పేద వారి కోసమే పెదరాయుడు హోటల్
► ‘ మేము సైతం’లో సినీ నటుడు మోహన్ బాబు
► విద్యానికేతన్ ప్రాంగణంలో అల్పాహారం అమ్మకం
చంద్రగిరి: పేదవాడికి సాయం చేయడంలో నిజమైన ఆత్మ సంతృప్తి ఉందని విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు డాక్టర్ మోహన్బాబు అన్నారు. తిరుపతికి సమీపంలోని విద్యానికేతన్ విద్యాసంస్థల ప్రాంగణంలో గురువారం మోహన్బాబు మేముసైతం కార్యక్రమాన్ని నిర్వహించారు.
‘పెదరాయుడు హోటల్’ పేరుతో ఆయనే స్వయంగా టిఫిన్లు వేశారు. పెదరాయుడు మసాల దోశ, అసెంబ్లీ రౌడీ ఇడ్లి, అల్లుడు గారు పూరి, రౌడీ వడ పేరుతో మెను ఐటమ్స్ పెట్టి విక్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తన కుమార్తె లక్ష్మీ ప్రసన్న పేదవారిని ఆదుకోవడానికి మేము సైతం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఎవరైనా పేదలు ప్రమాదవశాత్తూ నష్టపోతే వారిని ఆదుకునేందుకు సినీ కళాకారుల సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. బాధితుల వృత్తినే మేము ఆచరించి దాని ద్వారా సంపాదించిన మొత్తాన్ని వారికి విరాళంగా ఇస్తామన్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మస్తానయ్య ఆటో నడుపుతూ జీవించేవారన్నారు. ప్రమాదవశాత్తూ ఆయన కాలు విరిగి పోవడంతో ప్రస్తుతం తోపుడు బండిపై ఆయన కుటుంబ సభ్యులు అల్పాహారం విక్రయించి జీవిస్తున్నారని తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు శ్రీవిద్యానికేతన్ ప్రాంగణంలో హోటల్ పెట్టి గురువారం వ్యాపారం చేశామన్నారు. మూడు వేలమంది విద్యార్థులు, ప్రాంగణంలోని హాస్టళ్ల యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి తోచిన సాయం చేశారని తెలిపారు. మొత్తం రూ. 2.2 లక్షలు వచ్చిందనీ ఆ మొత్తాన్ని బాధితులకు అందజేస్తామని మోహన్ బాబు చెప్పారు.