Kundhu-Penna Flood Canal
-
పోటెత్తిన కుందూనది
సాక్షి, చాపాడు: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుందూనదిలో వరద నీరు పోటెత్తతోంది. మన జిల్లాతో పాటు కర్నూలులోనూ జోరుగా వర్షాలు పడుతుంటంతో వరదనీరు ఎక్కువగా చేరుతోంది. గురువారం 24 వేల క్యూసెక్కులతో ప్రవహించిన కుందూనదిలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 33,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీంతో చాపాడు మండలంలోని అన్నవరం, సీతారామాపురం గ్రామాల వద్ద వంతెనలు పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. ఫలితంగా అన్నవరం–మడూరు, సీతారామాపురం–అల్లాడుపల్లె దేవళాలు ప్రాంతాలకు రాకపోకలు నిలి చిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడేకొద్దీ వరద పెరిగే అవకాశం ఉందని కేసీ కెనాల్ డీఈఈ బ్రహ్మారెడ్డి తెలిపారు. అన్నవరం, సీతారామాపురం గ్రామాల వంతెన వద్ద ఎలాం టి ప్రమాదం జరగకుండా వీఆర్ఏలను కాపలాపెట్టినట్లు తహసీల్దారు శ్రీహరి తెలిపారు. ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా సిద్దవటం: భారీ వర్షాలకు నదీ పరివాహకప్రాంతాల నుంచి నీటికి కుందూ వరద ఉధృతి తోడవడంతో శుక్రవారం సిద్దవటం వద్ద పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. గురువారం సాయంత్రం వరకు పాత బ్రిడ్జిపై అంతంత మాత్రంగా నీరు ప్రవహించింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గురువారం రాత్రి నుంచి పాత బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ముందస్తుగా పెన్నా నది హైవే వంతెనపై పోలీసు బందో బస్తును ఏర్పాటుచేశారు. బుగ్గవంక జోరు చింతకొమ్మదిన్నె : కడప నగరానికి సమీపంలోని బుగ్గవంక ప్రాజెక్టు ప్రమాదపుటంచున ఉంది. ప్రాజెక్టు చుట్టూ ఉన్న కట్టలు దెబ్బతిన్నాయి. కట్ట చుట్టూ సిమెంట్ లేక మట్టితేలి ప్రమాదకరంగా మారింది. ప్రస్తుత వర్షాలకు కొండ ప్రాంత వరదనీరు జతకలిసింది. దీంతో ఉధృతంగా నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు నాలుగు గేట్లలో మూడు చోట్ల రంధ్రాల నుంచి నీరు బయటకు వస్తోంది. ప్రాజెక్టుపైనున్న తాపలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలాకాలంగా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టలేదు. 4 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు నిండటంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ మంత్రులు నీటిని విడుదల చేశారు. అప్పటికే ప్రాజెక్టు అధ్వాన్న స్థ్దితికి చేరింది. ఈ విషయాన్ని అప్పటి మంత్రులు పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం బుగ్గవంక ప్రాజెక్టు సుందరీకణకు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. కొద్ది రోజల క్రితం నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి భూమి పూజ నిర్వహించారు. వర్షాల దెబ్బకు పనులలో జాప్యం జరుగుతుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3500 ఎకరాలకు సాగు నీరు, జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీరు అందుతుంది. 2001లో ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంతో కడప నగరం జలమయమైన వైనాన్ని ప్రజలు ఇప్పటికీ మరువలేదు. బుగ్గవంక ప్రాజెక్టు గేట్ల వద్ద నుండి లీకవుతున్న నీరు ప్రాజెక్టు కట్ట కుంగింది.. బుగ్గవంక ప్రాజెక్టుపైన ఉన్న కట్టపై భూమి కొంత మేర కుంగింది. ఈ ప్రాంతంలో అధికారులు మరమ్మతులు చేయించకుండా రాళ్లను అడ్డుగా వేశారు. ఇప్పటికే మండలంలోని పలుప్రాంతాలలో భూమి కుంగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది. – గూడా రాజ శేఖర్ రెడ్డి, రైతు,నాగిరెడ్డిపల్లి, చింతకొమ్మదిన్నె. రాళ్లు తేలి ఉన్నాయి.. ప్రాజెక్టుకు చుట్టూ ఉన్న రాళ్లు పైకి తేలి ఉన్నాయి. కట్టపై ఎలాంటి ఒత్తిడి జరిగినా ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయమేస్తున్నది. వర్షాలు మరింత పెరిగితే ప్రాజెక్టులో నీరు అధికం అవుతుంది. ప్రమాదాలు సంభవించక ముందే అధికారులు చర్యలు తీసుకుంటే మంచిది. – ఇనుకోలు బాలశివయ్య, రైతు, బయనపల్లి, చింతకొమ్మదిన్నె. -
‘కుందూ–పెన్నా’ కోసం కుస్తీ
