ను ఇకపై ‘ఈగల్’ గా మారుస్తున్నాం..ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. తెలంగాణలోని కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి పండించినా..ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లయ్ చేసినా ఈగల్ గుర్తిస్తుంది. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్ పట్టుబడితే యా జమాన్యాల పైనా కేసులు పెట్టాలని డీజీపీని ఆదేశిస్తున్నా. కాలేజీలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి విద్యార్థుల ప్రవర్తనను గమనించాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనా ఉంది. కొందరు తల్లిదండ్రులు తమకున్న పరిస్థితుల కారణంగా వారి పిల్లలపై దృష్టి పెట్టలేకపోవచ్చు. కానీ అత్యంత ఎక్కువ సమయం స్కూళ్లు, కాలేజీల్లోనే గడుపుతారు కాబట్టి విద్యార్థుల ప్రవర్తనను గమనించేందుకు యాజమాన్యాలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి. చాక్లెట్లు కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి డ్రగ్స్ జాడ గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విద్యార్థులు కూడా ఒకవేళ చదువుల్లో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. నేను ఉద్యోగాలు ఇస్తాను. లేదంటే రాజకీయంగా ఎదగాలి. మన యువత న్యూయార్క్, టోక్యో, సౌత్ కొరియా యువతతో పోటీపడే స్థాయికి ఎదగాలి..’ అని సీఎం ఆకాంక్షించారు. సినీ హీరోల విజయ గాథలు స్ఫూర్తిగా తీసుకోవాలి ‘ఎవరికీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. కష్టపడితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయి. మాకెవరికీ బ్యాంక్ గ్రౌండ్ లేదు. చిరంజీవికి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కఠోర శ్రమతో ఆయన మెగాస్టార్గా ఎదిగారు. రామ్చరణ్ కూడా ఎంతో శ్రమతో ఈ స్థాయికి ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ సాధించారు. నేను కూడా 2006లో జెడ్పీటీసీగా మొదలు పెట్టి 2023 నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యాను. విజయ్ దేవరకొండ కూడా నాలాగే నల్లమల నుంచి వచ్చారు. మా పక్క ఊరే. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా హీరోగా ఎదిగారు. అయితే సినిమాల్లోని పాత్రలను కాకుండా సినీ హీరోల నిజ జీవితంలోని విజయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి..’ అని రేవంత్రెడ్డి కోరారు. ఎఫ్డీసీ చైర్మన్, సినీ నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకునే వారిని బహిష్కరించాలని మలయాళ సినీ పరిశ్రమలో నిర్ణయం తీసుకున్నారని, తెలుగు చిత్రపరిశ్రమలో కూడా అలాంటి చర్యలు తీసుకోవడంపై చర్చిస్తామన్నారు. తెలంగాణను మత్తు రహితంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ జితేందర్ కోరారు. ఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు నషా ముక్త్ (మత్తు రహిత) తెలంగాణ ధ్యేయంగా తమ విభాగం పనిచేస్తోందన్నారు. కాగా డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లొద్దని..డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామనే నినాదంతో రూపొందించిన లఘు చిత్రాన్ని, వీడియో గీతాన్ని సీఎం విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం’ వీడియో గీతాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, విజయ్ దేవరకొండ, రాంచరణ్, అడ్లూరి లక్ష్మణ్, గోపీచంద్, జితేందర్ ఒక తండ్రిగా నాకు ఆందోళన కలుగుతోంది.. స్కూళ్ల వద్ద ఐస్క్రీమ్లు, చాక్లెట్లలో ఏమిస్తున్నారో తెలియట్లేదు. పిల్లలను బయటకు పంపించాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక తండ్రిగా ఇప్పుడు నాకు కూడా ఆందోళనగా ఉంది. యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయం. డ్రగ్స్ మహమ్మారిని తరిమేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి మేం కూడా పూర్తిగా సహకరిస్తాం. డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడం మన కుటుంబం నుంచే మొదలు పెడదాం. ప్రతి ఒక్కరం ఒక సైనికుడిలా పోరాడాలి. అప్పుడే డ్రగ్స్లేని సమాజం సాధ్యం. – రామ్చరణ్ఆరోగ్యం లేకపోతే అన్నీ వృథాయే.. సినిమాలు, షూటింగ్లు, ఇల్లు మినహా బయట ఏం జరుగుతుందో నాకు పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్య కొందరు పోలీసు అధికారులు ఈ డ్రగ్స్ విస్తరణను నాకు వివరించారు. ఆ తర్వాతే ఇది ఎంత ముఖ్యమైన అంశమో నాకు అర్థమైంది. అందుకే డ్రగ్స్తో వచ్చే ముప్పును చెప్పడానికి వచ్చా. డబ్బులు లేని లైఫ్ను.. ఉన్న లైఫ్ నేను చూశా. సక్సెస్, మనీ ఉన్నా..ఆరోగ్యం బాగా లేకపోతే అది వృథా. కాబట్టి డ్రగ్స్కు దూరంగా ఉండండి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించండి..డబ్బులు సంపాదించండి. తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. అదే మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. – విజయ్ దేవరకొండ -
దయచేసి డ్రగ్స్ కి దూరంగా ఉండండి
-
మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం
-
అమ్మే దిగివస్తే మత్తు దిగదా..
పంజాబ్లో హెరాయిన్ని ‘చిట్టా’ అంటారు. దీని అడిక్షన్లో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ను వ్యతిరేకించడానికి నేడు తల్లులే రంగంలోకి దిగారు. పంజాబ్లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ మొదలైంది. నిజానికి ఇది ప్రతి రాష్ట్రంలో జరగాలి. డ్రగ్స్ నీడ లేని ఇల్లే సమాజానికి వెలుగు.పంజాబ్లో ‘డ్రగ్స్’ మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రకృతిలోని మహమ్మారికి మందు ఉంది వాక్సిన్లు ఉన్నాయి... కాని ఈ మహమ్మారికి మందు లేదు. దీనిని నివారించాలంటే మానవశక్తి కావాలి. మహా శక్తి కావాలి. ఆ శక్తి తల్లే తప్ప మరెవరూ కాలేరని పంజాబ్లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమం మొదలైంది. ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ అనే సంస్థ సెప్టెంబర్ 15న హోషియార్పూర్లో ఈ ఉద్యమం మొదలెట్టింది. ఈ కార్యక్రమానికి తల్లులు భారీగా తరలి వచ్చారు. పిల్లలు వ్యసనాల బారిన పడితే కడుపుకోతకు గురయ్యేది మొదట తల్లులే. పిల్లల్ని కాపాడుకోవాల్సింది మొదట వారే.13 నుంచి 18 ఏళ్ల మధ్యలోపిల్లల వయసు 13 నుంచి 18 ఏళ్ల మధ్య వరకు తల్లులు వారిని జాగ్రత్తగా గమనించుకుంటే డ్రగ్స్ నుంచి కాపాడుకోవచ్చని ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ స్థాపకుడు, రచయిత కుష్వంత్ సింగ్ అన్నాడు. పంజాబ్లోని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఆయన ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమానికి అంకురార్పణ చేశాడు. ‘పంజాబ్లో 13 నుంచి 18 ఏళ్ల మధ్యలో పిల్లలు డ్రగ్స్కు పరిచయం అవుతున్నారు. 