Krishna catchment area
-
4 రాష్ట్రాలకూ తిరిగి కేటాయించాల్సిందే
కృష్ణా నీటి పంపకంపై బ్రజేష్ ట్రిబ్యునల్ ముందు వాదించనున్న రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి మొత్తం జలాల లభ్యతను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకూ (మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ) తిరిగి పంపకం చేసేలా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. రాష్ట్రంలోని పరివాహక ప్రాంతం ఆధారంగా దక్కాల్సిన న్యాయమైన వాటా ట్రిబ్యునల్ తీర్పులో రాని దృష్ట్యా కొత్తగా కేటాయింపులు జరపాల్సిన అవసరాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచనుంది. ఈ నెల 25 నుంచి ఢిల్లీలో ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల వాదనలు విననుంది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కాకుండా, నీటిని వినియోగించుకుంటున్న నాలుగు రాష్ట్రాలనూ భాగస్వాములు చేయాలని రాష్ట్రం కోరనుంది. నాలుగు రాష్ట్రాలకూ కొత్త కేటాయింపులు? కృష్ణా నదీ జలాల వివాదాన్ని విచారిస్తున్న బ్రజేష్ ట్రిబ్యునల్ గత నెల 7న జరిపిన విచారణ సందర్భంగా విచారణను కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేయాలా? మహారాష్ట్ర, కర్ణాటకలను కలిపి విచారించాలా? అన్న అంశాన్ని తేల్చందుకు ముసాయదా విధివిధానాలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందులో పేర్కొన్న మేరకు విచారణను రెండు రాష్ట్రాలకే పరిమితం చేసి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలా? లేక నాలుగు రాష్ట్రాలకూ తిరిగి కేటాయించాలా?, తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఆపరేషన్ ప్రొటోకాల్ ఎన్ని రాష్ట్రాలకు ఉండాలి? అన్న అంశాలపై అన్ని రాష్ట్రాలు ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు వాదనలు వినిపించనున్నాయి. నీరు తక్కువ ఉన్న ఏడాదుల్లో ఏ ప్రాజెక్టు నుంచి ఎంతనీరు, ఎవరు ఎవరికి విడుదల చేయాలన్న నిర్దేశాలను బచావత్ కానీ, బ్రజేష్ కానీ చెప్పలేదని రాష్ట్రం పేర్కొంది. ఈ దృష్ట్యా కరువు పరిస్థితుల్లో తమకు తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి నీటి విడుదల చేయాలని, దిగువ రాష్ట్రమైన ఏపీకి మిగిలిన మూడు రాష్ట్రాలూ నీరు విడుదల చేయాల్సి ఉంటుందని రాష్ట్రం తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఏయే ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయవచ్చు, అది ఎంత మేరకు? అన్న దానిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది తేలాలంటే నాలుగు రాష్ట్రాలను విచారించాలని రాష్ట్రం చెప్పనుంది. పరీవాహకం ఎక్కువ...వాటా తక్కువ కృష్ణా పరివాహక ప్రాంతం తమకు 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో 35 శాతం మేర మాత్రమే ఉన్నాయని రాష్ట్రం వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పరీవాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయింపులు జరిపిన దృష్ట్యా పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకొని తమకు కేటాయింపులు పెంచాలన్నది రాష్ట్ర వాదనగా ఉంది. -
మన్నుతిన్న కృష్ణమ్మ..!
