military air base
-
రష్యా–ఉక్రెయిన్; ఎవరిదెంత బలం.. ఎవరిదెంత వ్యయం?
Military Strengths Of Russia And Ukraine: ట్యాంకుల నుంచి శతఘ్నుల వరకు పదాతి దళం నుంచి మారణాయుధాల వరకు యుద్ధ విమానాల నుంచి నౌకల వరకు ఉక్రెయిన్పై మూడువైపులా రష్యా పకడ్బందీగా బలగాలను మోహరించింది. రష్యా, బెలారస్లు సంయుక్తంగా పది రోజులుగా చేస్తున్న సైనిక విన్యాసాలతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతుందన్న ఆందోళన నెలకొంది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రష్యా పకడ్బందీగా ఒక దేశంపై యుద్ధ సన్నాహాలు చేయడం ఇదే మొదటి సారి. రష్యాకి చెందిన సకల రక్షణ వ్యవస్థలు గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ చుట్టూ మోహరించి ఉన్నాయి. రష్యాకు చెందిన 100 బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ (బిటిజి) సరిహద్దుల్లో మాటువేశాయి. ఒక్కో గ్రూప్లోని వెయ్యిమందికి పైగా సైనికులు ఉన్నారు. వివిధ ప్రాంతాలలో దాదాపు 2 లక్షల మంది సైనికులు మోహరించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. 2014లో జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో డజను కంటే తక్కువ బిటిజిలను మోహరించిన రష్యా ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 100కి పెంచింది. యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని చెప్పడానికి రష్యా దగ్గర కంబైన్డ్ ఆర్మీస్ 11 ఉంటే వాటిలో 10 ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందేమోనని వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. యుద్ధ సన్నాహాల్లో భాగంగా ఫిబ్రవరి 10 నుంచి రష్యా–బెలారస్ సంయుక్తంగా సైనిక విన్యాసాలు, క్షిపణి పరీక్షల్ని నిర్వహిస్తోంది. వీటిని చూస్తుంటే రష్యా సమరశంఖాన్ని పూరించినట్టేనని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలివాన్ హెచ్చరించారు. రష్యా ఉత్తరం, మధ్య, దక్షిణం దిశల్లో ఎటు వైపు నుంచైనా దాడులకి దిగే అవకాశముంది. ఉత్తరం వైపు నుంచి వస్తే ఉక్రెయిన్ రాజధాని కీవ్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ రూట్ అయిన డోంటెస్క్ నుంచి, లేదంటే దక్షిణవైపు నుంచి అంటే సముద్ర మార్గం ద్వారా దాడులు చేయడానికి స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రష్యా మిలటరీ సత్తాపై అధ్యయనం చేసిన రాండ్ కార్పొరేషన్కు చెందిన విశ్లేషకుడు స్కాట్ బాస్టన్ ఇరు దేశాల ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ ‘‘అధినేత నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే దాడులు చేయడానికి సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఉద్రిక్తతలు చల్లారతాయనడానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మిలటరీని సన్నద్ధం చేసిన స్థాయిలో రష్యా వాస్తవంగా యుద్ధానికి దిగుతుందని భావించడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఎవరిదెంత వ్యయం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ ఉన్న దేశాల్లో రష్యా అయిదో స్థానంలో ఉంది. రక్షణ రంగానికి ఆ దేశం మొత్తం బడ్జెట్లో 11.4 శాతం ఖర్చు చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ తమ బడ్జెట్లో 8.8శాతం ఖర్చు చేస్తోంది. 2020లో రష్యా రక్షణపై 6170 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే, అదే ఏడాది ఉక్రెయిన్ 590 డాలర్లు ఖర్చు చేసినట్టుగా స్టాక్హోమ్ ఇంటర్నేనషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్ బలాబలాలు రష్యా, ఉక్రెయిన్ మిలటరీ బలాబలాలను చూస్తే ఎక్కడా పొంతన కుదరదు. రష్యా మిలటరీని ఉక్రెయిన్ నామమాత్రంగా కూడా ఢీ కొనలేదు. అయినప్పటికీ అమెరికా, బ్రిటన్ అండదండలతో ఆ దేశం ధీమాగా ఉంది. అగ్రరాజ్యాలు తమ రక్షణ కోసం నాటో బలగాల్ని తరలిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఆశతో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 12 దేశాలు సభ్యులుగా మొదలైన నాటోలో ప్రస్తుతం 30 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, డెన్మార్క్ వంటి దేశాలతో కూడిన నాటో బలగాలు ఉక్రెయిన్కి అండగా నిలిస్తే ఇరు పక్షాల మధ్య భీకర పోరు జరుగుతుంది. రష్యా, ఉక్రెయిన్ సైనిక శక్తిలో ఎంత అసమతుల్యత ఉందో ఇది చూస్తే అర్థమవుతుంది. – నేషనల్ డెస్క్, సాక్షి. -
వైమానిక స్థావరంగా టిబెట్ ఎయిర్పోర్ట్
బీజింగ్: టిబెట్ రాజధాని లాసాలోని విమానాశ్రయాన్ని చైనా మిలిటరీ ఎయిర్బేస్గా మారుస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. టిబెట్ స్వయంపాలిత ప్రాంతంలో ఉన్న ఆ విమానాశ్రయాన్ని పౌర విమాన సేవలు అందించేందుకు ఉపయోగించాల్సి ఉండగా, చైనా సైనిక కార్యకలాపాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న సంగతి భారత్ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని హిందుస్తాన్ టైమ్స్ బుధవారం ప్రచురించింది. ఈ కథనంలో ముగ్గురు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రన్వే నుంచి అండర్గ్రౌండ్లో నిర్మించిన బాంబ్ప్రూఫ్ హ్యాంగర్స్(విమానాలు నిలుపు స్థలం) వరకు ‘టాక్సీ ట్రాక్’ నిర్మాణం పూర్తయింది. ఈ హ్యాంగర్లను 36 విమానాలు నిలిపేంత విశాలంగా నిర్మించారు. లాసా విమానాశ్రయం..ఢిల్లీ నుంచి 1350 కి.మీ దూరంలోనే ఉండటం భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. -
విమానం ఎగరావచ్చు..
