gurukula trust lands
-
అంగుళమూ వదలొద్దు!
-
'టీఆర్ఎస్ నేతల ఇళ్లను వదిలి మిగతావారిపై పడ్డారు'
హైదరాబాద్ : అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండోరోజు కూడా కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. కాగా కట్టడాల కూల్చివేతను శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మంగళవారం అడ్డుకున్నారు. కూల్చివేతలను ఆపివేయాలని ఆయన ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరారు. అయితే కూల్చివేతలు ఆపేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. దాంతో కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల ఇళ్లను వదిలి మిగతా వారిపై పడ్డారని ఆయన ఆరోపించారు. తెలిసీ, తెలియక కొన్న భూములను రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ చేశారు. కాగా అక్రమ నిర్మాణాలపై చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గురుకుల ట్రస్ట్ భూముల్లోని అక్రమ నిర్మాణాల వివరాలను ఆగమేఘాల మీద ఆరా తీసి కూల్చివేతలు కూడా చేపట్టారు. ట్రస్ట్ భూముల్లో వెలిసిన కాలనీల్లో ఒకటైన అయ్యప్ప సొసైటీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సెంట్రింగ్ను, మరో భవనంపై పిల్లర్లను నిన్న ధ్వంసం చేశారు. దీంతో అయ్యప్ప సొసైటీలోని భవన యజమానుల గుండెల్లో దడ మొదలైంది. ఏ క్షణాన తమ భవనంపైకి వచ్చి పడతారోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
ఇదీ గురుకుల్ నేపథ్యం...
ఎన్నో ఏళ్లుగా ఈ వివాదం నలుగుతోంది. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఖానామెట్, ఇజ్జత్నగర్ ప్రాంతాల్లోని 627 ఎకరాల గురుకుల్ ట్రస్టు భూముల విషయంలో జనంలో భయం గూడుకట్టుకున్నా.. అక్కడ అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. ఇక్కడ ప్లాట్లున్న వారంతా ఏదో ఒక రకంగా ‘పెద్దల’ అండదండలున్న వారు కావడంతో అధికారులు, సర్కారీ హెచ్చరికలు తాత్కాలికంగానే పనిచేస్తున్నాయి. కొంతకాలం మిన్నకుండి తిరిగి అక్రమాలు యథావిధిగా సాగుతున్నాయి. గురుకుల్ ఘట్కేసర్ ట్రస్ట్కు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్, ఇజ్జత్నగర్లలో 627 ఎకరాల భూమి ఉంది. మేనేజింగ్ ట్రస్టీ కిషన్లాల్ ట్రస్ట్ భూమిని సత్యనారాయణ అనే వ్యక్తికి జీపీఏ ఇచ్చారు. సత్యనారాయణ 1980 నుంచి ఎకరాల కొద్దీ భూమిని విక్రయించారు. పలు సంస్థలు, సొసైటీలతో పాటు పలువురు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టారు. ఈ క్రమంలో 1,200 మంది శ్రీస్వామి అయ్యప్ప కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీగా ఏర్పడి గురుకుల్ ట్రస్టుకు చెందిన 110 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా చేశారు. వీటిలో 80 శాతం స్థలాల్లో భవనాలు వెలిశాయి. అనుమతులు లేకపోయినా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. ట్రస్టు భూముల్లో ప్రస్తుతం అయ్యప్ప సొసైటీతో పాటు సర్వే ఆఫ్ ఇండియా, బృందావన్ కాలనీ, భాగ్యనగర్ సొసైటీ, విఘ్నేశ్వర్ కాలనీ తదితర లేవుట్లు ఉన్నాయి. అయ్యప్ప సొసైటీకి సర్వే నెంబరు 140లో 1215 ప్లాట్లు, మరో లేఔట్లో వేర్వేరు సర్వే నెంబర్లలో వెయ్యికిపైగా ప్లాట్లున్నాయి. 2002లో ఈ అక్రమ విక్రయాల్ని గుర్తించిన ప్రభుత్వం ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ట్రస్ట్కు చెందిన భూముల అమ్మకాలు చెల్లవని స్పష్టం చేసింది. దీంతో భూములు కొన్న వారిలో కొందరు కోర్టుకు వెళ్లారు. అయితే ఆ అమ్మకాలు చెల్లవని, కొనుగోలు చేసిన వారి పత్రాలకు విలువ లేదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, తదుపరి నిర్మాణాలు జరగకుండా ఆ భూములపై స్టేటస్కో ఆదేశాలిచ్చింది. ఈ విషయంలో దేవాదాయ శాఖకు తగిన విధంగా సహకరించాల్సిందిగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు సూచించింది. ప్లాట్లు కొనుగోలు చేసిన వారి విజ్ఞప్తులతో 2006లో ఈ అంశంపై సమీక్ష జరిపిన అప్పటి ప్రభుత్వం.. అయ్యప్ప సొసైటీలోని నిర్మాణాల కూల్చివేతను నిలిపివేసింది. ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కూడా హెచ్చరించింది. ఇందుకోసం సొసైటీలోకి భవన నిర్మాణ సామాగ్రి రాకుండా నిషేధించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. అయితే అది సాధ్యం కాదని అధికారులు పేర్కొన్నారు. అనంతర కాలంలోనూ యథేచ్చగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. వీటిని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు 2007 ఏప్రిల్లో కూల్చివేతలు జరిపారు. దీంతో తమ భవనాల్ని క్రమబద్ధీకరించేంత వరకు ఎలాంటి అదనపు నిర్మాణాలు జరపబోమని బాధితులు స్థానిక మునిసిపల్ అధికారులకు అండర్టేకింగ్ ఇచ్చారు. ఇంత జరిగినా అదనపు నిర్మాణాలు, అక్రమాలు ఆగలేదు. తిరిగి 2011 ఆగస్టులో అప్పటి కమిషనర్ కృష్ణబాబు భారీఎత్తున కూల్చివేతలు జరిపారు. అప్పట్లో 88 భవనాలను కూల్చివేశారు. అనంతరం జే ఎన్టీయూ ఆర్కిటెక్ట్ విద్యార్థులతో సొసైటీలో సర్వే జరిపించారు. మొత్తం 1210 భవనాలున్నట్లు గుర్తించారు. ఇకపై అక్రమ నిర్మాణాలు రాకుండా చూస్తామని, అదనపు అంతస్తులు వెలియకుండా ఎప్పటికప్పుడు నిఘాతో పటిష్ట ఏర్పాట్లు చేస్తామన్నారు. కొద్దిరోజుల పాటు సాగిన ఆ ప్రక్రియ తర్వాత ఆగిపోయింది. మళ్లీ అక్రమ అంతస్తులు వెలిశాయి. కూల్చిన భవనాలు మళ్లీ లేచాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి సమీక్షలోనే ట్రస్ట్ భూముల విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించడంతో అప్రమత్తమైన అధికారులు ఇక్కడి అక్రమ నిర్మాణాలపై ఆరా తీశారు. కేసీఆర్ తాజా ఆదేశాలతో తిరిగి చర్యలకు ఉపక్రమించారు. -
అంగుళమూ వదలొద్దు!
