Fake liquor Mafia
-
ఆగని ‘కల్తీ’ మద్యం దందా..!
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఏడాది కాలంగా కల్తీ మద్యం దందా జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున కొనసాగుతున్నా ఎక్సైజ్శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో బెల్టుషాపులు కేంద్రంగా నకిలీ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న అనుమానం మద్యం ప్రియులు వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా రెక్టిఫైడ్ స్పిరిట్తో మద్యాన్ని తయారు చేసి పలురకాల బ్రాండ్లతో విక్రయించిన తీరు మద్యంప్రియులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఎన్నికల సీజన్లో కల్తీ మద్యం వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాల ద్వారా, బెల్టుదుకాణాల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కల్తీ మద్యం విక్రయదారులను పోచంపల్లితోపాటు, బాలాపూర్, వికారాబాద్లలో అరెస్టు చేశారు. మరో నెలరోజుల్లో మద్యం దుకాణాల లైసెన్స్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఎక్సైజ్ పోలీస్లు పట్టుకున్న మద్యంతో చీకటి వ్యాపారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పదిమంది నిందితులు అరెస్ట్ చేసిన పోలీస్లు మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. ఒరిజనల్గా నమ్మిస్తూ: అక్రమ మద్యం వ్యాపారులు రెక్టిఫైడ్ స్పిరిట్ను తమ రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి పలురకాల బ్రాండ్లకు చెందిన మూతలు, లేబుళ్లను కొనుగోలు చేసి పాత సీసాల్లో రెక్టిఫైడ్ స్పిరిట్ను నింపి వాటిలో మద్యం రంగు వచ్చే విధంగా క్యారామాల్ లిక్విడ్ను కలిపారు. మద్యం కొనుగోలుదారునికి ఎలాంటి అనుమానం రాకుండా ప్యాక్ చేసి ప్రభుత్వ సరఫరా లేబుళ్లను అంటించి అన్ని రకాల మద్యాన్ని డూప్లికేట్ సీసాల్లో ఒరిజినల్ ధరకే విక్రయించారు. బయటబడిన బండారం.. భూదాన్పోచంపల్లి మండలం అబ్దుల్లానగర్లో గత నెల 14న రెక్టిఫైడ్ స్పిరిట్తో క్యారామిల్ కలిపి మద్యాన్ని తయారు చేస్తున్న మద్ది అనిల్రెడ్డితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి లక్షల రూపాయలు విలువ చేసే రెక్టిఫైడ్ స్పిరిట్, క్యారామిల్ మద్యం సీసాల మూతలను పలు బ్రాండ్లకు సంబంధించిన లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సుమారు 10మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరికొంత మంది కోసం గాలింపు చేపట్టారు. భూదాన్పోచంపల్లి మండలం ముక్తాపూర్ శివారులో గత నెల 19న పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటి వరకు 10మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా మరో నలుగురి కోసం వెతుకుతున్నారు. భూదాన్పోచంపల్లి మండలం అబ్దుల్లానగర్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న స్పిరిట్, సామగ్రి, మద్యం సీసాల మూతలు (ఫైల్) మూడు నెలలుగా జిల్లాలో నకిలీ మద్యం ఛాయలు గుర్తించినట్లు ఎక్సైజ్ పోలీసులు చెబుతుండగా అంతకంటే ముందు ఏడాది కాలంనుంచే కల్తీ దందా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం కేసులో తాజాగా మద్యం సీసాల నకిలీ మూతలను విక్రయించే హైదరాబాద్కు చెందిన లాయిఖ్అలీ, స్టిక్కర్స్ను విక్రయించే హైదరాబాద్కు చెందిన సుదీర్లను ఇప్పటికే అరెస్టు చేయగా తాజాగా స్పిరిట్ను సరఫరా చేసే తాండూరుకు చెందిన మొగులప్ప స్టిక్కర్స్ను కొనుగోలు చేసిన మహబూబాబాద్కు చెందిన శశాంక్గౌడ్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. అయితే ఢిల్లీలో హోలోగ్రామ్స్ తయారు చేసే కంపెనీపై దృష్టిసారించిన