meter reader
-
తిరగని బతుకు మీటర్!
అనంతపురంలో పని చేస్తున్న మీటర్ రీడర్(Meter reader) డేవిడ్కు(పేరు మార్చాం) మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. ఇలాగైతే కుటుంబ జీవనం సాగించేదెలా? ఇలాగే ఉంటే మరో రెండు నెలలు వేతనాలు కూడా ఇవ్వరు. దీనిపై కాంట్రాక్టర్లతో గట్టిగా మాట్లాడాలి అంటూ వారి వాట్సాప్ గ్రూప్లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశాడు. వేతనాల కోసం గట్టిగా అడిగితే వారి ఖాతా క్లోజ్ చేసి ఇంటికి పంపేస్తామంటూ కాంట్రాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మీటర్ రీడర్స్(Meter readers) ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుందాంలే.. ఉన్న ఉద్యోగం పోతే అంతే సంగతులు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అనంతపురం టౌన్: విద్యుత్(Electricity) వినియోగదారులకు ప్రతి నెలా బిల్లును తీసి అందించే మీటర్ రీడర్ల బతుకు మీటర్ మాత్రం తిరగడం లేదు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రెండు నెలలు, మరి కొన్ని ప్రాంతాల్లో మూడు నెలలు కావొస్తున్నా వేతనాలు మాత్రం అందడం లేదు. కాంట్రాక్టర్లు మాత్రం ప్రతి నెలా తమకు రావాల్సిన బిల్లులను విద్యుత్ సంస్థ నుంచి తీసుకుంటూ మీటర్ రీడర్లకు మాత్రం మొండిచేయి చూపుతున్నారు. వేతనాలపై జీవనం సాగిస్తున్న దాదాపు 220 మంది మీటర్ రీడర్ల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. వేతనాలు అడిగితే ఉద్యోగం తొలగిస్తారంట.. వేతనాల కోసం అడిగితే తమను ఉద్యోగం నుంచి తొలగిస్తారనే వాయిస్ను కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు పంపారు. దీంతో వారు వేతనాలు ఇవ్వకపోయినా గట్టిగా అడగలేని పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆరు నెలల క్రితం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 ఏరియాలకు స్పాట్ బిల్లింగ్ టెండర్లను విద్యుత్ శాఖ అధికారులు పిలిచారు. 250 మందికి పైగా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు.విద్యుత్ శాఖ(electricity department) అధికారులు ఏక పక్షంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇద్దరు వ్యక్తులకే స్పాట్ బిల్లింగ్ టెండర్లను ఖరారు చేశారు. టెండర్లలో ఎవరు తక్కువకు కోట్ చేశారనే విషయాలను పరిశీలించకుండానే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇద్దరు వ్యక్తులకు స్పాట్ బిల్లింగ్ టెండర్లను కట్టబెట్టారని అప్పట్లోనే అప్పటి ఎస్ఈపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంట్రాక్ట్ పొంది ఐదు నెలలు కాగా దాదాపు 3 నెలల వేతనం మీటర్ రీడర్స్కు పెండింగ్ పెట్టారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకునే వారేరీ?.. మీటర్ రీడర్లకు స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదనే విషయాలు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మీటర్ రీడర్ల అధికారికంగా ఫిర్యాదు చేస్తే అప్పుడు చూద్దాములే అంటూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలున్నాయి. వేతనాలపై లిఖిత పూర్వకంగా కాంట్రాక్టర్లపై ఫిర్యాదు చేస్తే ఉన్న ఉద్యోగం పోతుందనే భయంతో మీటర్ రీడర్లు ఉన్నారు. దీన్ని అసరాగా చేసుకున్న స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి మీటర్ రీడర్ల వేతనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.రెండు రోజుల్లో వేతనాలు అందేలా చర్యలు మీటర్ రీడర్లకు మూడు నెలలుగా వేతనాలు అందలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై కాంట్రాక్టర్లతో మాట్లాడి రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్లకు వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ప్రతి నెలా వారి ఖాతాల్లో 5వ తేదీలోగా వేతనాలు జమ చేసేలా చూస్తాం – శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ, అనంతపురం -
మీటర్ రీడర్లకు షాక్!
