యూటీ ఆలోచనే వద్దు: పీఆర్టీయూ
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే ఆలోచనలు చేయవద్దని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనకే కట్టుబడి ఉండాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండేకు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ ఇవ్వకుంటే.. సకల జనుల సమ్మె కోవలో మరోసారి సమ్మెకు సిద్ధమవుతామని ఆయనకు తెలిపింది.
పీఆర్టీయూ ప్రతినిధి బృందం బుధవారం హోంమంత్రి షిండేతో సమావేశమైంది. అనంతరం బృందం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రస్తావించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని షిండే హామీ ఇచ్చినట్టు తెలిపారు. పీఆర్టీయూ ప్రతినిధి బృందంలో పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.సరోత్తమ్రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్రెడ్డి తదితరులున్నారు.
హైదరాబాద్ను యూటీ చేస్తే సమరమే: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వకపోతే మళ్లీ సమరం చేస్తామని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ నేత కె.తారకరామారావు ఎంపీలు వివేక్, మంద జగన్నాధం, వేణుగోపాలచారిలతో కలిసి బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ను యూటీ చేయడం అంటే పెట్టుబడి, కబ్జాదారులకు కొమ్ముకాయడమేనన్నారు. హైదరాబాద్లో సమైక్య సభకు అనుమతివ్వడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు.
యూటీ అంటే తాటతీస్తాం: హరీష్
సిద్దిపేట: తలలు తెగిపడినా హైదరాబాద్ను యూటీగా ఒప్పుకోం అని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. హైదరాబాద్ యూటీ అంటే తాట తీస్తామని మెదక్జిల్లా సిద్దిపేటలో బుధవారం ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమన్నారు. హైదరాబాద్ను యూటీ చేస్తే ఆదాయం అంతా కేంద్రానికి వెళుతుందనీ, అపుడు రెండు ప్రాంతాలకూ నష్టం జరుగుతుందన్నారు.
యూటీ అంటే ఒప్పుకోం : ఈటెల
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం (యుూటీ)గా వూర్చేందుకు అంగీకరించబోవుని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ రూపొందించిన మహాశాంతి ర్యాలీ పోస్టర్ను ఈటెల రాజేందర్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ కన్వీనర్ కత్తి వెంకటస్వామి బుధవారం ఆవిష్కరించారు. ఈ నెల 7న హైదరాబాద్లో జరిగే మహా శాంతిర్యాలీలో లెక్చరర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. టీఎల్ఎఫ్ నేతలు సిద్దేశ్వర్, వసంత, గణేశ్, విజయకుమార్ పాల్గొన్నారు.
యూటీ అంటే ఇరువురికీ నష్టమే: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రను అంగీకరించబోమని, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేస్తే ఇరు ప్రాంతాలవారికీ నష్టమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ అన్నారు. యూటీ ప్రతిపాదనను ఎవరూ అంగీకరించరని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లోని సీమాంధ్రులకు విశ్వాసం కలిగించాలే తప్ప యూటీ పరిష్కారం కాదన్నారు. సమైక్యాంధ్రకు తాము అనుకూలం కాదని, ఈ నెల 7న హైదరాబాద్లో జరిగే సభకు తాము హాజరుకాబోమని నారాయణ తెలిపారు.
యూటీ అంటే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తాం: దానం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ను యూటీ (కేంద్రపాలిత ప్రాంతం) చేయాలనే ప్రతిపాదన వస్తే తాము వ్యతిరేకిస్తామని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి దానం నాగేందర్ తెలిపారు.