జూన్లోపు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి
ఎండోమెంట్ ట్రిబ్యునల్పై దేవాదాయ శాఖకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి జూన్ వరకు హైకోర్టు గడువునిచ్చింది. జూన్లోపు ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయకుంటే దేవాదాయశాఖ కార్యదర్శి స్వయంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో దేవాదాయ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్లోని దత్తాత్రేయ, నవగ్రహ దేవస్థాన పాలక మండలి హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ప్రభుత్వ వివరణ కోరారు.
ట్రిబ్యునల్ ఏర్పాటు పరిశీలనలో ఉందని, 8 వారాల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్ కోర్టులో రాతపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నాగార్జునరెడ్డి 8 వారాల్లో ఎండోమెంట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి, చైర్మన్, సభ్యులను నియమించాలని ఆదేశిస్తూ గత ఏడాది డిసెంబర్ 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో పిటిషనర్ దేవాదాయశాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేశారు. దీనిని జస్టిస్ నాగార్జునరెడ్డి శుక్రవారం విచారించారు.