వరద కాల్వ భారం 5,156 కోట్లు
- రీఇంజనీరింగ్తో రూ.4,729.26కోట్ల నుంచి రూ.9,886.19 కోట్లకు పెరుగుదల
- ఆమోదం తెలిపిన నీటి పారుదల శాఖ స్టాండింగ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: గోదావరి వరద జలాల వినియోగానికి ఎస్సారెస్పీ ప్రాజెక్టుపై చేపట్టిన ఇందిరమ్మ వరద ప్రవాహ కాల్వ (ఎఫ్ఎఫ్సీ)లో చేసిన రీఇంజనీరింగ్తో ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుతోంది. 2009లో సవరించిన అంచనాతో పోలిస్తే ప్రస్తుత అంచనా ఏకంగా రూ.5,156 కోట్ల మేర పెరగనుంది. ప్రస్తుతం పెరిగిన వ్యయ అంచనా రూ.9,886.19 కోట్లకు నీటి పారుదల శాఖ రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ రెండు రోజుల కింద ఆమోదించింది. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఎస్సారెస్పీ దిగువ నుంచి 20 టీఎంసీల వరద నీటిని వినియోగించుకుంటూ 2.2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ఎఫ్ఎఫ్సీ చేపట్టారు.
1996లో దీన్ని చేపట్టినా 2009 నుంచి దీని పనులు వేగిరమయ్యాయి. అప్పట్లో రూ.4,729.26 కోట్లకు అంచనా వేసి పనులు చేపట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టు పరిధిలో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. గోదావరిలో వరద ఉండే 170 రోజుల్లో 38.182 టీఎంసీల నీటిని దేవాదుల ప్రాజెక్టుకు ఎత్తిపోసి దీని ద్వారా 6.21 లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఇక్కడ వరద 120 రోజులే ఉంటుందని, నీటిలభ్యత 27 టీఎంసీలేనని గుర్తించి ఇందులోంచి 2 లక్షల ఆయకట్టును వరద కాల్వలో కలిపారు.
కొత్తగా వరద కాల్వ ద్వారా నీరు అందించాలంటే 3.3 కిలోమీటర్ల అదనపు టన్నెల్ నిర్మాణంతో పాటు 48 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ తవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. మిడ్మానేరు రిజర్వాయర్ కెనాల్ తొలి నుంచి 36 కిలోమీటర్ల వరకు కెనాల్ సామర్థ్యాన్ని 2,600 క్యూసెక్కుల నుంచి 4,200 క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. గౌరవెల్లి రిజర్యాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు, గండిపల్లి సామర్థ్యాన్ని 0.15 టీఎంసీ నుంచి 1.40 టీఎంసీకి పెంచారు. ఈ పనులకు భారమే ఏకంగా రూ.1,520 కోట్ల వరకు ఉంది.