breaking news
Peter Navarro
-
ఆయన్ని పట్టించుకోకండి.. ట్రంప్-మోదీ మధ్యే గొడవలు పెట్టబోయాడు
టారిఫ్ వార్తో మొదలైన అమెరికా-భారత్ ఉద్రిక్తతలు.. ట్రంప్-మోదీ పరస్పర సోషల్ మీడియా స్నేహపూర్వక సందేశాలతో కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. ఈ తరుణంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్(John Bolton) కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత.. సోషల్ మీడియా విమర్శలు పక్కనపెట్టి వాస్తవిక వ్యూహాత్మక చర్చలు జరగాలని ఇరు దేశాలకు సూచించారాయన.అంతేకాదు.. ట్రంప్ వాణిజ్యసలహాదారు పీటర్ నవారో(Peter Navarro) వల్లే భారత్, అమెరికా మధ్య సంబంధాలు చెడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని బోల్టన్ అంటున్నారు. తాజాగా భారత్కు చెందిన ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలే వెల్లడించారు.పీటర్ నవారో అనే వ్యక్తి ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య గొడవను ప్రేరేపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నవారో అనే వ్యక్తి ఎలాంటి వారంటే.. ఒక గదిలో ఆయన్ని మాత్రమే ఉంచండి. ఓ గంట తర్వాత వచ్చి చూడండి. ఆయనతో ఆయనే గొడవ పడుతుంటాడు.. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. అయితే..భారత్పై నవారో చేస్తున్న ఆరోపణలు తీవ్రతతో కూడుకున్నవే అయినప్పటికీ.. ప్రాధాన్యత లేని అంశంగా ఇరు దేశాలు భావించాలి. అసలు వాణిజ్య చర్చలు ప్రామాణిక ప్రతినిధుల మధ్య జరగాలి. అలాగే.. భారత్ సోషల్ మీడియా తరఫున బెదిరింపులు, గందరగోళం లాంటివి లేకుండా ఉంటే మరీ మంచిది. అప్పుడే.. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణంలో ఒప్పందానికి అవకాశం ఉంటుంది.అలాగని ఈ సమస్యలు తేలికగా.. త్వరగా పరిష్కారమవుతాయన్నది నేను అనుకోవడం లేదు. కానీ రెండు పక్షాల్లోనూ మంచి నమ్మకం ఉంటుందని.. అదే మార్గం ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది అని భావిస్తున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అంతర్జాతీయ సంబంధాలను తన వ్యక్తిగత సంబంధాలతో పోల్చుకుంటారు. ఉదాహరణకు.. ట్రంప్ మోదీ(modi) మధ్య మంచి సంబంధం ఉంటే.. ఆయన దృష్టిలో భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉన్నట్లే అని బోల్టన్ చెప్పారు. కాబట్టి ఇరు దేశాధినేతల మధ్య ప్రజాస్వామ్యానికి హాని కలిగించే గొడవలు కాకుండా.. నిజమైన వ్యూహాత్మక చర్చలు జరగాలని బోల్టన్ ఆశించారు.ఇదిలా ఉంటే.. భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ టారిఫ్లను కొందరు అమెరికా విశ్లేషకులు తప్పుపట్టగా.. పీటర్ నవారో, బెసెంట్ వంటి వారు మాత్రం భారత్ను ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని నవారో ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన మాటలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.అయినప్పటికీ రష్యాతో భారత్ కొనసాగిస్తున్న విధానాలపై ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. భారత్ను టారిఫ్ మహారాజా అని పిలుస్తూ.. రష్యా చమురు కొనుగోలుపై బ్లడ్ మనీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన ఆరోపణలు అబద్ధమని ఎక్స్ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. అయినప్పటికీ.. నవారో తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. అంతేకాదు.. భారతీయ సోషల్ మీడియా యూజర్లను కీబోర్డ్ మినియన్స్(తెలివి తక్కువ, పనికి మాలిన అని నానార్థాలు వస్తాయి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు భారతీయులు నవారోని టార్గెట్ చేస్తూ పోస్టులతో తిట్టిపోస్తున్నారు. -
నవారో వ్యాఖ్యలు అసంబద్ధం
న్యూఢిల్లీ: భారత్పై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లను సమర్థించడంతోపాటు భారతీయుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి కేవలం బ్రాహ్మణులు లాభపడుతున్నారంటూ అమెరికా శ్వేతసౌధం ఆర్థిక సలహాదారు పీటర్ నవారో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ తీవ్రంగా ఖండించారు. నవారో వ్యాఖ్యలు అసంబద్ధం అంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడొద్దని నవారోకు సూచించారు. భారత్–అమెరికా సంబంధాలు తమ ప్రభుత్వానికి చాలా అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఇరుదేశాలు మధ్య సమగ్ర, ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని గుర్తుచేశారు. రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలే పునాది అని స్పష్టంచేశారు. గతంలోనూ ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్–అమెరికా సంబంధాలు ఏమాత్రం దెబ్బతినలేదని తెలిపారు. బలమైన ద్వైపాక్షిక అజెండాను ముందుకు తీసుకెళ్లడంపై రెండు దేశాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలే ఆధారంగా భారత్–అమెరికా అనుబంధం ఎప్పటిలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు రణదీర్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. రెండు దేశాలు కలిసి పని చేస్తూనే ఉన్నాయని చెప్పారు. కీలక అంశాలపై సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. -
టిక్టాక్, వీచాట్లపై త్వరలోనే కఠిన చర్యలు!
వాషింగ్టన్: టిక్టాక్ సీఈఓ కెవిన్ మేయర్పై శ్వేతసౌధ వాణిజ్య సలహాదారు పీటర్ నావరో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చైనీస్ సోషల్ మీడియా యాప్ అభివృద్ధికై పనిచేస్తున్న కెవిన్.. ‘‘అమెరికన్ తోలుబొమ్మ’’ అంటూ మండిపడ్డారు. మహమ్మారి కరోనా కల్లోలం, హాంకాంగ్లో కొత్త జాతీయ భద్రత చట్టం, వీగర్ ముస్లింలపై అకృత్యాలు, టిబెట్లో భద్రతాపరమైన ఆంక్షలు తదితర విషయాల్లో చైనాపై అమెరికా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్పై కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు శ్వేతసౌధ ప్రతినిధులు ఇదివరకే సంకేతాలు ఇచ్చారు. సరిహద్దు వివాదాల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా చైనీస్ యాప్లపై భారత్ నిషేధం విధించిన తర్వాత అమెరికా సైతం ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చైనీస్ దిగ్గజం వావే టెక్నాలజీస్పై ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం టిక్టాక్ సహా వీచాట్ తదితర యాప్లను బ్యాన్ చేసే దిశగా ముందుకు సాగుతోంది.(చైనా మూలాలను చెరిపేస్తున్న టిక్టాక్) ఈ నేపథ్యంలో ఆదివారం ఫాక్స్ బిజినెస్తో మాట్లాడిన పీటర్ నావరో ప్రజల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తూ, అమెరికన్ల డేటాను తమ దేశానికి చేరవేస్తున్న చైనీస్ యాప్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారన్నారు. ‘‘ఈ విషయాన్ని అమెరికా ప్రజలంతా అర్థం చేసుకోవాలి. పిల్లలకు వినోదాన్ని కలిగించే కొన్ని మొబైల్ యాప్ల నుంచి డేటా మొత్తం నేరుగా చైనా సర్వర్లలోకి వెళ్లిపోతుంది. అంటే చైనీస్ మిలిటరీ, చైనీస్ కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోకి అన్నమాట. అంతేకాదు మన మేథోసంపత్తిని దొంగిలించాలనుకునే మరికొన్ని సంస్థల చేతుల్లోకి కూడా. మనకు సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక కార్యకలాపాల సమాచారాన్ని సేకరించి బ్లాక్మెయిల్, దోపిడీకి దిగే అవకాశం ఉంది. నాకు తెలిసి టిక్టాక్, వీచాట్ యాప్లపై త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ట్రంప్ ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టే ఉంటారని భావిస్తున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన టిక్టాక్ అధికార ప్రతినిధి తాము చట్టాలకు లోబడే పనిచేస్తున్నామని, యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేయలేదని స్పష్టం చేశారు.