మమత, గవర్నర్ల మధ్య వాగ్యుద్ధం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శనివారం ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. బెంగాల్లో టోల్ గేట్ల వద్ద ఆర్మీని మోహరించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. ఈ విషయంపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి మమతను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఆర్మీ లాంటి బాధ్యతాయుతమైన వ్యవస్థలపై ఆరోపణలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ఆర్మీని అప్రతిష్టపాలు చేయకూడదు’ అని అన్నారు.
అనంతరం మమత స్పందిస్తూ ‘గవర్నర్ కేంద్ర ప్రభుత్వం పక్షాన మాట్లాడుతున్నారు. ఆయన ఎనిమిది రోజులుగా నగరంలో లేరు. ఏదైనా మాట్లాడేముందు అన్ని వివరాలను సరిచూసుకోవాల్సింది. ఆయన ఇలా మాట్లాడటం దురదృష్టకరం’ అన్నారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తర్వాత గవర్నర్ పేర్కొన్నారు.