14 నుంచి 24 ఏళ్ల మధ్య వీళ్లు అడిక్ట్స్గా మారుతున్నారు. వీరిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్స్లో పడేస్తే మారే వారు ఒక శాతం మాత్రమే ఉంటున్నారు. అంటే డ్రగ్స్ బానిసత్వం ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి’ అన్నాడాయన. ‘పంజాబ్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా గత సంవత్సరం చండీగఢ్ నుంచి భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్ వరకూ పాదయాత్ర చేసినప్పుడు దారిలో ఎందరో తల్లులు వచ్చి మా పిల్లలు బాగుపడే మార్గం లేదా అని అడిగేవారు. తల్లులే మొదటి రక్షకులుగా మారితే పిల్లలను డ్రగ్స్వైపు వెళ్లకుండా ఆపొచ్చని నాకు అనిపించింది. దాని ఫలితమే ఈ ఉద్యమం’ అని తెలిపాడతడు.మంచాలకు సంకెళ్లుపంజాబ్లో హెరాయిన్ వ్యసనపరులు లెక్కకు మించి ఉన్నారు. దీనిని అక్కడ ‘చిట్టా’ అంటారు. దాని కోసం పిల్లలు ఎంతకైనా తెగిస్తారు. వారిని డ్రగ్స్ కోసం వెళ్లకుండా ఉంచేందుకు తల్లిదండ్రులు మంచాలకు సంకెళ్లు వేసి కట్టేసి ఉంచడం సర్వసాధారణం. పంజాబ్లో కొన్ని ఊళ్లు డ్రగ్స్ వల్ల చని΄ోయిన వ్యక్తుల భార్యలతో నిండి ‘వితంతువుల పల్లెలు’గా పేరు పడటం సమస్య తీవ్రతను తెలుపుతుంది.తల్లులకు ట్రైనింగ్ ఇస్తేమదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్ ఉద్యమంలో తల్లులను ఒకచోట చేర్చి డ్రగ్స్ గురించి అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన గౌరవ్ గిల్ అనే బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ డ్రగ్స్కు అలవాటు పడుతున్నవారి శారీరక కదలికలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ సందర్భంగా తల్లులకు తెలియచేసి పిల్లల్లో ఈ మార్పు చూడగానే అలెర్ట్ అవ్వాలని కోరాడు. ‘తొలి రోజుల్లోనే గమనిస్తే చాలా మేలు జరుగుతుంది. చాలాసార్లు పరిస్థితి చేయి దాటి ΄ోయాకే పిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యారని తల్లిదండ్రులు గమనిస్తున్నారు’ అని అక్కడకు వచ్చిన ΄ోలీసు అధికారులు తెలిపారు. అందుకే ఈ ఉద్యమంలో డ్రగ్స్ కార్యకలాపాలు గమనించిన వెంటనే ΄ోలీసుల హెల్ప్లైన్కు ఎలా తెలపాలి, ΄ోలీసుల సహాయం ఎలా తీసుకోవాలో తెలియచేస్తారు. ‘గ్రామీణ స్త్రీలకు ఈ శిక్షణ ఉంటే గ్రామాల్లో యువకులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోగలరు’ అంటున్నారు ఈ ఉద్యమ బాధ్యులు.ఎన్నో రకాలుమత్తు పదార్థాలంటే హెరాయిన్, గంజాయి మాత్రమే కాదు. వైటెనర్స్తో మొదలు దగ్గుమందు వరకు ఎన్నో ఉన్నాయి. డ్రగ్స్ చలామణి కోసం పంజాబ్లో దగ్గుమందు ముసుగులో ఫ్యాక్టరీలు తయారయ్యి ్రపాణాంతకస్థాయిలో దగ్గుమందులోని రసాయనాలను ఇంజెక్షన్లుగా ఎక్కించునే విధంగా తయారు చేస్తున్నారు. అంతేకాదు గ్రాము బరువుకు ఎక్కువ పొడి వచ్చే విధంగా తయారు చేయడంతో ఒక్క గ్రాముతో కూడా రోజు గడపొచ్చనుకుని అలవాటు పడుతున్నారు.ఏం చేయాలి?