అధికార పార్టీలో వరద టెన్షన్ కాలువ పనుల కోసం పోటాపోటీగా టెండర్లు నిబంధనలపై విమర్శలు టెండర్లకు నేడే చివరి రోజు ప్రొద్దుటూరు: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా తెలుగు తమ్ముళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టు పనుల కోసం పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా ఈ పనులు దక్కించుకుని నాలుగు కోట్లు వెనకేసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కుందూ–పెన్నా వరద కాలువ టెండర్ల నిర్వహణ రాష్ట్రంలోనే చర్చంశనీయంగా మారింది. ప్రొద్దుటూరు ప్రజలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో దివంగత సీఎం ముఖ్యమంత్రి వైఎస్సార్ 2007 మే 24న కుందూ–పెన్నా వరద కాలువ కోసం రూ.72.53 కోట్లు మంజూరుచేశారు. 2007 సెప్టెంబర్ 21న ఈ కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా భూసేకరణపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇందుకు సంబంధించి రూ.24 కోట్లు ఖర్చుపెట్టారు. ఇదిలావుండగా కిరణ్కుమార్రెడ్డి హయాంలో మళ్లీ ఈ కాలువ పనులకు రూ.183.21 కోట్లు మంజూరు చేస్తూ 2014 ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక 11–4–2016న ఈ పనులను సాగించేలా ఉత్తర్వులు జారీచేశారు. ఇందులోభాగంగానే ప్రస్తుతం రూ.112 కోట్లతో టెండర్లు పిలిచారు. పనుల కోసం పైరవీలు ఎలాగైనా ఈ పనులను దక్కించుకునేందుకు అధికారపార్టీ నేతలు కుస్తీ పడుతున్నారు. ఈపనులు తమకే దక్కేలా పోట్లదుర్తి సోదరులు మంత్రాంగం నడుపుతున్నారు. టెండర్ నిబంధనలను తమకు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పలువురు నేతలు ఈ పనుల కోసం పోటీపడుతున్నారు. గతంలో ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్టు పనులు చేసిన స్థానిక సీనియర్నేత తనయుడు ఎలాగైనా మళ్లీ ఈ పనులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీనియర్నేతకు పోటీగా వ్యవహరిస్తున్న స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇద్దరు కూడా ఈ పనుల కోసం టెండర్లు వేసేందుకు పూనుకున్నారు. తన నియోజకవర్గంలో జరిగే ఈ పనులకు అడ్డు రావద్దని సీనియర్ నేత పోట్లదుర్తి సోదరులను కలిసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో మైదుకూరు–బద్వేలు రోడ్డు కాంట్రాక్టు పనుల కోసం మీ తనయుడు పోటీపడి తమకు వ్యతిరేకంగా టెండర్ వేశాడని, అలాంటప్పుడు తాము టెండర్ వేయకుండా ఎలా ఉంటామని పోట్లదుర్తి సోదరులు సీనియర్ నేతకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఈ కారణంగానే పోట్లదుర్తి సోదరులు సీనియర్ నేత మధ్య సత్సంబంధాలు లేవనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలావుండగా ఈ పనుల కోసం సీనియర్ నేత పార్టీ పెద్దలను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. మంత్రి స్థాయిలో కూడా ఇప్పటికే చర్చలు జరిగాయి. స్థానిక మున్సిపాలిటీకి చెందిన కీలక నేత కూడా సీనియర్నేతకు వ్యతిరేకంగా టెండర్ వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఏది ఏమైనా కుందూ–పెన్నా కుస్తీ పోటీల్లో ఎవరు నెగ్గుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ.112 కోట్ల ఈ కాంట్రాక్టు పనులకు సంబంధించి శుక్రవారం సాయంత్రంలోపు టెండర్లు కోడ్ చేయాల్సి ఉంది. ఇంజనీరింగ్ అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా మారారు జిల్లా, రాష్ట్రస్థాయి ఇరిగేషన్ ఇంజనీరింగ్ ముఖ్య అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా మారారని బీజేపీ నాయకుడు కొవ్వూరు బాలచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన గురువారం రాత్రి సాక్షితో మాట్లాడుతూ కేవలం అధికార పార్టీ నేతల కోసమే టెండర్ల నిబంధనలు విధించారన్నారు. అసలు ఈ నిబంధనలు విధించడాన్ని బట్టి చూస్తే బయటి వ్యక్తులు టెండర్లలో పాల్గొనకుండా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ పనుల నిర్వహణకు సంబంధించి గడువులోగా పనులు పూర్తి చేయకపోతే జరిమానా విధించవచ్చన్నారు. అలాంటిది కాకుండా అసలు నిబంధనలే మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తాను ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని చూడలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై హైదరాబాద్లో ఇంజనీరింగ్ అధికారులను కలిసి టెండర్లు వాయిదా వేయాలని కోరుతానని తెలిపారు. లేనిపక్షంలో ఇష్టారాజ్యంగా నిబంధనలు విధించిన ఇంజనీరింగ్ అధికారులపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు.