Plain zones
-
అటా...ఇటా..?
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల్లోని ఉద్యోగులు ఎటువైపు అనే విషయం మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమల్నాథన్ కమిటీ విధి విధానాలను ఇంకా వెలువరించకున్నప్పటికీ, ముంపు మండలాల్లో పనిచేస్తున్న వారిని ప్రత్యేకంగా పరిగణించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ముంపు మండలాల్లో పనిచేసే ఉద్యోగులు వారికి నచ్చిన రాష్ట్రంలో పనిచేసేలా అప్షన్ కల్పించే ందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ముంపు మండలాల్లోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు వివరాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. సదరు ఉద్యోగులు ప్రస్తుతం పనిచేసే చోటనే ఉంటారా..? లేదా..? అనే అభిప్రాయాన్ని కూడా అధికారులు తెలుసుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ ఇలంబరితి జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సైతం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల్లో దీనిపైనే చర్చ సాగుతోంది. ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారు కోరుకున్న రాష్ట్రంలోనే పనిచేసేలా అప్షన్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలను చూసే క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అంటే ముంపులో పనిచేసే వారికి సెప్టెంబర్ నెల వేతనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికి ప్పుడు ఉద్యోగులందరినీ వెనుక్కు తీసుకురావాలన్నా అనేక ఇబ్బందులు ఉంటాయి. వారందరినీ ఖమ్మం జిల్లాలో సర్దుబాటు చేయటం కూడా కష్టమే. ఆ స్థాయిలో ఇక్కడ ఖాళీలు కూడా లేవు. దీంతో వారిని ప్రస్తుతానికి అక్కడనే పనిచేయించి, వేతనాలు ఏపీ ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వానికి ముంపు ఉద్యోగుల జాబితాలను పంపించేలా కలెక్టర్ ఇలంబరితి చర్యలు చేపట్టారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముంపులో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో కూడిన నివేదికలు సిద్ధమవుతున్నాయి. అయోమయంలో ముంపు ఉద్యోగులు... ముంపు మండలాల్లో పనిచేస్తున్న వారిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతుండటంతో ఆ ప్రాంత ఉద్యోగులు కొందరిలో అయోమయం నెలకొంది. ఇళ్లు, పొలాలు, బంధు వర్గాలను ముంపులో వదిలేసి తెలంగాణ రాష్ట్రానికి రావాలా..? లేక ఆ ప్రాంతంలోనే ఉండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. ముంపులోనే ఉంటే భవిష్యత్లో పునరావాసం కల్పించే సమయంలో రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందేమోననే సందేహం కూడా వారిని వేధిస్తోంది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి పరిస్థితి ఏమిటి... ముంపు మండలాలైన చింతూరు, కూనవర ం, వీఆర్పురం, భద్రాచలం రూరల్, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన వారు ఉద్యోగ రీత్యా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ముంపు ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ వీరికి ఏ విధంగా ఆప్షన్లు కల్పిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అదే విధంగా జిల్లా, జోనల్ స్థాయిలో పనిచేస్తున్న వారిలో కొంతమంది ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఉద్యోగుల విభజన ఏ రీతిన చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కమల్నాథన్ కమిటీ కేవలం రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విభజనకు మాత్రమే విధి విధానాలు విడుదల చేసే అవకాశం ఉంది. కాగా ఖమ్మం జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ ఆప్షన్ సౌకర్యం కల్పిస్తే భవిష్యత్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఉద్యోగ సంఘాల వారు అంటున్నారు. ఆ దిశగా ఇరు రాష్ట్రా ప్రభుత్వాలు ఆలోచించాలని వారు కోరుతున్నారు. -
‘ముంపు’లో ఆంధ్ర పాలనకు రెడీ..!
భద్రాచలం: ముంపు మండలాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో లాంఛనాన్ని పూర్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్కు బదలాయించిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో సెప్టెంబర్ 1 నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే పాలన సాగేలా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దీనిలో భాగంగానే ‘తూర్పుగోదావరి జిల్లా రాజపత్రం’ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో రంపచోడవరం ఆర్డీవో కార్యాలయం నుంచి ప్రత్యేక దూత గురువారం చింతూరు, కూనవరం, వీఆర్ పురం, భద్రాచ లం ఎంపీడీవో, తహశీల్దారులకు నేరుగా ఇచ్చారు. ‘విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకునే విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రజలు నేరుగా లేదా లేఖల ద్వారా తెలియజేయవచ్చు’ అని కూడా అందులో ఉంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా రాజపత్రాన్ని అక్కడి కలెక్టర్ నుంచి కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలకు అందాయి.ఉత్తర్వులు వెలువడిన 30 రోజుల్లోగా ప్రజలు తమ సలహాలను, అభ్యంతరాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని రాజపత్రంలో ఉంది. మండల కార్యాలయాలు నెల్లిపాకకు తరలింపు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా అధికారుల నుంచి భద్రాచలం డివిజన్లోని ముంపు మండలాలకు పలుమార్లు వివిధ అంశాలపై లేఖలు పంపిచారు. అవి చింతూరు, వీఆర్పురం, కూనవరం మండల అధికారులకు మాత్రమే అందాయి. తూర్పుగోదారి జిల్లా రాజపత్రం పేరిట ఉన్న ఉత్తర్వులు భద్రాచలం మండల అధికారులకు కూడా అందజేశారు. భద్రాచలం రెవెన్యూ గ్రామం మాత్రమే తెలంగాణకు మినహాయించి, మిగతా మండలంతా ఆంధ్రప్రదేశ్కు బదలాయించి, నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటించారు. భద్రాచలం రెవెన్యూ గ్రామంలోని కార్యాలయ భవనాలు ఇక్కడనే ఉంటాయని, వీటిలో పనిచేస్తున్న ఉద్యోగులంతా నెల్లిపాక కేంద్రంగా విధులు నిర్వహించాల్సుంటుందని తూర్పు గోదావరి జిల్లా అధికారులు చెబుతున్నారు. దీనినిబట్టి ఎంపీడీవో, తహశీల్దార్, ఇతర సిబ్బంది నెల్లిపాకకు వెళ్లాల్సిందేనా..? అనే చర్చ సాగుతోంది. దీనిలో భాగంగానే భద్రాచలం మండల అధికారులకు కూడా ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం. గ్రామసభలకు ముందుకెళ్లేదెలా..? తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి తరచూ ముంపు మండల అధికారులకు ఉత్తర్వులు అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భాగంగా, ఖమ్మం కలెక్టర్ అజమాయిషీలో పనిచేస్తున్న తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవాలని ఇక్కడి అధికారులు బహిరంగానే ప్రశ్నిస్తున్నారు. ముంపు మండలాల ఎంపీపీ ఎన్నికల విషయంలో ఇలానే వ్యవహరించగా, ఎన్నికల కమిషన్ నుంచి అక్షింతలు వేయించుకోవాల్సి వచ్చింది. తాజాగా, ముంపు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలంటూ అక్కడి తూ.గో. జిల్లా పరిషత్ సీఈవో ఆదేశించారు. ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక సర్వేకు ఇక్కడి అధికారులు సిద్ధమవుతుఆన్నరు. ఇలా, రెండు ప్రభుత్వాల నుంచి వస్తున్న ఆదేశాలతో ముంపు మండలాల్లోని అధికారులు ,ఉద్యోగులు ఇరకాటంలో పడుతున్నారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణపై గ్రామసభలకు ఎలా వెళ్లేదని వారు అయోమయంలో ఉన్నారు.