విదేశాలకు వెళ్లే వారు రక్షణ చర్యలు తీసుకోవాలి
విజయవాడ(లబ్బీపేట) ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లేవారు సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని నాన్ రెసిడెంట్ వ్యవహారాలు, పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ పి.వేమూరు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా పలు చట్టబద్దమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ, ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, యునైడెట్ నేషన్స్ మహిళా సంస్థ, ఆంతర్జాతీయ వలస సంస్థల సంయుక్త ఆద్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ గేట్వేలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ విదేశాలకు వలస వెళ్లేవారి స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రక్షిత, చట్టబద్దమైన వలసలకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు, కడప జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. వారికి సక్రమంగా, రక్షిత, చట్టబద్దంగా పంపేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సదస్సులో అంతర్జాతీయ వలస సంస్థ(ఐఓఎం) ప్రతినిధి డాక్టర్ మీరాసేథీ, యూఎన్ ఉమెన్ ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ ఆశా, భారత ప్రవాస మంత్రిత్వ శాఖ విశ్రాంత సెక్రటరీ కృష్ణకుమార్ తదతరులు పాల్గొన్నారు. మనదేశం నుంచి వెళ్తున్న మహిళా వలస కార్మికుల సమస్యలు, రక్షిత చట్టబద్దమైన వలసలు, విధి విధానాలు, స్కిల్స్ పెంపొందింపు వంటి అంశాలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.