Masaipet bus accident
-
ఇంటికొచ్చిన.. కంటి వెలుగులు
* కోలుకున్న మాసాయిపేట బస్సుప్రమాద బాధిత చిన్నారులు * మార్పులేని ఇద్దరి పరిస్థితి సాక్షి,హైదరాబాద్: తల్లిదండ్రుల ఆశలను చిదిమేసిన మెదక్జిల్లా మాసాయిపేట బస్సుదుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సలు పూర్తిచేసుకున్న చిన్నారులు బుధవారం డిశ్చార్జి కావడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వద్ద ఉద్వేగ భరిత వాతావరణం ఏర్పడింది. పిల్లల తల్లిదండ్రుల కళ్లనుంచి ఆనందబాష్పాలు రాలాయి. ఈ నెల 24న ఇక్కడ చికిత్సకు వచ్చిన కాకతీయ స్కూలు విద్యార్థుల్లో 9 మంది ఏడు రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారు. మాసాయిపేట్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 20 మంది విద్యార్థులను చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. గత రెండు రోజుల క్రితమే 12 మంది పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. వారి తల్లిదండ్రులు మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోని వారిని ఉంచాలని కోరడంతో ఆస్పత్రి వర్గాలు సమ్మతించాయి. ఆమేరకు వారిని బుధవారం డిశ్చార్జి చేశాయి. వీరిలో సాయిరాం(4), సాత్విక(6), మహిపాల్రెడ్డి(4), సద్భావన్దాస్(3), కరుణాకర్(9), సందీప్(5), అభినందు(9),శివకుమార్(5), హరీష్(7)లను ఇంటికి పంపించారు. రుచితగౌడ్(8), శ్రావణి(6), త్రిష అలియాస్ శిరీష(8)ల తల్లిదండ్రులు ఇంకా రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుతామని చెప్పడంతో వారిని ప్రత్యేక వార్డుకు తరలించారు. దర్శన్గౌడ్(6), నబీరాఫాతిమా(9), నితూష(7) ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. శరత్(6) పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రశాంత్(6), వరుణ్గౌడ్(7)ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. డిశ్చార్జ్ అయి వెళుతున్న విద్యార్థుల వద్దకు ప్రతీరోజు ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులు, పారామెడికల్ సిబ్బంది వెళ్లి అవసరమైన చికిత్స, డ్రెస్సింగ్ లాంటివి చేస్తారని యశోద ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ లింగయ్య చెప్పారు. వారం రోజులకు సరిపడే మందులు కూడా ఇచ్చామన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా వైద్యులతో ఫోన్లో సంప్రదించవచ్చని, ఆస్పత్రికి వచ్చి ఉచిత వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని వైద్యులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా డిశ్చార్జ్ అయి వెళ్లిపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు ఆరోగ్యంగా ఇళ్లకు వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను యశోద ఆస్పత్రి, 108 ఆంబులెన్సులలో స్వగ్రామాలకు తరలించారు. మాసాయిపేట రైల్వే మృతులకు టీడీపీ సాయం బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన నారా లోకేష్ తూప్రాన్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బుధవారం తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో సాయం అందజేశారు. రైలు ప్రమాదం బాధితులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రైల్వే ప్రమాద ంలో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులకు రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. అలాగే వర్గల్ మండలం వెలురూలోని బస్సు డ్రైవర్ బిక్షపతిగౌడ్, తూప్రాన్ మండలం ఘనపూర్కు చెందిన బస్సు క్షీనర్ రమేశ్ కుటుంబ సభ్యులకు రూ. లక్ష చెక్కును అందజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారుల చదువులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. అలాగే, రైలు ప్రమాద ఘటనా స్థలంలో నారా లోకేష్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు గాంధీ, వివేకానందగౌడ్, మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికళా యాదవరెడ్డి, గజ్వేల్, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల నాయకులు మృతుల ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటించారు. -
తరుణ్ తనువు చాలించాడు..
