quarterly period
-
డీహెచ్ఎఫ్ఎల్ లాభం 32% అప్
క్లిష్ట క్యూ3లోనూ నిలకడ వృద్ధి: సీఎండీ న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక కాలంలో రూ.245 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.186 కోట్లు)తో పోల్చితే 32 శాతం వృద్ధి సాధించామని డీహెచ్ఎఫ్ఎల్ తెలిపింది. గత క్యూ3లో రూ.1,885 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,367 కోట్లకు పెరిగిందని డీహెచ్ఎఫ్ఎల్ సీఎండీ కపిల్ వాధ్వాన్ చెప్పారు. నికర వడ్డీ మార్జిన్ 2.87 శాతం నుంచి 3.07 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, బ్యాంక్లు వడ్డీరేట్లు తగ్గించడం వంటి ప్రతికూల అంశాలున్నప్పటికీ ఈ క్వార్టర్లో నిలకడైన వృద్ధిని సాధించామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేర్ 6 శాతం లాభంతో రూ.288 వద్ద ముగిసింది. -
యస్ బ్యాంక్ నికర లాభం 31 శాతం అప్
ముంబై: ప్రైవేట్ రంగంలోని యస్బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.802 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.610 కోట్లు)తో పోల్చితే 31 శాతం వృద్ధి సాధించామని యస్బ్యాంక్ తెలిపింది. వడ్డీ ఆదాయం 31 శాతం వృద్ధితో రూ.1,446 కోట్లకు పెరగడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణా కపూర్ చెప్పారు. వడ్డీయేతర ఆదాయం 44 శాతం వృద్ధితో రూ.888 కోట్లకు పెరిగిందని తెలిపారు. రుణాలు 38 శాతం పెరిగాయని పేర్కొన్నారు. కరంట్, సేవింగ్ అకౌంట్ డిపాజిట్లు 30 శాతానికి పైగా పెరిగినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ 3.4% రేంజ్లో ఉందని చెప్పారు. స్థూల మొండి బకాయిలు 0.61% నుంచి 0.83 శాతానికి, కేటాయింపులు రూ.104 కోట్ల నుంచి రూ.162కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.