environmental scientists
-
గ్రీష్మవర్షం
‘దేవుడికేం హాయిగ ఉన్నాడూ, మానవుడే బాధలు పడుతున్నాడూ’ అంటాడో సినీకవి. అనాదిగా జరుగుతున్నదీ, మనం అంతగా గమనించనిదీ ఏమిటంటే, ఈ చరాచర జగత్తు మొత్తానికి మనిషి తనే కేంద్రస్థానమనుకుంటాడు; ఈ విశ్వరచన అంతా తన కోసమేననీ, తనే సృష్టిచక్రం తిప్పు తున్నాననే భ్రమలోకి జారిపోతూ ఉంటాడు, తన బాధ ప్రపంచ బాధగా ఊహించుకుంటాడు. నిజానికి మనిషే కాదు, ప్రతి జంతువూ, చెట్టూ, పిట్టా కూడా అలాగే అనుకుంటాయేమో కూడా!కానీ కొంచెం సూక్ష్మంగా యోచిస్తే, దేవుడూ, లేదా ప్రకృతీ కూడా అంత హాయిగా ఏమీలేనట్టూ, తమవైన బాధలను, సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నట్టూ అర్థమవుతుంది. మనం దేవతగా భావించే భూమినే తీసుకుంటే, తన వందల కోట్ల సంవత్సరాల ఉనికిలో అదెన్ని బాధలు పడిందో, ఎన్నెన్ని అస్తిత్వ సమస్యల నెదుర్కొందో, ఎంతటి అస్థిరత్వానికి, అనిశ్చితికి గురైందో భూభౌతిక విజ్ఞానం మనకెంతో కొంత అవగాహన కలిగిస్తూనే ఉంది. మొదట భూమి మొత్తం మండిపోయే ఓ అగ్నిగోళం. క్రమంగా ఉపరితలం చల్లబడుతూ వచ్చింది. అయినా ఇప్పటికీ లోపల, తాపమానం మీద వందల, వేల డిగ్రీల మేరకు సెగలూ, పొగలూ కక్కుతూనే ఉందంటారు. ఆ పైన లక్షల సంవత్సరాల నిడివిగల మంచుయుగాలు, జలప్రళయాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, అంతర్గత ప్రకంపనాలతో అతలాకుతలమవుతూనే వచ్చింది. అప్పుడు తను కూడా మనిషిలానే, తనకన్నా పైన ఉన్న ఏ తీవ్రశక్తినో ఉద్దేశించి, ‘దేవుడికేం హాయిగ ఉన్నా’డని పాడుకునే ఉంటుందేమో! మరీముఖ్యంగా తన ప్రకృతి గమనానికి సంబంధించి భూమి తనదైన ఓ ఋతుభ్రమణాన్ని నిర్దేశించుకుని అదే స్థిరమూ, శాశ్వతమూ అని కూడా భ్రమిస్తూ ఉండచ్చు. ఇక్కడే మనిషికీ, భూమికీ మరో పోలిక. మనిషి కూడా తనదైన ఓ ఋతుచక్రాన్ని కల్పించుకుని, దానినో కాలచక్రంలో బంధించాననుకుంటాడు. తను కోరుకున్నట్టే అవి తిరుగుతూ ఉంటాయనుకుంటాడు. కానీ, తన పైనున్న శక్తులు తను నిర్దేశించుకున్న ఋతుభ్రమణాన్ని తలకిందులు చేయగలవన్న ఎరుక భూమికి తరచు తప్పినట్టే, ప్రకృతి తన ఋతుచక్రాన్ని వెనక్కి తిప్పగలదన్న ఎరుక మనిషికీ తప్పుతుంది. అసలు ప్రకృతీ, తనూ అనుసరించే ఋతుకాల సూచికలు ఒకటే కావాల్సిన అవసరం లేదన్న గ్రహింపూ మనిషికి లోపిస్తూ ఉంటుంది. ఇంతకీ సంగతేమిటంటే, ఈ ఏడాది దేశంలోని పలు ప్రాంతాలు గ్రీష్మతాపాన్ని చవిచూడకుండానే వర్షర్తువు చొరబడిపోయింది. ఆ విధంగా గ్రీష్మానికి, వర్షర్తువుకు మనం నిర్దేశించుకున్న కాలిక మైన హద్దుల్ని ప్రకృతి మరోసారి చెరిపేసింది. దాంతో వాతావరణ, పర్యావరణ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగిపోయి వర్షపాతానికి