Ram Rajya
-
లైంగిక దాడులతో రామ రాజ్యం ఎలా తెస్తారు..?
సాక్షి, ముంబై : శ్రీరాముడు దిగివచ్చినా దేశంలో లైంగిక దాడులను ఆపలేడని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీజేపీపై శివసేన విరుచుకుపడింది. శాంతి భద్రతలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిన క్రమంలోఈ పరిస్థితిల్లో బీజేపీ రామ రాజ్యాన్ని ఎలా ప్రతిష్టిస్తుందని ప్రశ్నించింది. 2012లో నిర్భయ ఘటన చోటుచేసుకున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత పాలక పార్టీ వైఖరి గతం కంటే భిన్నంగా ఉందని శివసేన దుయ్యబట్టింది. ప్రభుత్వాలు మారినా లైంగిక దాడులు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. భావోద్వేగ అంశాలతో చెలగాటమాడటం హింసకు దారితీస్తుందని, ఎన్నికల్లో విజయం కోసం ఈ తరహా వ్యూహాలను అనుసరించాలని శ్రీరాముడు ఎన్నడూ చెప్పలేదని వ్యాఖ్యానించింది. బీజేపీ రామ రాజ్యాన్ని తీసుకురావడంపై మాట్లాడుతుందని, ఎలా రామ రాజ్యాన్ని తీసుకువస్తారో ఆ పార్టీ స్పష్టం చేయాలని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన నిలదీసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనా రామ రాజ్యం రాలేదని వ్యాఖ్యానించింది. స్వయంగా దేవుడే దిగివచ్చినా దేశంలో అత్యాచారాలను నిరోధించలేడని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలే శాంతిభద్రతలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందని తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. అన్నీ డబ్బులతో సమకూరవని పేర్కొన్న శివసేన మహిళల భద్రతను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. నిరుద్యోగ సమస్యను కేవలం మాటలతో పరిష్కరించలేరని పేర్కొంది. -
రామరాజ్యంలోనూ రేప్లు జరిగాయన్న డీజీపీ!
లక్నో: రామ రాజ్యంలోనూ రేప్ లు జరిగాయట.. మహిళలపై అత్యాచారాలు చాలా కామన్ అట.. వాటిని నిరోధించడం ఎవరివల్లా కాదట.. చివరికి పోలీసుల వల్లా కాదంటూ చెత్తులెత్తేసిన పెద్దమనిషి ఎవరో కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ. ఉత్తరప్రదేశ్ డీజీపీ జగ్ మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. త్వరలో రిటైర్ కాబోతున్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ అసహనంగా స్పందించారు. జర్నలిస్టులపై రెచ్చిపోయారు. అత్యాచారాలు చాలా సాధారణమని, రామరాజ్యంలో కూడా రేప్లు జరిగాయంటూ వివాదాస్పదంగా మాట్లాడి సంచలనం రేపారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న లైంగిక దాడుల గురించి మీడియా ప్రశ్నించినపుడు.. ''మహిళలపై అఘాయిత్యాలను ఆపడం ఎవరి తరమూ కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ అత్యాచారాలు జరుగుతున్నాయి. రామరాజ్యంలో కూడా రేప్ లు జరిగాయి'' అంటూ మీడియాపై ఎగిరిపడ్డారు. దీనిపై మరింత వివరణ కోరిన జర్నలిస్టుతో 'నన్ను ప్రైవేట్ గా కలువు, అప్పుడు దీనికి జవాబు చెబుతా' అన్నారు. మహిళలపై అత్యాచారాలను పోలీసులు కూడా పూర్తిగా అరికట్టలేరంటూ తేల్చి పారేశారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన రాష్ట్ర డీజీపీ వివాదాస్పదంగా స్పందించడంపై పలువురు మండిపడుతున్నారు. డీజీపీ వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు, మహిళా, ప్రజాసంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని బీజేపీ మండిపడింది. ఆయన పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ డిమాండ్ చేశారు.