నాన్నగారిలాగే తెలుగులో సినిమా చేయడం హ్యాపీగా ఉంది: మిమో చక్రవర్తి
ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి(Mimoh Chakraborty), ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో మిమో చక్రవర్తి మాట్లాడుతూ... ''ఈ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. అందరూ చాలా గొప్పగా నటించారు. ఈ సినిమాకు మెయిన్ హీరో మాధవ్ గారు. మా నాన్నగారిలా నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫిబ్రవరి 28న వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు.చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ... ''మా తల్లిదండ్రులు జన్మ ఇస్తే, నాకు దర్శకుడిగా పునర్జన్మ ఇచ్చింది కేబీఆర్. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ సినిమా తీశాం. నాకు తెలిసిన స్ట్రాంగ్ మహిళ మా అమ్మ. ఆడవాళ్లకు స్వేచ్ఛ ఇస్తే ఆకాశమే హద్దు అనేరీతిలో తమ ప్రతిభ చూపిస్తారు. వాళ్ళ గొప్పదనం చాటి చెప్పేలా జర్నలిజం నేపథ్యంలో సినిమా చేశాం. మిమో త్వైకాండోలో బ్లాక్ బెల్ట్ ఉంది. యాక్షన్ సీన్స్ ఇరగదీశారు. సాషా కూడా బాగా చేశారు. తనికెళ్ళ భరణి గారు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో కంటతడి పెట్టించారు. అందరూ సినిమాను చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... ''ఇందులో నటించిన సషా భారతదేశం మొత్తానికి తెలుసు. 4జీ యాడ్తో ఆమె అందరికీ పరిచయమైంది. ఆ యాడ్తో మారుమూల పల్లెటూళ్లలో కూడా ఆమె మంచి పాపులరిటీని సొంతం చేసుకున్న సషా ఇందులో హీరోయిన్గా నటించింది. ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఒకప్పుడు చంపేసేవారు. ఆడపిల్ల సబల కాదు అబల అనుకునేవారు. కానీ పెంపకం చక్కగా ఉంటే, ఆడపిల్ల ఏ స్థాయికైనా వెళుతుందనే నేపథ్యంలో ఈ కథని సిద్ధం చేశారని తెలిసింది. ట్రైలర్ కూడా చాలా బాగుంది. హీరో మిమో చక్రవర్తి కూడా వాళ్ల నాన్న మిథున్ చక్రవర్తిలా తెలుగులోనే మొదటి సినిమా చేస్తున్నారు. ఆయనలానే ఈయన కూడా సక్సెస్ అవ్వాలని, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాధ్ రెడ్డితో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్, బ్రహ్మజీ, ప్రేమ్ రక్షిత్ వీడియో బైట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.