పార్లమెంటుపై దాడికి పన్నెండేళ్లు.. మృతులకు నివాళులు
పన్నెండేళ్ల క్రితం పార్లమెంటుపై జరిగిన దాడిలో మరణించిన వారికి వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉభయ సభల్లో విపక్షనేతలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, పలు ఇతర పార్టీల నాయకులు... ఆనాటి సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు.
2001 డిసెంబర్ 13వ తేదీన భారీగా ఆయుధాలతో విరుచుకుపడిన ఉగ్రవాదులు పార్లమెంటును చుట్టుముట్టారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఐదుగురు పోలీసులు సహా మొత్తం 11 మంది మరణించారు. ఈ దాడికి కుట్రదారుల్లో ఒకరైన అఫ్జల్గురును సుదీర్ఘ కాలం తర్వాత ఇటీవలే ఉరితీశారు. దానిపై పాకిస్థాన్ నుంచి నిరసనలు వచ్చినా, భారత ప్రభుత్వం లెక్కచేయలేదు.
కాగా, శుక్రవారం నాడు పలువురు నాయకులు పన్నెండేళ్ల నాటి పార్లమెంటు దాడి సంఘటనపై స్పందించారు. పేలుళ్ల సూత్రధారిని అరెస్టు చేయాల్సిందేనని లోక్సభలో విపక్షనేత సుష్మా స్వరాజ్ అన్నారు. కనీసం ఇన్నాళ్లకైనా ఒక ఉగ్రవాదిని పట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా దాడిలో మరణించినవారికి నివాళులు అర్పించారు.