(చైనాపై మరిన్ని ఆంక్షలు: అమెరికా) కాగా టిక్టాక్కు ఇప్పటికే అమెరికాలో గట్టి ఎదురుదెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్.ఎల్వై(Musical.ly)ఒప్పందం కుదుర్చుకున్న టిక్టాక్ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని అతిక్రమించిందని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్టీసీ) ఇదివరకే సంస్థకు 5.7 మిలియన్ డాలర్ల మేరు జరిమానా విధించింది. అదే విధంగా 2019 ఫిబ్రవరిలో ఎఫ్టీసీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని(కన్సెంట్ డిక్రీ) టిక్టాక్ ఉల్లంఘించిందని పలు అమెరికా అడ్వకసీ గ్రూపులు టిక్టాక్పై ఫిర్యాదు చేశాయి. అంతేగాక తమ పాటలను యథేచ్చగా వాడుకుంటూ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పలు టాప్ అమెరికన్ మ్యూజిక్ కంపెనీలు టిక్టాక్పై దావా వేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడ్డాయి. -
'డెత్ బై చైనా': డ్రాగన్కు మళ్లీ ట్రంప్ షాక్!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మొదటినుంచి చైనా వ్యతిరేక విధానాలను బాహాటంగా అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన.. చైనా అంటేనే విరుచుకుపడే ఆర్థికవేత్త పీటర్ నెవారోను తన సలహాదారుగా ఎన్నుకున్నారు. కీలక విధాన నిర్ణయాలకు ఉద్దేశించిన వైట్హౌస్ జాతీయ వాణిజ్య మండలి అధిపతిగా నెవారోను ఎంపిక చేశారు. విద్యావేత్త అయిన నెవారో గతంలో వన్టైమ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్గా కూడా పనిచేశారు. చైనాతో అమెరికాకు పొంచి ఉన్న ముప్పుపై ఎన్నో పుస్తకాలు రాశారు. ఒక సినిమా కూడా తీశారు. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక ఆధిపత్య శక్తి, సైనిక శక్తిగా చైనా ఎదుగాలనుకుంటున్నదని, దీనితో అమెరికాకు ముప్పు పొంచి ఉన్నదని ఆయన విశ్లేషించారు. ఆర్థిక విధానాల్లో కాబోయే అధ్యక్షుడిగా సలహాదారుగా ఎన్నికైన నెవారో మంచి ఆర్థిక దర్శనికుడని, ఆయన దేశ వ్యాపార, వాణిజ్యాలు క్షీణించకుండా, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేలా, విదేశాలకు ఉద్యోగాలు తరలిపోకుండా ఆర్థిక విధానాల రూపకల్పనలో తోడ్పాటు అందించనున్నారని ట్రంప్ టీమ్ పేర్కొంది. కాలిఫోర్నియా, ఇర్విన్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించిన 67 ఏళ్ల నెవారో అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంలోనూ ట్రంప్కు కీలక సలహాదారుగా వ్యవహరించారు. ఆయన రాసిన పుస్తకాల్లో 'డెత్ బై చైనా: హౌ అమెరికా లాస్ట్ ఇట్స్ మాన్యుఫాక్చరింగ్ బేస్' అనే పుస్తకం డాక్యుమెంటరీ ఫిలిమ్గా రూపొందింది. చైనాతో ఆర్థిక యుద్ధంలో అమెరికా ఓడిపోతుందని, దీంతో చైనా దిగుమతుల వల్ల అమెరికాలో పర్యావరణ సమస్యలే కాక, మేధోసంపన్న విషయాల్లోనూ విఘాతం ఏర్పడుతుందని ఆయన విశ్లేషించారు. తదుపరి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్ తన పాలనలో చైనాపై ఎలాంటి వైఖరి అనుసరించనున్నారనో చెప్పకనే చెబుతున్నారు. చైనాపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఆయన తన విధానాలను రూపొందిస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల తైవాన్ అధినేతతో ట్రంప్ ఫోన్లో మాట్లాడటం అమెరికా-చైనా మధ్య ఘర్షణాత్మక వాతావరణం సృష్టించిన సంగతి తెలిసిందే.