విద్యుత్ మీటర్ రీడర్లకు కూటమి ప్రభుత్వం షాక్ ఇస్తోంది. టీడీపీ నేతలు, నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకు చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న మీటర్ రీడర్లపై వేటు వేస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేల మంది మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కమీషన్లో కోత విధించిందని, ఇప్పుడు తమ ఉపాధికే ఎసరు పెట్టిందని మీటర్ రీడర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. –సాక్షి, అమరావతిమొదట కమీషన్లో కోత...రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పరిధిలో అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 1.92 కోట్ల విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వాటిలో 20 శాతం నుంచి 30 శాతం వరకు పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ సర్వీసులు ఉంటాయి. మిగతా 70 శాతం సర్వీసులకు ప్రతి నెలా విద్యుత్ బిల్లులను స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా ఇస్తున్నారు. ఇందుకోసం డిస్కంలు కాంట్రాక్టు పద్ధతిలో మీటర్ రీడర్లను తీసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు. వీరికి గతంలో ఒక్కో బిల్లుకు (పీస్ రేట్) కమిషన్గా అర్బన్లో రూ.3.49, రూరల్లో రూ.3.89 చెల్లించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని అర్బన్లో రూ.2.60, రూరల్లో రూ.2.89కి కమీషన్ తగ్గించారు. నెలలో మొదటి 10 రోజుల్లోనే బిల్లింగ్ పూర్తిచేసిన తర్వాత మిగతా 20 రోజులు రీడర్లు ఖాళీగా ఉంటున్నారు. ఈ 20 రోజుల్లో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం, మీటర్లు మార్చడం, మొండి బకాయిలున్న సర్వీసులను తొలగించడం, వంటి పనులకు అవకాశం ఇవ్వాలని రీడర్లు చాలాకాలంగా డిస్కంలను కోరుతున్నారు. కానీ ఇప్పుడు అసలు వారి ఉపాధి పైనే కూటమి ప్రభుత్వం దెబ్బకొడుతోంది.నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులువిద్యుత్ మీటర్ల నుంచి రీడింగ్ను నమోదు చేసి వినియోగదారులకు ప్రతి నెలా బిల్లు ఇచ్చే స్పాట్ బిల్లింగ్ రీడింగ్ కాంట్రాక్టులను క్లాస్–1 కాంట్రాక్టర్లకే ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా డిస్కంలు కేవలం చినబాబు అనుచరులు, టీడీపీ నేతలు అయితే చాలు అన్నట్లు.. జిల్లాల వారీగా నామినేషన్పై కాంట్రాక్టులు అప్పగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇలా కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రస్తుతం ఉన్న రీడర్లకు కల్పించాలి్సన ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను నిలిపివేశారు. తామిచ్చే రేటు(కమీషన్)కే పనిచేయాలని, లేదంటే వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. చాలాచోట్ల యువగళం కార్యకర్తలకు మీటర్ రీడింగ్ తీసే పనులు అప్పగిస్తూ ప్రస్తుత రీడర్ల ఉపాధికి గండికొడుతున్నారు. -
రీడింగ్ దౌడ్
