ఉగ్ర చెర నుంచి ఫాదర్కు విముక్తి
మస్కట్: యెమెన్లోని ఇస్లామిక్ ఉగ్ర వాదుల చెరలో 18 నెలలుగా బందీగా ఉన్న భారత్కు చెందిన ఫాదర్ థామస్ ఉఝూనాలిన్ను సురక్షితంగా కాపాడామని మంగళవారం ఒమన్ ప్రకటించింది. కేరళకు చెందిన మతప్రబోధకుడు థామస్ 2010 నుంచి యెమెన్లోని అడెన్ కేర్ హోంలో సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 2016లో ఉగ్రవాదులు కేర్హోంపై దాడి చేసి 16 మందిని దారుణంగా హతమార్చి, థామస్ను అపహరించారు. థామస్ చివరిసారిగా గతేడాది డిసెంబర్లో ఓ వీడియోలో కనిపించాడు. అందులో తనను రక్షించాల్సిందిగా ప్రధాని మోదీ, పోప్ ఫ్రాన్సిస్ను అభ్యర్థించాడు.
దీంతో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ యెమెన్ డిప్యూటీ ప్రధానితో మాట్లాడి ఆయన విడుదలకు చొరవ చూపాలని కోరారు. ఒమన్ సుల్తాన్ సూచన మేరకు యెమెన్తో కలసి ఆయనను విడిపిం చామని ఆ దేశం తెలిపింది. ఆయన విడుదలకు సంబంధించి తాజా ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. ఉగ్రవాదుల చెర నుంచి ఫాదర్ థామస్ విడుదల కావటం పట్ల కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ట్వీటర్లో ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవుడి దయ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని, తన విడుదల కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని థామస్ వ్యాఖ్యానించారు.