సంబంధించిన చారిత్రకమైన గణాంకాలు, ఇతర వివరాల కవిలె కట్టల్ని బయటికి తీసి శోధించడం ప్రారంభించారు. కేరళనే తీసుకుంటే, నైరుతి ఋతుపవనాలు 1975, 1990 తర్వాత మళ్ళీ ఇప్పుడే అక్కడికి వారం రోజుల ముందు అడుగుపెట్టాయంటున్నారు. దేశం ఇతర ప్రాంతాలలో ఇలా జరగడం 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడేనంటున్నారు. ఆ పైన ఈసారి కేరళతోపాటు, తమిళనాడులోనూ, కర్ణాటక, మహారాష్ట్రలలోని అత్యధిక ప్రాంతాలలోనూ నైరుతి ఋతుపవనాలు మామూలు గడువుకన్నా ముందు రావడమే కాకుండా; ఒకే రోజున ఒకేసారి పెద్ద ఎత్తున ముంచెత్తడాన్ని విశేషంగా చూపుతూ, ఇలా జరగడం 1971 తర్వాత ఇదే మొదటిసారి అంటున్నారు. మళ్ళీ ఇంకోవైపునుంచి చూస్తే, 1970లనుంచీ ఒక పద్ధతి ప్రకారం ఋతుపవనాల రాకలో ఆలస్యం జరుగుతోందంటున్నారు. మొత్తంమీద సంవత్సరాల వారీగా వర్షర్తువు చరిత్రనైతే నమోదు చేయగలుగుతున్నా, అది ఒక్కోసారి గడువు కన్నాముందే ఎందుకు తొలకరించి పలక రిస్తుందో, ఒక్కోసారి ఎందుకు వేళతప్పిన అతిథి అవుతుందో ఇప్పటికీ కారణాలు అంతుబట్టక శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అలాగని వాతావరణ, పర్యావరణ రంగాల్లో వైజ్ఞానికంగా మనం వేసిన అంగలు చిన్నవేమీ కావు. వర్షాలు ఎందుకు పడతాయో, ఎందుకు పడవో మనకిప్పుడు బాగా తెలుసు. నేలమీది శీతోష్ణాలు, సముద్రాలమీది శీతోష్ణాలు చెట్టపట్టాలు వేసుకుని విడతలవారీగా అల్పపీడనాలను సృష్టిస్తూ వర్షపాతానికి ఎలా కారణమవుతాయో; మారిషస్, మడగాస్కర్ల సమీపంలో పుట్టుకొచ్చే సోమాలీ నిమ్నవాయువులూ, పసిఫిక్ గాలులూ అరేబియా సముద్రం, బంగాళాఖాతాల దాకా వ్యాపించి మన గడ్డమీద వర్షాలకు, లేదా వర్షాభావాలకూ కూడా ఎలా దోహదం చేస్తాయో, ప్రత్యేకించి హిమాలయాలు మన దగ్గర వర్షసామ్రాజ్యాన్ని ఎలా శాసిస్తున్నాయో మనకిప్పుడు మరింత స్పష్టంగా తెలుసు. అసాధారణ ఉపరితల ఉష్ణోగ్రతలను సంకేతించే ‘ఎల్ నినో’, అంతే అసాధారణ శీతలత్వాన్ని సూచించే ‘లా నినా’ అనే వాతావరణ ధోరణులకూ – వర్షాల రాకడకూ, పోకడకూ, ఇతర పరిణామాలకూ ఉన్న సంబంధం గురించిన అవగాహన కూడా మనకుంది. అయినాసరే, గడువుకు ముందే వర్షాలు, వర్షాభావాలూ, వర్షాలస్యాల వెనుక ప్రకృతి అనుసరించే సూత్రబద్ధత ఏమిటో ఇప్పటికీ అంతుబట్టని బ్రహ్మపదార్థంగానే ఉంది. మనకు సరే, ప్రకృతికి మాత్రం అది అంతుబట్టిందా అన్నది అంతిమ ప్రశ్న. అదలా ఉంచితే, ముందుస్తు వర్షాలు రేపటి ఆశల విరిజల్లులను తలపించి సంతోషభరితం చేస్తాయి కానీ, దురదృష్టవశాత్తూ ప్రతిసారి అవి వర్షపుష్కలత్వానికి హామీ ఇవ్వకపోవచ్చని శాస్త్రవేత్తలు పెదవి విరుస్తున్నారు. వారి భయాలు నిజం కాకూడదని మనసారా కోరుకుందాం. -
ఈ–బైక్ కొనాలంటే.. త్వరపడండి!
