
పులి రాకతో ముగ్గురికి ముచ్చెమటలు!
నిన్నటికి నిన్న గుజరాత్ తీరంలో ఓ సింహ హల్ చల్ చేయగా.. తాజాగా ఓ పెద్దపులి నాగ్పూర్ లో పర్యాటకులకు ముచ్చెమటలు పట్టించింది
నిన్నటికి నిన్న గుజరాత్ తీరంలో ఓ సింహం హల్ చల్ చేయగా.. తాజాగా ఓ పెద్దపులి నాగ్పూర్ లో పర్యాటకులకు ముచ్చెమటలు పట్టించింది. మహారాష్ట్ర నాగ్పూర్ లోని ఉమ్రెడ్ కర్హాండ్ల అటవీ జంతువుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు ఓపెన్ టాప్ జీపులో పర్యాటకులు బయలుదేరి వెళ్లారు. వారు అటవీ అందాలు వీక్షిస్తుండగా ఎక్కడినుంచి వచ్చిందో ఓ పెద్దపులి హఠాత్తుగా దర్శనమిచ్చింది. ఆ పులి నెమ్మదిగా నడుచుకుంటూ జీపు వద్దకు వచ్చింది. అప్పుడు ఆ జీపులో ఇద్దరు పర్యాటకులతోపాటు ఓ పిల్లాడు కూడా ఉన్నారు.
జీపులో ఉన్న ముగ్గురిని పెద్దగా పట్టించుకోకుండా పులి మాత్రం వాహనం ముందు అద్దంతో కాసేపు ఆడుకుంది. ఈ కాసేపు ఆ ముగ్గురు ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉలుకు-పలుకు లేకుండా అలికిడి చేయకుండా చిత్రిత ప్రతిమల్లా ఉన్న వారిని పెద్దగా పట్టించుకోకుండానే పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. అదేవిధంగా గుజరాత్ అమ్రెల్లి జిల్లాలోని జఫ్రాబాద్ వద్ద ఓ సింహం సముద్రంలోకి దూకి ఈతకొడుతుండగా.. అటవీ అధికారులు పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించిన సంగతి తెలిసిందే.