పడవ మునక.. 150 మంది మృతి
రోమ్: లిబియా నుంచి శరణార్ధులతో వస్తున్న పడవ మద్యధరా సముద్రంలో మునిగిపోవటంతో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.ప్రమాదం నుంచి బయటపడిన గాంబియాకు చెందిన ఒక వ్యక్తి ఈ విషయం తెలపటంతో వెలుగులోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం తెలిపిన వివరాల ప్రకారం గాంబియా, నైజీరియా, మాలి దేశాలకు చెందిన శరణార్ధులతో సోమవారం లిబియా తీరం నుంచి బయలుదేరిన పడవలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నారు.
బయలుదేరిన కొద్దిసేపటికే అధిక బరువు కారణంగా పడవలోకి నీరు చేరి మునిగిపోయింది. సముద్రంలో తనకు దొరికిన ఖాళీ క్యాన్ సాయంతో ఓ వ్యక్తి బతికి బట్టకట్టగలిగాడు. ఈయూ నేతృత్వంలో మద్యధరా సముద్రంలో విన్యాసాలు చేస్తున్న స్పానిష్ మిలటరీ ఓడ సిబ్బంది గాంబియా వాసిని గుర్తించి ఇటలీలోని లంపెడుసా దీవికి సురక్షితంగా చేర్చారు. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లిబియా తీరం నుంచి పడవల్లో బయలుదేరిన దాదాపు 590 శరణార్ధులు కనిపించకుండాపోవటం లేదా చనిపోవటం జరిగిందని...తాజా ఘటనతో ఇది మరింత పెరిగిందని ఐక్యరాజ్యసమితి అధికారులు వెల్లడించారు.