తల్లిదండ్రులు పిల్లలతో తరచూ సమయం గడపాలి. వారితో విహారాలు చేయాలి. ఆ సమయంలో వారి మనోభావాలు విని స్నేహాలు తెలుసుకోవాలి. చదువుల్లో మార్కులు తెలుసుకోవాలి. ప్రవర్తనను గమనించాలి. ఇవన్నీ ఏమాత్రం తేడా వున్న అనుమానించి ఆదుకోవాలి. ఈ స్పీడు యుగంలో ఎవరూ ఈ పని చేయడం లేదు. తల్లులకు తప్పదు. వారే రక్షకులు. అమ్మ వల్లే మారాను‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమంలో భాగంగా డ్రగ్స్ నుంచి బయటపడి సామాన్య జీవితం గడుపుతున్న వారి కథనాలు కూడా స్వయంగా వినిపించారు. ‘నేను డ్రగ్స్ నుంచి కేవలం మా అమ్మ వల్ల బయట పడ్డాను. ఒక దశలో హెరాయిన్ డోస్ కోసం 2 లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడలేదు. మా అమ్మ నా కోసం అనేక త్యాగాలు చేసి మామూలు మనిషిని చేసింది’ అని ఒకతను తెలిపాడు. -
నిషా ముక్త్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రజలు.. అంతా కలిసి పని చేస్తేనే రాష్ట్రం నుంచి మాదకద్రవ్యాలను తరిమేయడం సాధ్యమవుతుందని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏఎన్బీ) డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. ‘నిషా ముక్త్ తెలంగాణ’(మత్తు రహిత తెలంగాణ) కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా పాఠశాలలు, కళాశాలలపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు.గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ను కట్టడి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. గంజాయి సహా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి, ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయడానికి ‘సాక్షి’చేపట్టిన ‘మీతో సాక్షి’క్యాంపెయినింగ్కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది తమ ప్రశ్నలను వాట్సాప్ ద్వారా పంపారు. వీటికి సందీప్ శాండిల్య సమాధానాలు ఇచ్చారు. ‘మీతో సాక్షి’కి వచ్చిన ప్రశ్నలకు శాండిల్య సమాధానాలు..ప్రశ్న: మత్తు పదార్థాలకు అలవాటు పడిన పిల్లల్ని ఎలా గుర్తించాలి? డీ అడిక్షన్ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏమైనా కేంద్రాలున్నాయా? – వేణుగోపాలరావు, ఖమ్మం వన్ టౌన్సమాధానం: నలుగురిలో కలవకుండా దూరంగా ఉండటం, చదువులో వెనకబడటం, గతంలో ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమాల విషయంలో ఇప్పుడు విముఖత చూపడం, ఖర్చు ఎక్కువ చేయడం, ఆ డబ్బు కోసం చోరీలు చేయడం, కేవలం ఒకరిద్దరితోనే ఎక్కువగా తిరుగుతూ ఉండటం, కుటుంబంతో కలిసి ఫంక్షన్లకు వెళ్లకుండా ఒంటరిగా ఉండటం, ముఖంపై చిరునవ్వు మాయం కావడం, కుటుంబీకుల కళ్లలోకి చూసి మాట్లాడలేక పోవడం.. ఇవన్నీ గంజాయి/డ్రగ్ బానిసల లక్షణాలు. ఇలాంటివారి కోసం నిషా ముక్త్ తెలంగాణ ప్రాజెక్టులో భాగంగా 26 ఆస్పత్రులతో పాటు 11 డీ అడిక్షన్ కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదిస్తే వాటి వివరాలు తెలుస్తాయి.ప్రశ్న: మా ఫ్లాట్ ఎదురుగా ఉండే నా స్నేహితురాలి కుమారుడి ప్రవర్తనలో కొత్తగా మార్పు కనబడుతోంది. ఇతను జూబ్లీహిల్స్లోని ఓ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి రాగానే బాత్రూమ్లోకి వెళ్లి గంటల తరబడి ఉంటున్నాడు. నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు. ఒక రోజు బ్యాగ్లో ఏదో పౌడర్ ఉన్న ప్యాకెట్ దొరికింది. ఆ బాలుడి విషయంలో ఏం చేయాలి? – ఓ మహిళ, మణికొండసమాధానం: ఎవరైనా గంజాయి, డ్రగ్స్కు బానిసయ్యారనే అనుమానం ఉంటే వారికి 12 ప్యారామీటర్ టెస్ట్ చేయించాలి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు ప్రముఖ డయాగ్నస్టిక్ సెంటర్లలో ఈ పరీక్ష చేస్తారు. మీరు చెప్తున్న బాలుడి విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాం. ‘87126 71111’కు కాల్ చేసి చిరునామా ఇతర వివరాలు చెప్పండి. ఓ మహిళా అధికారిని పంపి విషయం తెలుసుకుని, బాలుడికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కరిస్తాం. ఆ బాలుడు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని తెలిస్తే అతడి పైన కాకుండా అతడిని ఈ ఊబిలోకి దింపిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: మాకు సమీపంలో ఉన్న కాలేజీ ఆవరణలో చీకటి పడిన తర్వాత యువత పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. వాళ్లు సిగరెట్లు తాగుతూ గంజాయితో పాటు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా అనుమానం ఉంది. దీనిపై చర్యలు తీసుకోగలరా? – పేరు, వివరాలు గోప్యంగా ఉంచాం సమాధానం: అలాంటప్పుడు మీరు వెంటనే ‘100’లేదా ’87126 71111’కు ఫోన్ చేయండి. లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. మేము కూడా ఆ ప్రాంతంపై నిఘా వేసి ఏం జరుగుతోందో తెలుసుకుంటాం. మీ పేరు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతాం.ప్రశ్న: మా ప్రాంతంలో ఉన్న కల్లు దుకాణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకమంది ఇక్కడకు వస్తుంటారు. ఆ దుకాణంలో విక్రయించే కల్లులో ఏదైనా కలుపుతున్నారేమోనని అనుమానం ఉంది. – పేరు, వివరాలు గోప్యంగా ఉంచాంసమాధానం: దీనిపై ఏఎన్బీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆరా తీస్తుంది. అలాంటిది ఏమైనా ఉన్నట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది.ప్రశ్న: గంజాయి అలవాటు సిగరెట్ నుంచి మొదలవుతుంది. పాఠశాలల పరిసరాల్లో ఉన్న దుకాణాల్లో సిగరెట్లు అమ్మకుండా తనిఖీలు ఏమైనా చేస్తున్నారా? – వంశీకృష్ణ, విద్యారి్థ, మోడల్ స్కూల్, మందమర్రిసమాధానం: సిగరెట్ ఇతర పొగాకు ఉత్పత్తుల (కోటా్ప) చట్టం–2023 ప్రకారం విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు విక్రయించే దుకాణాలు ఉండకూడదు. అలాంటి దుకాణాలపై జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విక్రేతలకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.ప్రశ్న: ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రాకుండా నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? – మిట్టపల్లి యుగంధర్, హెచ్ఎం, ఎంపీపీ స్కూల్ దూళికట్ట, పెద్దపల్లి జిల్లాసమాధానం: గంజాయికి దాన్ని పండించే ప్రాంతంలోనే చెక్ చెప్పాలని నిర్ణయించాం. టీఎస్ ఏఎన్బీ నేతృత్వంలో త్వరలో విశాఖపట్నంలో జరిగే మూడు రాష్ట్రాల అధికారులు, రాజకీయ నాయకుల భేటీలో గంజాయి కట్టడికి ప్రత్యేక కార్యాచరణ ఖరారు చేస్తాం. ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా గంజాయి పండించే ప్రాంతాలను గుర్తించనున్నాం. సరిహద్దు చెక్పోస్టుల్లో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం.ప్రశ్న: మాదకద్రవ్యాల కట్టడికి సారా వ్యతిరేక ఉద్యమం మాదిరిగా ఉద్యమం రావాలి. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్ ఏదైనా అందుబాటులో ఉందా? – స్వాతి, మహిళా సంఘం నాయకురాలు, సుల్తానాబాద్సమాధానం: అలాంటప్పుడు మీరు వెంటనే ‘100’లేదా ’87126 71111’కు ఫోన్ చేయండి. లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. మేము కూడా ఆ ప్రాంతంపై నిఘా వేసి ఏం జరుగుతోందో తెలుసుకుంటాం. మీ పేరు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతాం.ప్రశ్న: గ్రామాల్లో మత్తు పదార్థాల నిషేధ కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? – రాంచందర్ భీంవంశీ, ప్రజాకవి, ఉపాధ్యాయులు, జహీరాబాద్సమాధానం: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 7,500 యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఆయా స్కూళ్లు, కాలేజీల్లో ఇవి పని చేస్తున్నాయి. ప్రతి బుధవారం మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ స్థాయిలో ఉన్న అన్ని విభాగాలు, అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి పని చేస్తున్నాం.అనూహ్య స్పందన..(నోట్: మీతో ‘సాక్షి’పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు ప్రశ్నలు వేశారు. కొందరు తమకు తెలిసిన సమాచారం ఇచ్చారు. వీటిల్లోని సున్నితాంశాలు, కీలక సమాచారాన్ని టీజీ ఏఎన్బీకి అందించాం. అనేక ప్రశ్నలు సారూప్యత కలిగి ఉండటంతో వాటిల్లో కొన్నింటినే ఎంపిక చేశాం)ఆ తండ్రికి వందనం..తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిన ప్రత్యేక నంబర్ 87126 71111కు నిత్యం కీలక సమాచారం అందుతోందని సందీప్ శాండిల్య తెలిపారు. ఆ సమాచారం ఆధారంగా ఛేదించిన కేసుల్లో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వాటిని ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రజారోగ్యానికి చేటు చేస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ–సిగరెట్లను నిషేధించింది. అయితే నగరానికి చెందిన ఓ విద్యార్థి ఆన్లైన్లో వీటిని ఖరీదు చేస్తున్నాడు. రహస్యంగా తన వద్ద ఉంచుకుని స్నేహితులతో పాటు తోటి విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. తన కుమారుడు చేస్తున్న ఈ వ్యవహారం చట్ట విరుద్ధమని భావించిన అతడి తండ్రి ఏఎన్బీకి సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అధికారులు అతనితో పాటు ఇతర విక్రేతలు, వినియోగదారులైన 30 మందిని గుర్తించారు. రూ.లక్షల విలువైన ఈ–సిగరెట్లు స్వా«దీనం చేసుకున్నారు. అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు.