breaking news
Reengineering
-
ప్రాణహిత–చేవెళ్ల.. రూ.35 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలు సవరిస్తూ కొత్త ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) సిద్ధమవుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన 1, 2, 3, 4, 5, 23, 24, 25, 26 ప్యాకేజీల పనులను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రీ ఫీజబిలిటీ నివేదికను సిద్ధం చేయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కసరత్తు ప్రారంభించిన అధికారులు..పెరిగిన ధరల ప్రకారం ఈ 9 ప్యాకేజీల పనుల అంచనాలను సవరిస్తే, ప్రాజెక్టు వ్యయం ఐదారు రెట్లు పెరిగి రూ.35 వేల కోట్లకు చేరే అవకాశం ఉందనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. మూడు కాంపొనెంట్లుగా విభజన: ఈ 9 ప్యాకేజీల పనులను మూడు విభాగాలుగా పీఎఫ్ఆర్లో ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం, బరాజ్ నుంచి గ్రావిటీ ద్వారా 20 టీఎంసీలను ఆదిలాబాద్ జిల్లాకు తరలించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి రంగారెడ్డి జిల్లాలో 2.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పనులను ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. ప్యాకేజీలు–1, 2, 3, 4, 5 పూర్తైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందనుంది. ప్యాకేజీలు–23, 24, 25, 26 పూర్తైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకర్గాల్లోని మొత్తం 2.47లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రంగారెడ్డి జిల్లాలోని హాల్దీ, మూసీ నదులకు, చేవెళ్ల చెరువుకు తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు సరఫరా కానున్నాయి. త్వరలో మహారాష్ట్రకు రాష్ట్ర బృందం మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపి 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి అంగీకారం తీసుకోవాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి వద్ద నుంచి 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా మొత్తం 80 టీఎంసీల నీళ్ల తరలింపును పీఎఫ్ఆర్లో ప్రతిపాదిస్తున్నారు. గోదావరి జలాల్లో రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల కేటాయింపులకు లోబడే ఈ ప్రతిపాదనలు చేస్తున్నారు. త్వరలో నీటిపారుదల శాఖ అధికారుల బృందం తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరపనుంది. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందని గతంలో సీడబ్ల్యూసీ తేల్చింది. రీ ఇంజనీరింగ్లో ఈ ప్యాకేజీలు తొలగింపు ఉమ్మడి ఏపీలో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారం.. గోదావరిపై ఆదిలాబాద్ జిల్లా కౌతాల మడంలం తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించి 165 టీఎంసీల నీళ్లను తరలించడం ద్వారా మొత్తం 16.4 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత బీఆర్ఎస్ సర్కారు ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ను చేపట్టింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు మార్పులు చేర్పులతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. తొలి ప్రాజెక్టులో ప్యాకేజీలు–1, 2, 3,4, 5, 23, 24, 25, 26 కింద ప్రతిపాదించిన పనులను తొలగించి మిగతా పనులను కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టింది. ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన 2 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదించిన 2.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా కలగానే మిగిలిపోయింది. ప్యాకేజీ–3 కింద తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్, ప్యాకేజీ–1, 2, 4 కింద తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 71.5 కి.మీల ప్రధాన కాల్వ, ప్యాకేజీ–5 కింద మైలారం వద్ద పంప్హౌస్తో పాటు అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నీళ్లను తీసుకెళ్లే కాల్వను నిర్మించాల్సి ఉంది. ఈ ఐదు ప్యాకేజీల పనులకు తొలుత రూ.3,084.13 కోట్లతో అంచనాలు రూపొందించగా, తర్వాత రూ.4,204 కోట్లకు సవరించారు. కాగా రీ ఇంజనీరింగ్కు ముందే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం రూ.11,150 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 71.5 కి.మీల కాల్వ నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. -
