రైతులకు రూపాయి కార్డు
మరికల్ , న్యూస్లైన్ : రాష్ట్రంలో సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు మొట్టమొదటిసారిగా దేశంలోనే మనరాష్ట్రంలో రైతులకు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో రూపాయి కార్డు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆప్కాబ్ చైర్మన్ కె.వీరారెడ్డి వెల్లడించారు. సహకార సంఘాల్లో రుణాలు పొందే ప్రతి రైతుకు ఏటీఎం కార్డులను ఆరునెలల్లో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా జిల్లాలో 46 లక్షల మంది రైతులకు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చన్నారు.
దన్వాడ మండలం తీలేర్ గ్రామంలో ఆదివారం ఆయన రైతులతో మాట్లాడారు. నాబార్డు సౌజన్యంతో సహకార సంఘాల్లో టాక్స్ను అమలుపర్చి వాటి అభివృద్ధి కోసం, రైతులకు మరింత దగ్గర కావడం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నాబార్డు సౌజన్యంతో రూపాయి కార్డు ప్రవేశపెట్టే సీబీఎస్ సంస్థ యజమాన్యంతో ఈనెల 29న ముగ్గురు డెరైక్టర్లు, 13మంది అధికారులు చర్చలు జరుపుతారని తెలిపారు. మహారాష్ట్రలోని రాయికాడ్ బ్యాంకులో సీబీఎస్ పద్ధతి ప్రవేశపెట్టడంతో నష్టాల్లో ఉన్న బ్యాంకు లాభాల బాటలోకి వచ్చిందన్నారు. రూపాయి కార్డు ఏడాదిలోపు అందుబాటులోకి తెచ్చి ఏ బ్యాంకు ద్వారానైనా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా ఇప్పటికే ఖరీఫ్లో రైతులకు రూ.250 కోట్ల రుణాలు ఇవ్వగా, ప్రస్తుత రబీలో రూ.180 కోట్ల రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు.
రబీలో రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి సహకార బ్యాంకును బలోపేతం చేయడం కోసం ఈనెల 17, 18, 19న జిల్లాకేంద్రంలో సహకార సంఘాల బలోపేతం, రైతులకు మెరుగైన సేవలు అందించే విధానంపై ఉన్నతాధికారులతో సింగిల్విండో కార్యదర్శులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతులు రాంచంద్రయ్య, శ్రీనివాస్, వెంకటయ్య, రాము, రాజన్నలు పాల్గొన్నారు.