Land leasing
-
అధికారం ఉందిగా...
నిలువ నీడలేని ఎందరో నిరుపేదలు నేడు గూడుకోసం కనీస స్థలం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్సెల్కు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు అందజేస్తున్నారు. వారికి సెంటు స్థలాన్ని ఇవ్వడానికి చొరవ చూపని సర్కారు... పార్టీ కార్యాలయానికి విలువైన స్థలాన్ని లీజు పేరుతో కట్టబెట్టేందుకు ఆమోదముద్ర వేసింది. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో... విలువైన స్థలాన్ని ఏరికోరి అప్పగించేందుకు స్కెచ్ వేసింది. సాక్షిప్రతినిధి, విజయనగరం : రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా సెంటు స్థలమైనా ఇచ్చింది లేదు. చాలీ చాలని సంపాదనలో అద్దెలు చెల్లించుకోలేక సొంత గూడు కట్టుకుందామంటే సొంత జాగాలేక సతమతమవుతున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటివారు సొంత ఇల్లు మంజూరు చేయమని అడిగితే పాలకులు, అధికారులు స్పందించరు. కనీసం సమాధానం కూడా చెప్పలేదు. అధికారపార్టీ కోసం అడిగిందే తడవుగా కోట్ల రూపాయల విలువైన భూమిని ధారాదత్తం చేసేస్తున్నారు. విజయనగరం మండలం కనపాక రెవెన్యూ పరిధిలో ఎకరా భూమిని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం కట్ట బెడుతోంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభిం చింది. 16వ నంబర్ జాతీయ రహదారికి కేవలం పావు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ భూమికి ప్రభుత్వ నిర్ధారించిన విలువ రూ.2.16 కోట్లు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.4.8 కోట్లు పైనే పలుకుతోంది. ఇంత ఖరీదైన స్థలాన్ని ఏడాదికి కేవలం రూ.1000ల లీజు చెల్లించి, 33 ఏళ్ల పాటు అప్పనంగా వాడుకోమని ఇచ్చేస్తోంది. పేద ప్రజలు సొంత ఇంటి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా, కనీసం కనికరం చూపని టీడీపీ ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం ఎకరాల కెకరాలు కొల్లగొట్టేస్తోంది. రాజుగారి కోట దాటిరావాలనేనా... జిల్లా టీడీపీకి కార్యాలయం అంటూ ప్రత్యేకంగా లేకపోవడం వల్ల కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు బంగ్లా నే పార్టీ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఈ బంగ్లాకు రావడానికి కొంతమంది నేతలు అయిష్టంగానే ఉంటున్నా రు. జిల్లాకు చెందిన మంత్రి సుజయ్ కూడా అశోక్ బంగ్లా కు రావడం లేదు. అలాగే పార్టీ కార్యక్రమాలు జరిగినా, సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినా బంగ్లాకు రావడానికి కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒక కారణం చెప్పి రాకుండా తప్పించుకుంటున్నారు. ఇక జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా అయితే జిల్లా పార్టీ సమీక్షలను అమరావతి, విశాఖపట్నంలోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాపార్టీకి కార్యాల యం ఉండాలని భావించి స్థలం ఇప్పించాల్సిందిగా 2015–16లో పార్టీ నేతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేశా రు. పార్టీ నేతల విజ్ఞప్తిని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు వెంటనే ప్రతిపాదనలు పంపిం చారు. తొలుత అయ్యన్నపేటలో స్థలాన్ని చూశారు. కానీ పట్టణానికి మరింత దగ్గరగా ఉండాలని టీడీపీ నేతలు పట్టుబట్టడంతో కనపాక రెవెన్యూలో యూత్ హాస్టల్ ఎదురుగా సర్వే నంబర్ 15/1లో ఉన్న ఎకరా ఖాళీ స్థలాన్ని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. నిజానికి ఈ ప్రాంతంలో 1985లోనే ఉందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కానీ వారంతా పేదవారు కావడంతో ఇల్లు కట్టుకోలేకపోయారు. వా రికి ఆర్థిక చేయూతనిచ్చి గూడు కల్పించాల్సిందిపోయి వారి నుంచి లాక్కొని పార్టీ కార్యాలయం కట్టా లనుకుంటున్నారు. దీని కోసం పట్టణానికి చెందిన టీడీపీ నేత ఒక రు చక్రం తిప్పి జనాన్ని ఒప్పించా రు. అధికారం వారిదే కాబట్టి మంత్రి మండలి మారు మాట్లాడకుండా ఆమోదం ఇచ్చేసింది. -
జీఎస్టీ షాక్:ఈఎంఐలపైనా పన్ను బాదుడు
-
లీజులు, అద్దెలపై జీఎస్టీ!