వరద కాల్వ భారం 5,156 కోట్లు
- రీఇంజనీరింగ్తో రూ.4,729.26కోట్ల నుంచి రూ.9,886.19 కోట్లకు పెరుగుదల - ఆమోదం తెలిపిన నీటి పారుదల శాఖ స్టాండింగ్ కమిటీ సాక్షి, హైదరాబాద్: గోదావరి వరద జలాల వినియోగానికి ఎస్సారెస్పీ ప్రాజెక్టుపై చేపట్టిన ఇందిరమ్మ వరద ప్రవాహ కాల్వ (ఎఫ్ఎఫ్సీ)లో చేసిన రీఇంజనీరింగ్తో ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుతోంది. 2009లో సవరించిన అంచనాతో పోలిస్తే ప్రస్తుత అంచనా ఏకంగా రూ.5,156 కోట్ల మేర పెరగనుంది. ప్రస్తుతం పెరిగిన వ్యయ అంచనా రూ.9,886.19 కోట్లకు నీటి పారుదల శాఖ రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ రెండు రోజుల కింద ఆమోదించింది. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఎస్సారెస్పీ దిగువ నుంచి 20 టీఎంసీల వరద నీటిని వినియోగించుకుంటూ 2.2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ఎఫ్ఎఫ్సీ చేపట్టారు. 1996లో దీన్ని చేపట్టినా 2009 నుంచి దీని పనులు వేగిరమయ్యాయి. అప్పట్లో రూ.4,729.26 కోట్లకు అంచనా వేసి పనులు చేపట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టు పరిధిలో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. గోదావరిలో వరద ఉండే 170 రోజుల్లో 38.182 టీఎంసీల నీటిని దేవాదుల ప్రాజెక్టుకు ఎత్తిపోసి దీని ద్వారా 6.21 లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఇక్కడ వరద 120 రోజులే ఉంటుందని, నీటిలభ్యత 27 టీఎంసీలేనని గుర్తించి ఇందులోంచి 2 లక్షల ఆయకట్టును వరద కాల్వలో కలిపారు. కొత్తగా వరద కాల్వ ద్వారా నీరు అందించాలంటే 3.3 కిలోమీటర్ల అదనపు టన్నెల్ నిర్మాణంతో పాటు 48 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ తవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. మిడ్మానేరు రిజర్వాయర్ కెనాల్ తొలి నుంచి 36 కిలోమీటర్ల వరకు కెనాల్ సామర్థ్యాన్ని 2,600 క్యూసెక్కుల నుంచి 4,200 క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. గౌరవెల్లి రిజర్యాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు, గండిపల్లి సామర్థ్యాన్ని 0.15 టీఎంసీ నుంచి 1.40 టీఎంసీకి పెంచారు. ఈ పనులకు భారమే ఏకంగా రూ.1,520 కోట్ల వరకు ఉంది. -
నివేదికలు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణాలా?
సీఎస్కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ లేఖ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రీఇంజనీరింగ్ పేరిట మార్పులు చేస్తు న్న ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు లేకుండానే టెండర్లు పిలిచి, నిర్మాణ పనులు చేపట్టడంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుది నివేదికలు రాకుండానే, ఇష్టారీతిన వ్యయ అం చనాలు ఖరారు చేసి టెండర్లు పిలవడమేం టని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు శుక్రవారం రాసిన లేఖలో ప్రశ్నించారు. ప్రాజెక్టు నివేదికలను ప్రజల ముందుంచాలన్నారు. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో రీఇంజనీరింగ్తో డిజైన్లో మార్పులు చేసి వ్యయాలను పెంచినప్పటికీ, పనులను పాత కాంట్రాక్టర్లకు కట్టబెట్టేలా నిర్ణయాలు చేస్తున్నారన్నారు. కొన్ని ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులు సైతం మొదలు పెట్టకుండానే వ్యయాన్ని రూ.35,200 కోట్ల నుంచి రూ.47,500 కోట్లకు ఎలా పెంచుతారని ప్రశ్నించారు.