పోలీసులు అక్కడి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ మద్యం కేసులో కర్ణాటకకు చెందిన ఇద్దరు, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరు చొప్పున నిందితుల వేటలో పోలీసులు బిజీగా ఉన్నారు. బెల్టుషాపుల ద్వారా విక్రయం.. నకిలీ మద్యం కొన్ని మద్యం షాపులతోపాటు బె ల్టుషాపుల్లో పెద్ద ఎత్తున విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నారా యణపూర్, చౌటుప్పల్ మండలం మల్కాపూర్లో మద్యం దుకాణాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులై న అనిల్రెడ్డితోపాటు మరికొంత మంది తమ కు తెలిసిన వారి ద్వారా జిల్లాతోపాటు హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్జిల్లాల్లో విక్రయించినట్లు ఇప్పటికే బయటపడింది. నకిలీ మద్యం కేసును ఛేదించడం ద్వారా జిల్లాలో భారీ రాకెట్కు తెరదించినట్లైందని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. నిందితులందరినీ పట్టుకుం టామని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. -
నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు
సాక్షి, పరిగి/తాండూరు: నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టయింది. యాదాద్రి జిల్లా భూదాన్పోచంపల్లిలో తీగలాగితే వికారాబాద్ జిల్లాలో డొంక కదిలింది. యాదాద్రి, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీకి వినియోగించే ముడి పదార్థాలైన స్పిరిట్, లేబుల్స్, మూతలు తదితర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. నాలుగు రోజుల క్రితం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసి నకిలీ మద్యంతో పాటు మద్యం తయారీకి వినియోగించే సామగ్రిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. కర్ణాటక, తాండూరు ప్రాంతం నుంచి ముడి పదార్థాలు సరఫరా అవుతున్నట్లు బయటపడింది. దీంతో యాదాద్రి, వికారాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు తమ సిబ్బందితో కలిసి సోమవారం జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్దేముల్ మండలం నాగులపల్లిలో బెల్టు షాపు నిర్వహిస్తున్న బిచ్చయ్య, మరో వ్యక్తి మొగులయ్య నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మొగులయ్యను అదుపులోకి తీసుకోగా బిచ్చయ్య పరారయ్యాడు. నాగులపల్లిలో తమ ఇళ్లలో తనిఖీలు చేసి లేబుళ్లు, స్పిరిట్ తదతితర మద్యం తయారీకి వినియోగించే ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోమలోనూ తనిఖీలు మొగులయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో దోమ మండల కేంద్రానికి చెందిన బెస్ల లక్ష్మణ్కు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో దోమలో సైతం దాడులు నిర్వహించి లక్ష్మణ్ ఇంట్లో మద్యం తయారికీ వినియోగించే ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, నకిలీ మద్యం తయారీ ప్రస్తుతం కాస్త మందగించినా గత ఎన్నికల సమయంలో పెద్దమొత్తంలో తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా దోమ మండల కేంద్రంలో 150 నకిలీ లేబుల్స్, నాలుగు లీటర్ల స్పిరిట్, మద్యం బాటిళ్లను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. మద్యం షాపుల్లో సోదాలు సోమవారం మొత్తం అధికారులు మద్యం షాపుల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిం చారు. దోమ, పెద్దేముల్, తాండూరులో తనిఖీలు చేశారు. నకిలీ మద్యం వైన్ షాపులకు ఏమైనా సరఫరా అవుతుందా.. అనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి ఎన్ఫోర్స్మెంట్ సీఐ భరత్భూషన్, పరిగి సీఐ చంద్రశేఖర్ ఇతర సిబ్బంది తనిఖీల్లో ఉన్నారు. -