నెల్లూరు (దర్గామిట్ట),న్యూస్లైన్: నెల్లూరులోని ఏసీనగర్లో నివాసం ఉంటున్న ఎల్.లక్ష్మమ్మ ఇంటికి ఈ నెల 20వ తేదీన మీటర్ రీడర్ వచ్చి రీడింగ్ నమోదుచేసుకుని బిల్లు ఇచ్చివెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత లక్ష్మమ్మ రీడింగ్ను పరిశీలించగా మీటర్లో ఉన్న నంబర్లకు బిల్లులో నమోదు చేసిన యూనిట్లకు చాలా తేడా ఉంది. ఆమె నవంబర్లో 80 యూనిట్లు వినియోగించుకోగా సిబ్బంది చేసిన తప్పిదంతో 155 యూనిట్లు వినియోగించుకున్నట్లు నమోదైంది. ఈ క్రమంలో బిల్లింగ్ శ్లాబు మారిపోయి కట్టాల్సిన మొత్తం రూ.531కి చేరడంతో ఆమె లబోదిబోమంటూ విద్యుత్ అధికారుల దగ్గరకు పరుగులు దీశారు. ఈ సమస్య ఒక్క లక్ష్మమ్మకే పరిమితం కాలేదు. జిల్లాలో అనేక మంది వినియోగదారులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. రోజుకు ఇన్ని మీటర్ల రీడింగ్ తీయాలంటూ కాంట్రాక్టర్లు హుకుం జారీ చేస్తుండటంతో సిబ్బంది హడావుడిలో తప్పుగా నమోదుచేస్తున్నా రు. ఎక్కువ మీటర్ల రీడింగ్ తీస్తే ఎక్కువ కమీషన్ వస్తుందనే వారి ఆత్రుతతో బిల్లింగ్లో తప్పులు దొర్లి వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో మొత్తం 11,15,166 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో 8,60,479 సర్వీసులు ఇళ్లకు సంబంధించినవి. వివిధ కేటగిరిల వారీగా నెలకు దాదాపు 18 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. తద్వారా విద్యుత్ శాఖకు నెలకు రూ. 80 రాబడి లభిస్తుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా తక్కువ మొత్తం కోట్ చేసిన వారికి ప్రతి ఇంటికి వెళ్లి రీడింగ్ నమోదు చేసే బాధ్యతను అప్పగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 17 విద్యుత్ రెవెన్యూ కార్యాల యాలు (ఈఆర్ఓ) ఉన్నారు. ఒక్కో రెవెన్యూ కార్యాలయం పరి ధిలో ఒక్కో కాంట్రాక్టర్కు రీడింగ్ నమోదును అప్పజెప్పారు. ఒక్కో మీటర్కు నగరాల్లో రూ.2.60, గ్రామాల్లో రూ.4.60 వం తున కాంట్రాక్టర్కు చెల్లిస్తున్నారు. ప్రతి నెలా 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మొదటి విడతగా, 12 నుంచి 19వ తేదీ వరకు రెండో విడతగా రీడింగ్ నమోదు చేసి వినియోగదారులకు బిల్లులు జారీ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు నెలలకోసారి మీటర్ రీడింగ్ నమోదు ప్రక్రియ జరుగుతుంది. హడావుడిగా.. రీడింగ్ నమోదు కాంట్రాక్టుకు దక్కించుకున్న వారు కొందరు సిబ్బందిని నియమించుకుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యుత్శాఖ మీటర్కు రూ.2.60 చెల్లిస్తుండగా సిబ్బందికి ఒకటిన్నర రూపాయి ఇస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎక్కువ మీ టర్లకు రీడింగ్ తీస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చనే ఆశతో సి బ్బంది హడావుడిగా ముందుకు సాగుతున్నారు. దీంతో తప్పులు దొర్లి వినియోగదారులపై భారం పడుతోంది. జిల్లాలో అనేక చోట్ల ఈ విధంగా తప్పులు దొర్లుతున్నాయి. కొందరు వినియోగదారులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కొంత తగ్గించి పంపుతున్నారే తప్ప, మళ్లీ తప్పులు దొర్లకుండా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సిబ్బంది కొరత కారణంగా గడువు కాలం ముగిసినా రీడింగ్ నమోదు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ యూనిట్లు నమోదై శ్లాబులు మారిపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం నాగశయనరావు, ఎస్ఈ, విద్యుత్శాఖ రీడింగ్ నమోదులో తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకుంటాం. ఎందుకు తప్పుగా రీడింగ్ నమోదు చేశారో సిబ్బందిని విచారిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరుగకుండా అధికారులను అప్రమత్తం చేస్తాం.