సాగర్ ప్రాజెక్టుకు పూడిక ముప్పు - తగ్గిన 100టీఎంసీల - నీటి నిల్వ సామర్థ్యం కృష్ణా పరీవాహక ప్రాంతంలో అడవుల విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణం నాగార్జునసాగర్, న్యూస్లైన్, నాగార్జునసాగర్ జలాశయంలో పూడిక పేరుకుపోతోంది. ప్రస్తుతం నీటి అడుగున సగం మేర మేట వేసింది. పది కాదు..పాతిక కాదు..ఏకంగా వంద టీఎంసీల నీటి నిల్వ ప్రదేశాన్ని మన్ను మింగేసింది. జలాశయంలో రోజురోజుకూ పూడిక పేరుకుపోతుందన్న విషయం తెలిస్తే.. భవిష్యత్తుపై బెంగ లుగుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మున్ముందు డ్యామ్కు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంద టీఎంసీల నీరు తగ్గుదల నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఏర్పడిన 50 ఏళ్లలోనే 100టీఎంసీల నీరు పూడిక కారణంగా తగ్గిపోయింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 408.24 టీఎంసీలు. ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా అధికారులు నిర్ధారించారు. సాగర్ జలాశయం రిజర్వాయర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు. కనిష్ట నీటిమట్టం 490 అడుగులు. సముద్రమట్టం (246 అడుగులు) నుంచి490 అడగుల వరకు ఉన్న డెడ్ స్టోరేజీలో 166టీఎంసీలు. 490 అడుగుల నుంచి 590అడుగుల వరకున్న లైవ్స్టోరేజీలో 242టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో 133టీఎంసీలు, లైవ్స్టోరేజీలో 175టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. లైవ్స్టోరేజీలో 67టీఎంసీల నీరు తగ్గిపోవడం గమనార్హం. ఒక పంటకు నీరివ్వడానికి... నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల కింద ఒక పంటకు నీరివ్వడానికి 264 టీఎంసీల నీరు అవసరం. కృష్ణా డెల్టాకు 70టీఎంసీలు. హైదరాబాద్ నగరానికి, పలు జిల్లాలకు తాగునీటి అవసరాలకు 100 టీఎంసీల నీరు అవసరమవుతుంది. సాగర్, శ్రీశైలం జలాశయాల్లో పూడిక నిండి నీటి నిల్వల శాతం తగ్గితే భవిష్యత్తులో తాగు, సాగునీటికి కష్టమే. ఈ పూడిక ఎలా వస్తుంది...? కృష్ణానది పరీవాహక ప్రాంతం (క్యాచ్మెంటు ఏరియా) 2,58,948 చదరపు కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ ప్రాంతంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం... పట్టణీకరణ పెరగడం, బంజరు భూములు వ్యవసాయ పొలాలుగా మారడం కూడా నీటి ప్రవాహంలో పూడికకు కారణం అవుతుంది. అడువులు ఉంటే నీటి ఉధృతికి చెట్లు అడ్డుపడి పూడిక రావడం తగ్గుతుంది. వర్షాలు.. వరదలు వచ్చినప్పుడు నది నుంచి జలాశయంలో పూడిక చేరడం ఎక్కువవుతుంది. ఎందుకంటే సాధారణంగా పెద్దపెద్ద వరదలు ఏకకాలంలో వస్తాయి. ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. దీనివల్ల పూడిక కూడా వేగంగా వచ్చి చేరుతుంది. పరిష్కారం ఏమిటి? పూడికను అరికట్టడానికి ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే పరిష్కారం గురించి ఇంజినీరింగ్ నిపుణులు ఆలోచించాలి. ఆలాంటిదేమీ జరగలేదు. జలాశయాల్లోని పూడిక తీయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఏమీలేదు. తీసిన పూడిక ఎక్కడ పోయాలనేది సమస్య. చుట్టూ ఉన్న కొండలమీద పోస్తే మళ్లీ వరదలకు కొట్టుకువస్తుంది. నల్లమల అడవులలోని గట్టలపై నుంచి వచ్చే వరదకు అడ్డంగా అక్కడక్కడ గోడలు నిర్మించాలి. జలాశయం చివర్లలో మేటవేసిన ఒండ్రు మట్టిని దగ్గరలో ఉన్న రైతులు పొలాల్లోకి ఉపాధి హామీ పనుల్లో భాగంగా తోలుకపోతే గుడ్డిలో మెల్లెగా ఉంటుంది. విదేశాల్లోనయితే డ్యాం నిర్మించేటప్పుడు పైన చిన్నచిన్న ప్రాజెక్టులు నిర్మించి పూడికను అరికడతారు. మన కర్తవ్యమేంటి? - నీటిని నిల్వ చేయడంకోసం మైదానప్రాంతంలో పెద్దపెద్ద రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవాలి. - ఉన్న చెరువులను త వ్వి జలాశయాలుగా మార్చుకోవాలి. - వరదలు భారీగా వచ్చి నీరంతా సముద్రంలో కలిసే సమయంలో వరద కాలవ, ఎస్ఎల్బీసీ, కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని తరలించి ఆ జలాశయాలు నింపుకోవాలి. - నీటి యాజమాన్యంపై రైతాంగానికి శిక్షణ నిచ్చి నీటి విలువల గురించి తెలియజేయాలి. ఆవిధంగా తరిగిపోయే ఆయకట్టును పెంచుకోవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.