అన్ని మాఫియాలూ విజృంభిస్తాయి
ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా వర్గాలు హుండీ, హవాలా దందాలపై కన్నేయండి అధీకృత సంస్థల లావాదేవీలూ పరిశీలించండి ఫేక్ కరెన్సీ ముఠాలపై నిఘా ముమ్మరం చేయండి నకిలీ మద్యం మాఫియా విజృంభించే ప్రమాదం సాక్షి, హైదరాబాద్: ఎంపీటీసీ నుంచి లోక్సభ వరకు అన్ని ఎన్నికలు వరుసగా రావడంతో బందోబస్తులు, భద్రతా ఏర్పాట్లతోపాటు పైకి కనిపిం చని సమస్యలు మరెన్నో ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నాయి. వీటన్నింటికీ మించిన ఆందోళనకర కోణాలను కేంద్ర నిఘా వర్గాలు వెలుగులోకి తెచ్చాయి. ధనం, మద్య ప్రవాహాలతో పాటు వీటితో ముడిపడిన మాఫియాలు సైతం విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మాఫియాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించాయి. ఏవైనా రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా అంటారు. ఓ దేశంలోనే వివిధ ప్రాంతాల మధ్య జరిగే డబ్బు మార్పిడిని హుండీ అంటారు. సాధారణంగా ఈ రెండు మార్గాలను పన్ను ఎగ్గొట్టేందుకు వ్యాపారులు వినియోగిస్తుంటారు. ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులు అనధికారిక ఖర్చుల కోసం వీటినే ఆశ్రయిస్తారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ రెండింటితో పాటు అధీకృత మార్పిడిదారుల లావాదేవీలనూ నిశితంగా పరిశీలించాలని సూచించాయి. భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు అనేక ఉగ్రవాద సంస్థలూ నకిలీ నోట్లను ముద్రిస్తున్నాయి. వీటిని స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ముఠాల సాయంతో బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్కు చేర్చి, అక్కడి నుంచి దేశంలోని మిగతా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ‘ఎన్నికల ఖర్చుల’కు అవసరమైన డబ్బు కోసం అనేక మార్గాలను అన్వేషించే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ నోట్లను భారీ స్థాయిలో చెలామణి చేయడానికి ముఠాలు ప్రయత్నిస్తాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ నేరాల్లో ఆరితేరిన ముఠాలతోపాటు ఎన్నికల కారణంగా పెరిగిన డిమాండ్ను ఆసరా చేసుకొని కొత్త ముఠాలూ పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించాయి. నకిలీ నోట్ల ముఠాలపై నిఘా ముమ్మరం చేయాలని సూచించాయి. దుబాయ్ కేంద్రంగా జరిగే హవాలా వ్యాపారంలో ప్రతి ముఠాకూ రెండు చోట్లా ఏజెంట్లు ఉంటారు. నగదు పంపాల్సిన వారు దుబాయ్లో ఉన్న ఏజెంట్కు డబ్బు అందిస్తే.. అతడి ద్వారా సమాచారం అందుకునే భారత్లోని ఏజెంట్ ఆ మొత్తాన్ని ఇక్కడ డబ్బు అందుకొనే వారికి ఇస్తాడు. ఇప్పుడు ఈ పంథా మారింది. దుబాయ్లో ఏజెంట్లు తీసుకున్న డబ్బు అక్కడున్న మాడ్యూల్తో పాటు పాకిస్థాన్లోని ప్రధాన సూత్రధారులు పంచుకుంటున్నారు. తిరిగి భారత్లో చెల్లించడానికి మాత్రం ఉత్తరాదిలో ఏర్పాటు చేసుకున్న ముఠాలతో సైబర్ నేరాలు చేయించి, ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీకి వినియోగిస్తున్నారు. ఇలాంటి ముఠాలు పెద్ద మొత్తంలో పంజా విసురుతాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఓటర్లను ప్రలోభపరచడానికి మద్యాన్నీ భారీగా వినియోగిస్తుంటారు. ఖర్చు లెక్కల్లో చూపించకుండా ఉండేందుకు అనేక మార్గాల్లో మద్యాన్ని కొంటారు. దీన్ని అదునుగా చేసుకుని నకిలీ మద్యం మాఫియా కూడా రెచ్చిపోతుందని నిఘా వర్గాలు అంచనావేశాయి. మద్యం మాఫియాల ప్రభావం నేరుగా ప్రజలపై పడుతుందని, తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించాయి.