పుష్కర భక్తుల జేబులకు 'పార్కింగ్' చిల్లు
అమరావతి (పట్నంబజారు) : అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లుంది అధికార పార్టీ నేతల తీరు. ప్రశాంత వాతావరణంలో పుష్కర స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
గుంటూరు నుంచి అమరావతికి వచ్చే దారిలో ఏర్పాటు చేసిన పుష్కరనగర్ వద్ద పార్కింగ్లకు స్థలాన్ని కేటాయించారు. ద్విచక్ర వాహనాలు, వృద్ధులు, వికలాంగులున్న వాహనాలను మాత్రం లోపలికి అనుమతించాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇవన్నీ పట్టని పార్కింగ్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్లో పెట్టాల్సిందేనంటూ... దందా చేస్తున్నారు. రశీదుల్లో ఒక రేటు ఉంటే..అదనంగా తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ద్విచక్ర వాహనానికి రూ 20, కారు, జీపు, ఆటోలకు రూ.50, బస్సులు, లారీలకు రూ.100 వసూలు చేస్తున్నారు.
ఈ వ్యవహారం గురించి పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినప్పటీకీ పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.lఅధికారి పార్టీకి చెందిన జెడ్పీటీసీ బంధువు పార్కింగ్ నిర్వహిస్తుండటంతోనే నోరు మెదపడం లేదని సమాచారం. పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపేందుకు నిర్వాహకులకు పోలీసులు సహకరించటంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర నగర్ నుంచి ఉచిత బస్సుల్లో అమరావతి చేరుకున్నప్పటీకీ కిలోమీటకు పైగా నడవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పార్కింగ్ దందాను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.