‘గురుకులం’ అక్రమ నిర్మాణాలపై టీ-సర్కారు చర్యలు సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీ సమీపంలోని గురుకుల ట్రస్ట్ భూముల అన్యాక్రాంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటితో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గురుకుల ట్రస్ట్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని తిరిగి పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవ సరమైతే అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కూడా స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)తో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. గ్రేటర్లో వెలిసిన అక్రమ కట్టడాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. వందలాది ఎకరాల గురుకుల భూములను కబ్జా చేసి అనధికారికంగా నిర్మించిన భవనాలకు కరెంటు, నీటి కనెక్షన్లు ఇవ్వడమేంటని, అది నిబంధనలకు విరుద్ధం కాదా? అని అధికారులను ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలకు అధికారులు సౌకర్యాలు కల్పించడాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. గురుకుల ట్రస్టు భూముల్లో అంగుళం అన్యాక్రాంతమైనా ఊరుకునేది లేదన్నారు. ఈ భూముల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందన్నారు. అనధికారికంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసే సందర్భంలో పోలీసుల సాయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్న నిర్మాణాల్లో ఏవైనా ఉల్లంఘనలు ఉంటే నోటీసులు జారీ చేసి, వాటిని సవరించుకునేలా చూడాలని అదేశించారు. అనుమతి లేని నిర్మాణాలకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, వాటిని కూల్చేయాలని స్పష్టం చేశారు. గురుకుల ట్రస్టు భూముల్లోనే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలు తప్పవని, ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని కేసీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గురుకుల ట్రస్ట్ భూముల్లోని అక్రమ నిర్మాణాల వివరాలను ఆగమేఘాల మీద ఆరా తీసి కూల్చివేతలు కూడా చేపట్టారు. ట్రస్ట్ భూముల్లో వెలిసిన కాలనీల్లో ఒకటైన అయ్యప్ప సొసైటీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సెంట్రింగ్ను, మరో భవనంపై పిల్లర్లను సోమవారం ధ్వంసం చేశారు. దీంతో అయ్యప్ప సొసైటీలోని భవన యజమానుల గుండెల్లో దడ మొదలైంది. ఏ క్షణాన తమ భవనంపైకి వచ్చి పడతారోనని తీవ్ర ఆందోళనకు గుర వుతున్నారు. మరోవైపు మంగళవారం నాడు భారీ ఎత్తున కూల్చివేతలకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో సొసైటీ సభ్యులు అత్యసవరంగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై యజమానులు చర్చించుకున్నారు. చర్యలు తీసుకుంటాం గురుకుల ట్రస్ట్ భూముల్లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. గత మూడేళ్లలో అక్రమంగా వెలసిన భవనాలనుగుర్తించి కూల్చివేతలు జరుపుతాం. తిరిగి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు ఇరవైనాలుగు గంటలూ నిఘా ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మూడు బృందాలను షిఫ్టుల ప్రకారం విధుల్లో ఉంచుతాం. రాత్రి వేళ నిర్మాణాలు జరిగినా గుర్తించి చర్యలు తీసుకుంటాం. - సోమేశ్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ వీఐపీలెందరో..! ట్రస్ట్ భూముల్లో భవనాలున్న వారు సామాన్యులేమీ కాదు. అంతా ప్రముఖులే! రాజకీయ, సినీ రంగాలకు చెందిన వారితోపాటు జీహెచ్ఎంసీలోని ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లు, ఉన్నతాధికారులకు సైతం ఇక్కడి సొసైటీల్లో భవనాలున్నాయి. చాలా వరకు బినామీ పేర్లతో ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్లకూ ఇక్కడ ఆస్తులున్నట్లు వినిపిస్తుంటుంది. ట్రస్టులో భూముల విలువ ప్రస్తుతం గజానికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉంది. సైబర్ టవర్ ముందు నుంచి రైల్వే ట్రాక్ వరకూ విస్తరించి ఉన్న వందల ఎకరాల్లో ఇప్పటికీ క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి.