Indian-Origin Student
-
మేఘపై ఎంఐటీ క్రమశిక్షణ చర్య
మస్సాచుసెట్స్: పాలస్తీనా అనుకూల ప్రసంగం చేసిన భారత సంతతికి చెందిన మేఘ వేమూరిపై మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మేఘ పేరును ప్రస్తావించకుండా ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. ‘ఆ వ్యక్తి నేడు జరిగే స్నాతకోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, ఈ రోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించామన్న విషయాన్ని తెలియజేశాం’అని ఎంఐటీ ప్రతినిధి కింబర్లీ అలెన్ చెప్పారు. ‘ఎంఐటీ వాక్ స్వాతంత్య్రానికి మద్దతుగా నిలుస్తుంది. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా, పదే పదే నిర్వాహకులను తప్పుదారి పట్టించి, వేదికపై నుంచి నిరసనకు నాయకత్వం వహించింది. ఒక ముఖ్యమైన వేడుకకు అంతరాయం కలిగించినందుకు ప్రతిస్పందనగా తీసుకున్న చర్యకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు. గురువారం మేఘ పాలస్తీనాకు అనుకూలంగా చేసిన ప్రసంగం ఆన్లైన్లో వైరలవుతోంది. కాగా, శుక్రవారం జరిగే స్నాతకోత్సవం ప్రధాన కార్యక్రమంలో మేఘ షెడ్యూల్ ప్రకారం ప్రసంగించాల్సి ఉంది. అయితే, వివాదం నేపథ్యంలో ఆమెకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. -
ఎంఐటీ వేదిక నుంచి పాలస్తీనాకు సంఘీభావం
కేంబ్రిడ్జ్ (యూఎస్): పాలస్తీనా మాటెత్తితే చాలు, ఏకంగా యూనివర్సిటీలపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న వేళ భారత సంతతికి చెందిన మేఘ వేమూరి అనే విద్యార్థిని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జ్లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గ్రాడ్యుయేషన్ వేదిక నుంచి ఏకంగా పాలస్తీనాకు మద్దతు పలికారు. ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్తో తమ వర్సిటీ పరిశోధన ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకించారు. పాలస్తీనా సంఘీభావానికి ప్రతీకగా కెఫెయే (హిజాబ్ వంటిది) ధరించి మరీ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్నారు! తన ప్రసంగంలో పాలస్తీనాకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడికి అమెరికా మాత్రమే కాదు, మన యూనివర్సిటీ కూడా సాయం చేస్తోంది. వాటిని ప్రోత్సహిస్తోంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎంఐటీ విద్యార్థులు స్వేచ్ఛాయుత పాలస్తీనాను కోరుకుంటున్నారు. ఒక జాతి విధ్వంసాన్ని విద్యార్థులు సహించలేరు. మా జీవితాలను శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లు, విద్యావేత్తలు, నాయకులుగా తీర్చిదిద్దుకుంటాం. అలాగే ఆయుధ నిషేధానికి పిలుపునిచ్చేందుకు కూడా మేం అంతే కట్టుబడి ఉన్నాం. ఎంఐటీ పూర్వ విద్యార్థులుగా ఇజ్రాయెల్తో సంబంధాలను తెంచుకోవాలని వర్సిటీని డిమాండ్ చేస్తూనే ఉంటాం’’ అని ఆమె ఉద్ఘాటించారు. అమెరికాలో విద్యా రంగంలో అనిశ్చితి, విద్యార్థి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా మేఘ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా విద్యాసంస్థలపై అనిశ్చితి చీకట్లు కమ్ముకున్నాయన్నది బహిరంగ రహస్యం. తర్వాత ఏం జరగనుందనే ప్రశ్న మా మనస్సుల్లో ప్రతిధ్వనిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐటీ విద్యార్థులుజాతి విధ్వంసాన్ని సహించరుఅమెరికాలో చాలామంది విద్యార్థుల హృదయాల్లో భయాందోళనలు గూడుకట్టుకుని ఉన్నాయని మేఘ అన్నారు. ‘‘మేమంతా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జీవితాల్లో ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నాం. గాజాలో మాత్రం అసలు విద్యా సంస్థలే లేకుండా చేశారు. పాలస్తీనాను పూర్తిగా తుడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాల్లో ఎంఐటీ కూడా భాగస్వామి కావడం సిగ్గుచేటు. గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు ఎంఐటీ విద్యార్థులు పిలుపునిచ్చారు. క్యాంపస్లో పాలస్తీనా అనుకూల కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. వర్సిటీ నుంచే బెదిరింపులు, అణచివేత ఎదుర్కొన్నా వెనకడుగు వేయలేదు. ఎందుకంటే నాకు తెలిసి ఎంఐటీ విద్యార్థులు మారణహోమాన్ని ఎప్పటికీ సహించరు. జాతి విధ్వంసాన్ని హర్షించరు’’ అని స్పష్టం చేశారు. -
డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. -
భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆలాప్ నరసిపురా(20) కార్నెల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరంగ్ చదువుతున్నాడు. అయితే ఈనెల 17తేదీ నుంచి నరసిపురా కనిపించకుండా పోయాడు. ఫాల్ క్రీక్ ప్రాంతంలో ఓ మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించగా అది నరసిపురదిగా గుర్తించారు. అయితే నరసిపురా మృతిపై ఇప్పటివరకూ ఎలాంటి అనుమానాలు లేవని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విద్యార్థి వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ లంబద్రీ మాట్లాడుతూ నరసిపురా చురుకైన విద్యార్థి అని, తనతో రోజు ఫోటోలు దిగేవాళ్లం అని, బుధవారం ఉదయం కూడా నరసిపురాను చూసినట్లు తెలిపాడు. తాను ఇక్కడే మాస్టర్ డిగ్రీ చేయాలని ప్రణాళికలు వేసుకున్నాడని గుర్తుచేసుకున్నాడు. -
ఐబీడీపీ పరీక్షలో టాపర్గా ఎన్నారై విద్యార్థిని
సింగపూర్: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాకాలారైట్ డిప్లొమా పరీక్ష(ఐబీడీపీ)-2016లో సింగపూర్లోని ప్రవాస భారత విద్యార్థిని రసికా కాలె టాపర్గా నిలిచింది. 12వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఈ పరీక్షకు పోటీలో ఉన్న 40 దేశాల విద్యార్థులను అధిగమించి మొత్తం 45 పాయింట్లకు 45 సాధించింది. ఇందులో అర్హత సాధించిన వారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది. సింగపూర్లోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూలు(జీఐఐఎస్)లో చదువుతున్న రసికా కాలె.. ప్రజ్ఞ, ఆర్ట్స్ విభాగంలో తన ప్రతిభ చాటి టాపర్ గా నిలిచింది. జీఐఐఎస్ కు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు ఆరుషి ఖందేల్వాల్, రేవంద్ రాజేశ్, శిబిరంజిత్ నగేశ్ కూడా ఐబీడీపీలో 45 మార్కులకు 44 మార్కులు సాధించారు.