EMU train
-
కాజీపేటలోనే ఎంఎంటీఎస్ కోచ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఇకపై మన రాష్ట్రంలోనే తయారుకాబోతున్నాయి. ఇక్కడే కాకుండా, ముంబై లోకల్ రైల్ సర్వీసులకు అవసరమైన కోచ్లను కూడా ఇక్కడే తయారు చేసి సరఫరా చేయనున్నారు. ఇందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే కాజీపేటకు మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఇటీవలే కోచ్ తయారీ కేంద్రంగా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2026 మార్చి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తిచేసి, ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఎల్హెచ్బీ, వందేభారత్ కోచ్లతో పాటు ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (ఈఎంయూ)లను కూడా తయారు చేయనున్నారు. ఫ్యాక్టరీ సిద్ధమైన వెంటనే ఈఎంయూల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.తొలుత నెలకు 24 కోచ్ల ఉత్పత్తి..ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకల్ రైళ్లుగా ఈఎంయూ కోచ్లతో కూడిన రేక్స్ను వినియోగి స్తున్నారు. ప్రధాన నగరాలకు చేరువగా ఉన్న అన్ని రూట్లను దాదాపు విద్యుదీకరించడంతో వీటి వినియోగం పెరిగింది. హైదరాబాద్లోని మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్)లో వాడుతున్న కోచ్లు కూడా ఈఎంయూలే. ఈ కోచ్లలోనే లోకోమోటివ్ అంతర్భాగంగా ఉంటుంది. ఇవి పుష్–పుల్ తరహాలో పనిచేస్తాయి. వీటిని ఎక్కువగా ముంబైలో లోకల్ రైళ్లుగా, చెన్నై శివారులో సబర్బన్ రైళ్లుగా వినియోగిస్తున్నారు. మరికొన్ని నగరాల్లోనూ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఈఎంయూ కోచ్లను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు.వందే భారత్కు డిమాండ్ పెరగటంతో..దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నందున ఐసీఎఫ్లో వందే భారత్ కోచ్ల ఉత్పత్తిని పెంచారు. దీనితో అక్కడ ఈఎంయూల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ మేరకు ఇతర కోచ్ ఫ్యాక్టరీలలో వాటిని ఉత్పత్తి చేయనున్నారు. కాజీపేటలో సిద్ధమవుతున్న కోచ్ తయారీ కేంద్రానికి కూడా ఈ బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 16 ఎంఎంటీఎస్ రేక్స్ నడుస్తున్నాయి. 12 కోచ్లతో కూడిన రైలును ఒక రేక్ అంటారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ విస్తరణ నేపథ్యంలో మరిన్ని రేక్స్ అవసరం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయితే ఇంకా వినియోగం పెరుగుతుంది.అప్పటికల్లా కాజీపేట ఫ్యాక్టరీ సిద్ధంకానుండటంతో.. ఆ కోచ్లను ఇక్కడే తయారు చేయనున్నారు. దేశంలో ఎక్కువ ఈఎంయూలను వాడుతున్నది ముంబై లోకల్ రైల్వే వ్యవస్థ. అక్కడ ప్రస్తుతం నిత్యం 191 రేక్స్ 2,500కు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ముంబైకి కూడా కాజీపేట నుంచే ఈఎంయూ కోచ్లు సరఫరా కానున్నాయి. నెలకు 24 కోచ్ల (రెండు రేక్స్) సామర్థ్యంతో యూనిట్ ప్రారంభం కానుంది. తర్వాత క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. -
కలకలం
సాక్షి, చెన్నై:ఈఎంయూ రైల్లో నిప్పురవ్వలు అలజడిని సృష్టించాయి. పెద్ద ఎత్తున వచ్చిన శబ్ధంతో ప్రయాణికుల్లో కలకలం రేగింది. భయాందోళనతో పరుగులు తీశారు. సోమవారం ఉదయం పల్లవరం స్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకున్నా, అధికారుల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలో ఈఎంయూ(ఎలక్ట్రిక్) రైళ్లు విశిష్ట సేవలను ప్రయాణికులకు అందిస్తున్నాయి. చెన్నై బీచ్ - తాంబరం - చెంగల్పట్టు మార్గాల్లో పది, పదిహేను నిమిషాలకో రైలు పట్టాలపై పరుగులు తీస్తుంటాయి. సోమవారం ఉదయం బీచ్ నుంచి చెంగల్పట్టుకు ఈఎంయూ రైలు బయలు దేరింది. ఉదయాన్నే కిక్కిరిసిన జనంతో బయలుదేరిన ఈ రైలు సరిగ్గా 6.55గంటలకు పల్లవరం స్టేషన్లో ఆగింది. రైలు బయలుదేరుతున్న సమయంలో వెనుక వైపుగా ఉన్న ఇంజిన్ వద్ద నుంచి పెద్ద శబ్దం రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. అదే సమయంలో నిప్పు రవ్వులు రావడంతో ఆందోళనలో పడ్డారు. అయినా, రైలు ముందుకు కదలడంతో భయాందోళనకు గురయ్యారు. రైలు బయలు దేరిన క్షణాల్లో ముందు వైపుగా ఉన్న ఇంజిన్ వద్ద నుంచి పెద్ద శబ్దం రావడంతో ఆందోళన రెట్టింపు అయింది. ఆ రైలు హఠాత్తుగా ఆగడంతో భయంతో రైలు నుంచి ఫ్లాట్ ఫామ్ మీదకు జనం పరుగులు తీశారు. ఏదో ప్రమాదం జరిగిందన్న ఆందోళనతో ఒకరిని చూసి మరొకరలు బయటకు పరుగులు తీశారు. అప్రమత్తం: ఫ్లాట్ఫామ్పై కలకలం రేగడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులు ఆందోళన చెంద వద్దని, అందరూ రైలు నుంచి దిగేయాలని సూచిస్తూ మైక్ ద్వారా ప్రకటన చేశారు. కాసేపు ఆ రైల్వే స్టేషన్లో నెలకొన్న తోపులాట, గందరగోళం దీంతో సద్దుమణిగింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న రైల్వే అధికారులు పరిశీలించారు. రైలు ఇంజిన్ నుంచి హైవోల్టేజ్ విద్యుత్ తీగలకు జత పరిచే రాడ్లు తెగిపోవడం వల్లే శబ్దంతోపాటు నిప్పురవ్వులు వచ్చినట్టు గుర్తించారు. మరమ్మతులు పూర్తి చేసి రైలును ముందుకు నడిపించే యత్నం చేశారు. కానీ అక్కడి నుంచి రైలు ముందుకు సాగలేదు. దీంతో ఆ మార్గంలో రైలు సేవలు ఆగిపోయూయి. ఎక్కడికక్కడ ఈఎంయూ రైళ్లను ఆపేశారు. తాంబరం నుంచి మరో ఇంజిన్ను రప్పించి ఈ రైలును లాక్కెళ్లారు. ఈ ఘటనతో బీచ్ - తాంబరం మార్గంలో గంట సేపు రాక పోకలు ఆగాయి. ఎక్స్ప్రెస్ రైళ్లు వెళ్లే మార్గంలో కొన్ని రైళ్లను మళ్లించినా, ఇతర రైళ్ల రాక పోకలకు ఆలస్యమైంది. దక్షిణాది నుంచి ఎగ్మూర్కు రావాల్సిన అనేక రైళ్లు గంట ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురి కావాల్సి వచ్చింది. పల్లవరం స్టేషన్ సిబ్బంది సకాలంలో స్పందించి ప్రయాణికులకు భరోసా ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది.