అనాథ బాలలకు గుర్తింపునివ్వాలి
బంజారాహిల్స్(హైదరాబాద్): రాష్ట్రంలో ఉన్న అనాథ బాలలకు గుర్తింపునిచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కీస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో దూళిపాళ్ల జ్యోతిరెడ్డి కోరారు. మంగళవారం ఆమె బంజారాహిల్స్ రోడ్ నంబర్12లోని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డిని ఆయన నివాసంలో టీపీసీసీ నేత ఉదయ్చందర్రెడ్డితో కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
తెలంగాణలో11 లక్షల మంది అనాథలున్నారని, వారందరికీ గుర్తింపు లేకపోవడం వల్ల సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం సన్న బియ్యంతో సరిపెట్టుకుంటోందని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. అనాథలకు ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, వారు చదువు కోవడానికి వీలుంటుందని చెప్పారు. ఈ విషయమై త్వరలోనే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని కూడా కలసి విన్నవించనున్నట్లు తెలిపారు.