పోలీసులకు ప్రత్యేక శిక్షణ
అత్యాచారాల నిరోధంలో భాగంగా...
పోలీస్ ఉద్యోగాల భర్తీలో మహిళలకు 20 శాతం రిజర్వేషన్
సీఐడీ పనితీరు భేష్
హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సమాజంలో మహిళలు, బాలికలపై పెరిగిపోతున్న దౌర్జన్యాలను సమర్థంగా నిరోధించడానికి పోలీసులకు ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నట్లు హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు.
రాష్ర్టంలో పోలీసు శిక్షణా సంస్థల అభిృద్ధికి సంబంధించి సీఐడీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా నేర సంఘటనల్లోనూ మార్పులు వస్తున్నాయని తెలిపారు. పోలీసులను కూడా ఈ మార్పులకు స్పందించేలా చేయడం, కొత్త కేసులను సమర్థంగా ఛేదించడంలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇదే సందర్భంలో మహిళలు, బాలికలపై ఇటీవల పెరిగిపోతున్న దౌర్జన్యాలను అరికట్టడంలో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో శిక్షణా సంస్థలకు కొదవ లేదని, ఇప్పటికే 25 వేల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు.
మహిళలకు 20 శాతం అవకాశాలు
పోలీసు శాఖలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పోలీసు శాఖలో నియామకాల సందర్భంగా వారికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు 10 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండేవన్నారు. పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉందని చెబుతూ, 4,500 మంది పోలీసుల నియామకానికి ప్రభుత్వ అనుమతి లభించిందని తెలిపారు. తాము 8,500 మంది నియామకానికి అనుమతి కోరామని చెప్పారు. కాగా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సీఐడీ బాగా పని చేస్తోందని ఆయన కితాబునిచ్చారు. పోలీసు శిక్షణా విభాగం డీజీపీ శుశాంత్ మహాపాత్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు శిక్షణా కేంద్రాలున్నాయని, మరో ఆరు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభించడంతో పాటు రూ.160 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలో మరో రెండు జాతీయ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు అనుమతి లభించిందని చెబుతూ, వీటికి స్థలాన్వేషణ జరుగుతోందని ఆయన తెలిపారు.