
యస్ బ్యాంక్ నికర లాభం 31 శాతం అప్
ముంబై: ప్రైవేట్ రంగంలోని యస్బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.802 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.610 కోట్లు)తో పోల్చితే 31 శాతం వృద్ధి సాధించామని యస్బ్యాంక్ తెలిపింది. వడ్డీ ఆదాయం 31 శాతం వృద్ధితో రూ.1,446 కోట్లకు పెరగడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణా కపూర్ చెప్పారు.
వడ్డీయేతర ఆదాయం 44 శాతం వృద్ధితో రూ.888 కోట్లకు పెరిగిందని తెలిపారు. రుణాలు 38 శాతం పెరిగాయని పేర్కొన్నారు. కరంట్, సేవింగ్ అకౌంట్ డిపాజిట్లు 30 శాతానికి పైగా పెరిగినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ 3.4% రేంజ్లో ఉందని చెప్పారు. స్థూల మొండి బకాయిలు 0.61% నుంచి 0.83 శాతానికి, కేటాయింపులు రూ.104 కోట్ల నుంచి రూ.162కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.