నమ్మించి.. కుచ్చు టోపీ పెట్టాడు
హైదరాబాద్: రుణం కావాలంటూ పలుమార్లు ఆ కార్యాలయానికి వచ్చి, అందరితో పరిచయాలు పెంచుకుని... అదను చూసి రూ.16 లక్షలను అపహరించుకు వెళ్లిన సంఘటన తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల, మణప్పురం సిబ్బంది కథనం ప్రకారం కుషాయిగూడలోని ఈసీఐఎల్కు చెందిన ధర్మిచంద్(38) వృత్తి రీత్యా పాన్ బ్రోకర్. నెలకోసారైనా గోల్డ్ లోన్ కావాలంటూ మణప్పురం గోల్ట్లోన్ కార్యాలయానికి వెళ్లేవాడు. దీంతో ధర్మిచంద్తో మణప్పురం సిబ్బందికి చనువు ఏర్పడింది. అయితే, గత నెల 29వ తేదీన ఆనంద్బాగ్లోని మణప్పురం గోల్డ్లోన్ కార్యాలయానికి వెళ్లాడు.
తన స్నేహితుని వద్ద 900 గ్రాముల(90 తులాల) బంగారం ఉందని అవి పెట్టుకొని లోన్ ఇవ్వమని మణప్పురం బ్రాంచ్ హెడ్ భూపాల్ రావుతో చెప్పాడు. బంగారం ఎక్కడుందని అడిగితే, తన స్నేహితుడి ఇంట్లో ఉందని చెప్పాడు. దీంతో భూపాల్రావు డబ్బులు తీసుకుని అతనితో పాటు అడ్డగుట్టలోని ఫ్రెండ్ ఇంటి వద్దకు వచ్చాడు. అతనిని ఇంటికి సమీపంలో ఉంచిన ధర్మిచంద్..రూ.16 ల క్షలున్న డబ్బు బ్యాగ్తో ఇంట్లోకి వెళ్లి, ఎంతసేపటికీ తిరిగిరాలేదు. దీంతో సమీపంలోని అన్ని ప్రాంతాల్లో వె తికినా ధర్మిచంద్ ఆచూకీ దొరకలేదు. తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో భూపాల్ పై అధికారులకు సమాచారం అందించాడు. డబ్బు అపహరణ అడ్డగుట్ట ప్రాంతంలో జరిగినందువల్ల, మణప్పురం కార్యాలయం హైదరాబాద్ హెడ్ నాగేశ్వర్రావు తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.