యూ ఆర్ అటెన్షన్ ప్లీజ్.. ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్కు ఆదేశం అందుబాటులో 1591 ఎకరాల భూమి మొదటి, రెండు దశల్లో విమానాలు నడిపేందుకు వీలు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు ఆదిలాబాద్ క్రైం : అడవుల ఖిల్లా ఆదిలాబాద్ నుంచి త్వరలో విమానం గాల్లోకి ఎగరనుంది. ‘‘యూ ఆర్ అటెన్షన్ ప్లీజ్.. మీరు ప్రయూణించాల్సిన విమానం ప్లాట్ఫాంపైకి చేరుకుంది..’’ అనే పిలుపు ఈ ప్రాంత ప్రజల చెవిన పడనుంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ పట్టణంలో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇప్పటికే పట్టణ శివారు ప్రాంతంలో మిలిటరీ ఎయిర్బేస్ ఉంది. విమానాశ్రయానికి సంబంధించిన అవసరమైన భూమి ఈ ప్రాంతంలో ఉందని గతంలో జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపించింది. తాజాగా రాష్ట్రంలో కొత్తగూడెంతోపాటు ఆదిలాబాద్లో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సరికొత్తగా మూడు విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ గతంలోనే ప్రకటించింది. అయితే ఈ మూడు విమానాశ్రయాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కొత్తగూడెంలో నిర్మించవచ్చని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్తగూడెం, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులకు కేంద్రం నుంచి అనుమతులు లభించాయి. ఆదిలాబాద్ అనువైన ప్రదేశం.. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి సుముఖంగానే ఉంది. విమానాశ్రయ నిర్మాణానికి కావాల్సిన స్థలం అందుబాటులో ఉందని రెండేళ్ల కిందటే అధికారులు గుర్తించారు. సర్వే చేసి 1591 ఎకరాల భూమి ఉందని నిర్ధారించారు. అప్పట్లోనే భారత వాయుసేన కార్యకలాపాల విస్తరణ ఉన్నతాధికారులు సైతం స్థలాన్ని పరిశీలించారు. విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జిల్లా యంత్రాంగం ఆ స్థలంలో నీటి సరఫరా, విద్యుత్, తదితర సౌకర్యాల కల్పనకు రూ.15 కోట్లు అవసరమని ప్రతిపాదనలు కూడా పంపింది. ఇదిలా ఉండగా కొత్తగూడెంతోపాటు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వీటిలో కొత్తగూడెం, ఆదిలాబాద్లలో విమానాశ్రయం నిర్మించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ లైన్క్లియర్ చేసింది. అందుబాటులో భూమి.. జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు 1,591 ఎకరాల భూమి అందుబాటులో ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమితోపాటు వ్యవసాయ భూమి కూడా ఉంది. ఆదిలాబాద్కు ఆనుకుని ఉన్న ఖానాపూర్, అనుకుంట, కచ్కంటి, తంతోలి గ్రామాల శివార్లలో ఈ స్థలం ఉంది. అనుకూలంగా ఉన్న భూముల్లో ప్రభుత్వ భూమి కంటే వ్యవసాయ భూమే అధికం ఉంది. అప్పట్లో ఖానాపూర్ శివారులోని 50.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు అనుకుంట గ్రామ శివారులో 34.04 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులో 5.20 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని గుర్తించారు. ఖానాపూర్లో 431.36 ఎకరాలు, అనుకుంట శివారులో 501.34 ఎకరాలు, కచ్కంటి శివారులో 313.24 ఎకరాల వ్యవసాయ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో పాటు తంతోలిలో 256.07 ఎకరాల భూమిని అధికారులు గుర్తించి పరిశీలించారు. మొత్తం 1591 ఎకరాల భూమి అందుబాటులో ఉండడంతో స్థలం సమస్య లేకుండా పోయింది. ఆనందం.. ఆందోళన.. ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానుందనే ఆనందంతోపాటు కాస్త ఆందోళన కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. విమానాశ్రయ నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణానికి 1600 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించడంతో పంట భూములు సైతం కోల్పోవాల్సి వస్తుంది. అధికారులు గుర్తించిన 1591 ఎకరాల భూమిలో పంట భూములు సైతం ఉన్నాయి. తంతోలి, అనుకుంట, కచ్కంటి గ్రామాల శివారుల్లో సుమారు 1200 ఎకరాల భూమి సాగులో ఉంది. రెండేళ్ల కిందట అధికారులు భూముల సర్వే, పరిశీలన చేయడంతో అప్పట్లో ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందారు. అధికారులను పలుమార్లు కలిసి విన్నవించారు. గుర్తించినంత మాత్రనా భూమి కోల్పోయినట్లు కాదని, ఏర్పాటుకు ఏది అనుకూలంగా ఉంటే అదే తీసుకోవడం జరుగుతుందని అధికారులు వారికి సూచించారు.