breaking news
Jafrabad coast
-
పులి రాకతో ముగ్గురికి ముచ్చెమటలు!
నిన్నటికి నిన్న గుజరాత్ తీరంలో ఓ సింహం హల్ చల్ చేయగా.. తాజాగా ఓ పెద్దపులి నాగ్పూర్ లో పర్యాటకులకు ముచ్చెమటలు పట్టించింది. మహారాష్ట్ర నాగ్పూర్ లోని ఉమ్రెడ్ కర్హాండ్ల అటవీ జంతువుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు ఓపెన్ టాప్ జీపులో పర్యాటకులు బయలుదేరి వెళ్లారు. వారు అటవీ అందాలు వీక్షిస్తుండగా ఎక్కడినుంచి వచ్చిందో ఓ పెద్దపులి హఠాత్తుగా దర్శనమిచ్చింది. ఆ పులి నెమ్మదిగా నడుచుకుంటూ జీపు వద్దకు వచ్చింది. అప్పుడు ఆ జీపులో ఇద్దరు పర్యాటకులతోపాటు ఓ పిల్లాడు కూడా ఉన్నారు. జీపులో ఉన్న ముగ్గురిని పెద్దగా పట్టించుకోకుండా పులి మాత్రం వాహనం ముందు అద్దంతో కాసేపు ఆడుకుంది. ఈ కాసేపు ఆ ముగ్గురు ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉలుకు-పలుకు లేకుండా అలికిడి చేయకుండా చిత్రిత ప్రతిమల్లా ఉన్న వారిని పెద్దగా పట్టించుకోకుండానే పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. అదేవిధంగా గుజరాత్ అమ్రెల్లి జిల్లాలోని జఫ్రాబాద్ వద్ద ఓ సింహం సముద్రంలోకి దూకి ఈతకొడుతుండగా.. అటవీ అధికారులు పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించిన సంగతి తెలిసిందే. -
సింహం ఇలా దొరికిపోయింది...
గాంధీనగర్: అది గుజరాత్లోని అమ్రేలి జిల్లా జఫ్రాబాద్ పట్టణ తీరప్రాంతం. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ సింహం అరేబియా సముద్రతీరంలో స్థానికులకు కనిపించింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. సింహం సముద్రంలోకి దూకి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని జాలర్ల సాయంతో సింహాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. జాలర్లు, అధికారులు పడవలపై వెళ్లి అతికష్టమ్మీద సింహాన్ని పట్టుకుని మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అధికారులు దాన్ని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.