సాక్షి, అమరావతి: ఈ–బైక్ కొనాలనుకుంటున్నారా. అయితే, త్వరపడండి. ఈ ఏడాది జూన్ 1వ తేదీ తర్వాత రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై వర్తించే ఫేమ్–2 (దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం) పథకం కింద అందించే సబ్సిడీని తగ్గించాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ బైక్స్పై 15 శాతం నుంచి 40 శాతం వరకూ సబ్సిడీ లభిస్తుండటంతో వీటిని కొనుగోలు చేయడానికి వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా.. కేంద్ర నిర్ణయంతో ఇకపై వాహన ధరలో కేవలం 15 శాతం లేదా కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్)కు రూ.10 వేలు ఏది తక్కువైతే అది మాత్రమే సబ్సిడీగా లభించనుంది. భారీ షాక్ ఇది విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఏఎంఈ) పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం 2019–22 మధ్య మూడేళ్ల కాలానికి ఫేమ్ పథకంలో రూ.10 వేల కోట్లను కేటాయించింది. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)లను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించాయి. ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్టు కేంద్రం ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. దీనిద్వారా ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తోంది. ద్విచక్ర వాహనాలకు కిలోవాట్కు రూ.15 వేలను, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు రూ.10 వేలను, బస్సులకు రూ.20 వేలను రాయితీగా అందిస్తోంది. దీంతో ఏపీలో దాదాపు 22 వేలు, దేశవ్యాప్తంగా 4 లక్షల విద్యుత్ వాహనాల విక్రయం జరిగింది. కానీ సబ్సిడీని కుదిస్తున్నట్టు ప్రకటించి తాజాగా కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే 4.9 శాతమే నిజానికి అంతర్జాతీయంగా ఈవీల శాతం పెట్రోల్ వాహనాలతో పోలిస్తే 20 శాతంగా ఉంది. మన దేశంలో ఇది కేవలం కేవలం 4.9 శాతం మాత్రమే. కనీసం అంతర్జాతీయ బెంచ్ మార్క్ను చేరుకునే వరకైనా రాయితీలను కొనసాగిస్తే మంచిదనే వాదనలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితమే దీని గురించి చెప్పుకొచ్చింది. రానున్న నాలుగేళ్లలో 1 మిలియన్ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోనున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని స్పష్టం చేసింది. కానీ ఒక లీటర్ పెట్రోల్ 2.3 కిలోల కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ఈవీల కొనుగోలు తగ్గితే 2030 నాటికి 1 మిలియన్ కర్బన ఉద్గారాలను (కాలుష్యం) తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదాతల్లో ఆందోళన