- భూమి లీజు, నిర్మాణంలోని ఇంటి కొనుగోలుకు చెల్లించే ఈఎంఐలపై కూడా.. - భూమి, భవనాల అమ్మకాలకు మినహాయింపు.. జీఎస్టీ బిల్లుల్లో కేంద్రం ప్రతిపాదన న్యూఢిల్లీ భూమి లీజుకిచ్చినా, వాణిజ్య అవసరాల కోసం భవనాల్ని అద్దెకిచ్చినా జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) పన్ను చెల్లించాల్సిందే. నిర్మాణంలో ఉన్న ఇంటి కొనుగోలుకు చెల్లించే ఈఎంఐలకు కూడా జీఎస్టీ పన్నును అమలు చేస్తారు. ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీలో ఈ ప్రతిపాదనలు చేర్చడంతో... ఎంత పన్ను విధిస్తారోనని వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే భూమి, భవనాల అమ్మకాలకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు. వాటిపై ఎప్పటిలానే స్టాంప్ డ్యూటీ కొనసాగనుంది. విద్యుత్ను కూడా జీఎస్టీ పరిధి నుంచి తప్పించారు. జీఎస్టీ బిల్లులపై పార్లమెంట్లో ఇంకా చర్చ ప్రారంభం కానందున ఈ నిబంధనలు కొనసాగిస్తారా లేక సవరణలు చేస్తారా అన్నది వేచిచూడాల్సిందే. కేంద్ర ఎక్సైజ్ పన్ను, సేవా పన్ను, రాష్ట్రాల వ్యాట్లతో పాటు ఇతర పరోక్ష పన్నుల్ని రద్దు చేసి రూపొందించిన జీఎస్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ జూలై 1, 2017 నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే.. సోమవారం లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన నాలుగు బిల్లుల్లో ఒకటైన సీజీఎస్టీ(కేంద్ర జీఎస్టీ)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. లీజు, అద్దె, ఇతరుల ఆస్తిపై హక్కు పొందడం, భూమి స్వాధీనానికి అనుమతి కలిగి ఉండడం వంటివి సేవలుగానే పరిగణిస్తారు. వ్యాపారం లేదా వాణిజ్యం కోసం... వాణిజ్య, పారిశ్రామిక, నివాస సముదాయాల్ని పూర్తిగా లేక పాక్షికంగా లీజు లేదా అద్దెకు ఇవ్వడాన్ని కూడా సీజీఎస్టీలో సేవలుగానే పేర్కొన్నారు. భూమి లేదా భవనం అమ్మకాల్ని వస్తు సరఫరాగా పరిగణించడంతో వాటిపై సేవా పన్నువసూలు చేయరు. నిర్మాణంలో ఉన్న భవనాల అమ్మకాలకు మాత్రం జీఎస్టీ వర్తిస్తుంది. గతంలో రూపొందించిన జీఎస్టీ నమూనా బిల్లుల ప్రకారం గూడ్స్(వస్తువులు) అంటే నగదు, సెక్యూరిటీస్ తప్ప ఏదైనా చరాస్తి (దావా హక్కు కలిగి ఉండాలి)... వస్తువుల జాబితాలో చేరని వాటిని సేవలుగా పరిగణించడం తెలిసిందే. మార్చి 31 సమావేశంలో నిర్ణయించే అవకాశం పన్ను నిపుణుల సమాచారం మేరకు ప్రస్తుతం వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం చెల్లించే అద్దెలపై సేవా పన్ను విధిస్తున్నారు. నివాస సముదాయాలకు మాత్రం పన్ను నుంచి మినహాయింపు ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లకు అక్కడి భూమి కనిష్ట విలువను పరిగణనలోకి తీసుకుని సేవా పన్ను విధిస్తున్నారని డెలాయింట్ హస్కిన్స్ సెల్స్ ఎల్ఎల్పీ సీనియర్ డైరక్టర్ ఎంఎస్ మణి చెప్పారు. మార్చి 31న జరిగే జీఎస్టీ సమావేశంలో ఈ అంశం చర్చకు వస్తుందని .. జీఎస్టీ శ్లాబులోని కనిష్ట పన్నును విధిస్తారా? లేక పస్తుతం అమలు చేస్తున్న భూమి కనిష్ట విలువపై పన్నును అనుమతిస్తారో వేచి చూడాలని అన్నారు. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలకు భూమి కనిష్ట విలువపై సేవా పన్ను విధించడం వల్ల సేవా పన్ను రేటు 18 శాతం నుంచి 8 శాతానికి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీపై ఎలాంటి వివాదం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తుందని నగీనా అండ్ కో డైరక్టర్ రజత్ మోహన్ చెప్పారు. భూమి లీజు, భవనాల అద్దె, వ్యాపార సముదాయం, భవనాల నిర్మాణం, సివిల్ నిర్మాణాలకు జీఎస్టీ వర్తిస్తుందనే విషయం ప్రభుత్వం రూపొందించిన బిల్లుల్లో స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.