‘సరుకు’దొరకకున్నా అరెస్టు.. నానక్రామ్గూడలోని ఓ ఇంట్లో గంజాయి విక్రయాలు భారీగా సాగుతున్నట్లు సమాచారం ఇచ్చిన యువకుడు దీనికి సాక్ష్యంగా వీడియోను పంపాడు. ఏఎన్బీ అధికారులు వెళ్లి దాడి చేసే సమయానికి అప్రమత్తమైన భార్యాభర్తలు తమ ఇంట్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేశారు. అయితే ఉన్నతాధికారులు తమ వద్ద ఉన్న వీడియోను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ సందర్భంలో వారి కుమార్తె ‘సరుకు’అందిస్తున్నట్లు కనిపించింది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఆమెను మైనర్గా గుర్తించారు. జువైనల్ జస్టిస్ యాక్ట్లోని సెక్షన్ 78 ప్రకారం సిగరెట్లు, మద్యం, మాదకద్రవ్యాలను చిన్నారుల చేతికి ఇవ్వకూడదు. దీని ఆధారంగా భార్యాభర్తలపై కేసు నమోదు చేసి ఏఎన్బీ జైలుకు పంపింది.రివర్స్ మెకానిజంతో...డార్క్వెబ్పై నిఘా ఉంచడం, అందులో జరిగే డ్రగ్స్ క్రయవిక్రయాలను అడ్డుకోవడం సాధ్యం కాదు. దీంతో ఏఎన్బీ రివర్స్ మెకానిజం మొదలెట్టింది. ఏ దేశంలో ఉన్న సప్లయర్కి ఆర్డర్ ఇచ్చినా అది పార్సిల్ రూపంలో వచ్చి పెడ్లర్కు చేరాల్సిందే. దీంతో వివిధ కొరియర్ సంస్థలు, ఎయిర్ కార్గో ద్వారా వచ్చే పార్సిళ్లను ట్రాక్ చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఖమ్మంలో డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు. -
HYD: డ్రగ్స్ కలకలం.. కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఎంతో ఖరీదు చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 256 గ్రాముల మల్టీపుల్ డ్రగ్స్ను పట్టుకున్నారు. డ్రగ్స్ విలువ దాదాపు కోటీ పది లక్షలపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.కాగా, డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. దాడుల్లో భాగంగా 256 గ్రాముల మల్టీ పుల్ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, ఇంటర్ స్టేట్ డ్రగ్స్ సప్లయర్తో పాటు డ్రగ్ డెలివరీ బాయ్ను అరెస్టు చేశారు. ఇక, పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు కోటీ పది లక్షలకుపైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
రండి.. ‘మత్తు’ వదిలిద్దాం
డ్రగ్ మహమ్మారి అంతటా విస్తరిస్తోంది. ఓ పక్క గంజాయి.. మరో పక్క సింథటిక్ డ్రగ్స్.. ఇవి చాలవన్నట్లు దుర్వినియోగం అవుతున్న ఔషధాలు పేద, ధనిక తేడా లేకుండా యువతను బలి కోరుతున్నాయి. ముప్పేట ముంచుకొస్తున్న ముప్పు నుండి రేపటి తరాన్ని కాపాడుకుందాం. ‘నిషా ముక్త్ తెలంగాణ’ సాకారం దిశగా అడుగేద్దాం. వీటి కట్టడికి ఇప్పటికే పోలీస్, ప్రత్యేక విభాగాలు తమవంతు పనిని వేగిరం చేశాయి. ఇప్పటికే మన నగరం, పట్టణం, మన ఊరికి వచ్చిన డ్రగ్స్.. మన ఇంటికి, స్కూలు, కాలేజీకి రాకుండా అప్రమత్తమవుదాం.ఆ దిశగా ‘సాక్షి’ మీకు.. నార్కోటిక్స్ బ్యూరోకు మధ్య వారధిగా నిలుస్తుంది. మీకు ఎలాంటి సహా య సహకారాలు కావాలన్నా, మాదక ద్రవ్యాలపై సమాచారం తెలిసినా, కుటుంబీకులు, బంధు వులు, స్నేహితులు, పరిచయస్తులు.. వీరిలో ఎవ రైనా డ్రగ్స్కు బానిసలుగా మారారనో, ఇతర సందేహాలు ఉన్నా.. వెంటనే 89777 94588 నంబర్కు వాట్సాప్ చేయండి. సందేశం, వాయిస్ మెసేజ్, ఫొటోల రూపంలో పంపండి. వీటిని ‘సాక్షి’ టీజీ ఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య దృష్టికి తీసుకువెళ్తుంది. ఆయన స్పందన మీకు చేరేలా చేస్తుంది. రండి.. అందరం కలిసి కమ్ముకుంటోన్న మత్తును వదిలిద్దాం..నోట్:పేరు, వివరాలను గోప్యంగా ఉంచాలని ఎవరైనా కోరితే... వారి అభిప్రాయాన్ని ‘సాక్షి’ కచ్చితంగా గౌరవిస్తుంది. – సందీప్ శాండిల్య