ముఖం చాటేసిన వరుణుడు ఎండుతున్న పంటలు తూర్పులో ఓ మోస్తరు వానలు.. పశ్చిమలో వర్షాభావం సగం మండలాల్లో పంటలు అంతంతే హన్మకొండ : వరుణుడు ముఖం చాటేశాడు. అన్నదాతలు ఆందోళనగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలకు కొదువ ఉండదని వాతావరణ శాస్త్రవేత్తలు ఊ(హి)రించారు. అయితే జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు కురవగా, పశ్చిమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు రైతులను పట్టి పీడిస్తున్నాయి. తొలకరి జల్లులతో దుక్కులు చేసిన రైతులు, అనంతరం కురిసిన వర్షాలతో విత్తనాలు వేశారు. జూన్లో అడపా దడపా వర్షాలు కురవగా, జూలై నెల రైతుల్లో ఆశలు రేకెత్తిం చింది. దీంతో ఇక పంటలకు ఇబ్బంది లేదని భావించారు. అయితే ఆగస్టులో వరుణుడు ముఖం చాటేయడంతో వారి ఆశలు ఆవిరయ్యా యి. ఈనెల 2, 3 తేదీలలో జిల్లా అంతటా వర్షం కురిసింది. ఇక అదే చివరిది. ఆ తర్వాత తూర్పు ప్రాం తంలోని పది మండలాల్లో మరో రెండు రోజులు వర్షం కురిసినా.. 20 రోజులుగా చుక్కనీరు పడలేదు. దీంతో జిల్లాలో మెట్ట పంటలు ఎండుతున్నాయి. ప్రధానంగా జనగామ, స్టేషన్ఘన్పూర్, డోర్నకల్, మహబూబాబాద్, వర్థన్నపేటతో పాటు పాలకుర్తి నియోజకవర్గంలోని సగం మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో జూన్లో ప్రాంతాల వారీగా 5 నుంచి 10 రోజులు, ఆగస్టులో సగటున 9 రోజులు మాత్రమే వర్షం కురిసింది. జూలైలో వర్షాలు పడినా అన్ని ప్రాంతాల్లో కురువలేదు. ఎండిన విత్తనాలు.. జూలై నెలలో వరుణుడు ఆశలు రేకెత్తించడంతో రైతులు విత్తనాలు వే శారు. అయితే ఆ తర్వాత వర్షాలు లేక అవి ఎండిపోతున్నాయి. ప్రధానంగా మొక్కజొన్న దెబ్బ తింటోంది. ఈ నెలాఖరు వరకు కూడా పరి స్థితి ఇలాగే ఉంటే ఇక ఆశ వదులుకోవాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్లో 50,015 హెక్టార్లలో మొక్కజొ న్న వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పత్తి వేయొద్దని ప్రభుత్వం ప్రచారం చేయడంతో రైతులు మొక్కజొన్నపై దృష్టి పెట్టారు. గ త ఖరీఫ్లో 43,260 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తే, ఈ ఖరీఫ్ లో 58,848 హెక్టార్లలో వేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షా లు అన్నదాతను ఆగమాగం చేస్తున్నాయి. వాతావరణ శాస్త్రజ్ఞులు వ ర్షా లు పడుతాయని చెప్పడంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. కానీ ఆ ఆశ లు ఎంతోకాలం నిలువలేదు. వర్షాలు లేక భూగర్భ జలాలు సైతం అ డుగంటయ్యాయి. దీంతో వరినాట్లు ఆశించిన మేర వేయలేదు. కొడకండ్ల, నర్సింహులపేట, డోర్నకల్, కురవి, బచ్చన్నపేట, మద్దూరు, చే ర్యాల, జనగామ, రఘునాథపల్లి తదితర మండలాల్లో వరినాట్లు అం తంత మాత్రమే వేశారు. వరి నాటు వేసినా భూగర్భ జలాలు లేక పం టలు ఎండిపోతున్నాయి. వరి పొలాలు నెర్రెలువారాయి. ఈ ఖరీ ఫ్లో 1,36,245 హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించినా ఇప్పటి వరకు 91 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. మరో 2900 హెక్టార్లలో నారు సిద్ధంగా ఉంది. కానీ సరిపడా నీరులేక నారు ఎండిపోతోంది. కురవి తదితర మండలాల్లో మిరప పంట పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులు బిందెలతో నీరు పోసి మెుక్కలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.