* మాసాయిపేట ఘటనలో మరో విద్యార్థి మృతి * 17కు చేరుకున్న మాసాయిపేట మృతులు * మరో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమం * యశోద ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలు * 7గురు విద్యార్థుల డిశ్చార్జి సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారుల్లో తరుణ్ (7) అనే మరో విద్యార్థి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో ఇప్పటిదాకా మరణించిన విద్యార్థు ల సంఖ్య 17కు చేరుకుంది. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలిలోనే 14 మంది చిన్నారులు, బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందిన సంగతి విదితమే. తీవ్రంగా గాయపడ్డ 20 మంది విద్యార్థ్ధులను అదే రోజు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందజేస్తున్నారు. వారిలో ప్రశాంత్, వరుణ్గౌడ్, వైష్ణవి, తరుణ్ల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేషన్ పైనే ఉంచి వైద్యసేవలను అందజేస్తున్నారు. వీరిలో చిన్నారి తరుణ్ మృ తి చెందాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు చేసిన యత్నాలు ఫలించలేదని వైద్యులు వెల్లడించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమం తీవ్రంగా గాయపడ్డ పిల్లల్లో ప్రశాంత్ (6),వరుణ్గౌడ్ (7),వైష్ణవి (11) పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వైష్ణవి స్థితి మరింత విషమంగా ఉందని డాక్టర్లు తెలి పారు. వీరు కాకుండా మరో ఇద్దరు నితూష (7), శరత్ (6)లకు ప్రాణాపాయం తప్పినప్పటికీ అత్యవసర వైద్య సేవలను అందజేస్తున్నారు. ఈ విషయాలను సికి ంద్రాబాద్ యశోద ఆసుపత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ఎ.లింగయ్య వెల్లడించారు. చికిత్స పొందుతున్న మొత్తం 20 మందిలో ఏడుగురిని సోమవారం డిశ్చార్జి చేయగా, మరో 7 గురిని రెండు,మూడు రోజుల్లో ఇంటికి పంపనున్నట్లు తెలిపారు. డిశ్చార్జి అయిన పిల్లల కుటుంబీకులు మాత్రం తమకు పూర్తి సంతృప్తి కలిగిన తరువాతనే వెళ్తామని చెప్పడంతో తాము అంగీకరించామని డాక్టర్ లింగయ్య చెప్పారు. యశోద ఆసుపత్రి ‘హోమ్ కేర్ సర్వీసెస్’ బాధితులు ఉన్న ప్రతి గ్రామానికి వెళ్లి అవసరమైన వైద్యసేవలను అందజేస్తుందన్నారు. డిశ్చార్జి అయింది వీరే : సాయిరామ్ (4), రుచిత గౌడ్ (8), సాత్విక(6), మహిపాల్రెడ్డి (4), సద్భావన్దాస్ (3), కరుణాకర్ (9),సందీప్ (5)లను డాక్టర్లు వైద్యపరంగా డిశ్చార్జి చేశారు. కోలుకునే వరకూ వైద్యసేవలు: డిప్యూటీ సీఎం బస్సు దుర్ఘటనలో చికిత్సలందుకున్న విద్యారులకు డిశ్చార్జ్ అనంతరం కూడా పూర్తిగా కోలుకునేంత వరకు వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. సోమవారం ఆయన ఆస్పత్రిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించారు. డిశ్చార్జ్ అయిన వారు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కామారెడ్డిలోని ఆర్థోపెడిక్ సర్జన్ పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రిని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా సందర్శించారు. చెక్కులు పంపిణీ చేసిన నారా లోకేష్ మాసాయిపేట్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబా బు కుమారుడు లోకేష్ చెక్కులు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 వేల వంతున 20 మందికి ఆయన అందించారు. తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకునేందుకు వ చ్చే వారికి ట్రస్టు తరఫున ఉచిత విద్యనందిస్తామని హా మీ ఇచ్చారు. మృతి చెందినవారి కుటుంబాలకు ఈ నెల 30న గజ్వేల్లో రూ.లక్ష చొప్పున ఇస్తామన్నారు. మాసాయిపేట ఘటనపై రాష్ట్రపతి సంతాపం మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు సోమవారం లేఖ పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టిన సహాయకచర్యలను అందులో ప్రస్తావించారు. ఆ లేఖ ప్రతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు కూడా పంపారు. కరిగిన కలలు.. మెదక్ జిల్లా గుండ్రెడ్డిపల్లికి చెందిన శ్రీశైలం, బాలమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడైన తరుణ్ను ఈ ఏడాదే కాకతీయ స్కూల్లో చేరాడు. పాప వయస్సు ఏడాది. సొంత ఊళ్లో వ్యవసాయం చేసుకొని బతుకుతోన్న శ్రీశైలం దంపతులు కొడుకును బాగా చదివించాలని కలలు గన్నారు. అవి కల్లలయ్యాయి. కొడుకు మరణవార్త తెలిసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. దర్యాప్తు జరపాలని జనహిత వ్యాజ్యం మెదక్ జిల్లా మాసాయిపేటలో చిన్నారులను బలి గొన్న రైలు-బస్సు దుర్ఘటనపై ఉన్నతస్థాయి జ్యుడీషియల్ కమిటీతో విచారణ చేయించాలని హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. నగరానికి చెందిన ఎం.రామ్మోహన్రావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని రైల్వే క్రాసింగ్ ప్రాంతాల్లో గేట్లను ఏర్పాటు చేయడంతోపాటు పర్యవేక్షించేందుకు సిబ్బందిని నియమించాలని ఆ పిటిషన్లో కోరారు.