రూ.500,రూ.1000 నోట్లపై సవాలక్ష సందేహాలు
కరెన్సీపై కలకలం రేగుతోంది. 2005 కన్నా ముందు ముద్రించిన నోట్లన్నిటినీ వెనక్కి తీసుకుంటామని, మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఇవి చలామణిలో ఉంటాయని రిజర్వు బ్యాంకు ప్రక టించటంతో అయోమయం నెలకొంది. ప్రతి ఒక్కరూ తమ చేతికి వచ్చిన నోటు... 2005 కన్నా ముందటిదా? ఆ తరవాతదా? అనేది చూడటం మొదలైంది. చిన్నచిన్న దుకాణాలు, క్యాబ్ డ్రైవర్లు చాలామంది 2005కు ముందునాటి నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. మరోవంక ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని, నల్లధనాన్ని వెలికి తీసేందుకే ఈ చర్యకు దిగారని వార్తలు వెలువడటంతో శుక్రవారం ఆర్బీఐ రంగంలోకి దిగింది. దీనిపై మళ్లీ వివరణిచ్చింది. ‘‘మా చర్యపై ఎవ్వరికీ ఎలాంటి ఆందోళనా అవసరం లేదు.
2005కు ముందు ముద్రించిన వాటితో పోలిస్తే ఆ తరవాత ముద్రించిన నోట్లలో భద్రతా ప్రమాణాలు ఎక్కువ. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మార్చి 31 వరకూ పాతనోట్లు చెల్లుబాటులో ఉంటాయి. ఆ తరవాత కూడా ఎవరికి వారు బ్యాంకుల్లో పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవచ్చు. అసలు అప్పటిదాకా ఆగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటి నుంచే మీ దగ్గర పాత నోట్లుంటే వాటిని బ్యాంకుల ద్వారా మార్చుకోవచ్చు’’ అని వివరించింది. ఈ నేపథ్యంలో అసలు జరుగుతున్నదేంటి? దీనిపై జనంలో ఉన్న సందేహాలేంటి? బ్యాంకులెలా స్పందిస్తున్నాయి?
2005కి ముందు ముద్రించిన అన్ని నోట్లు వెనక్కి
ఏమిటి నిర్ణయం?
2005వ సంవత్సరానికి ముందు జారీచేసిన అన్ని కరెన్సీ నోట్లనూ ఉపసంహరిస్తారు.
ఎప్పటి నుంచి?
2014 మార్చి 31 దాకా మామూలుగానే చెల్లుబాటవుతాయి. ఆ తరవాత బ్యాంకుల్లో మార్చుకోవాలి.
ఎలా గుర్తించాలి?
2005కు ముందరి నోట్ల వెనక వాటిని ముద్రించిన సంవత్సరం ఉండదు.
2005 తరువాతి నోట్ల వెనక వాటిని ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
ఎలా మార్చుకోవాలి?
ఏప్రిల్ 1వ తేదీ తరవాత ఏ బ్యాంకుకైనా వెళ్లి పాత కరెన్సీ నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవచ్చని మొదట రిజర్వు బ్యాంకు ప్రకటించింది. కాకపోతే శుక్రవారం విడుదల చేసిన మరో ప్రకటనలో... నోట్ల మార్పిడి ఇప్పటి నుంచే చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సో! పాత నోట్లు మార్చుకోవడానికి ఏప్రిల్ 1 వరకూ ఆగక్కర్లేదన్న మాట. కాకుంటే ఎవ్వరైనా ఏ బ్యాంకులోనైనా మార్చుకునే వెసులుబాటు జూలై 1 వరకే.
మరి జులై 1 తరవాతో..?
రూ.1000 నోట్లు గానీ, రూ.500 నోట్లు గానీ 10 కన్నా ఎక్కువ ఒకేసారి మార్పిడి చేయాలనుకునేవారు తమకు ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలి. ఖాతాలేని బ్యాంకులో అయితే గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
ఎందుకీ ఉపసంహరణ?
తక్కువ భద్రత ఉన్న నోట్ల స్థానంలో ఎక్కువ భద్రత ఉన్నవి ప్రవేశపెట్టడానికేనని ఆర్బీఐ చెబుతోంది. ఇదంతా అంతర్జాతీయ ప్రమాణాలు పాటించటంలో భాగమేనని, 2005కు ముందునాటి కరెన్సీ నోట్లు ప్రజలపై భారీ ప్రభావం చూపే స్థాయిలో చలామణిలో లేవని కూడా చెబుతోంది.
ఎన్నికల నేపథ్యంలో నల్ల ధనాన్ని వెలికి తీయటానికేనని పత్రికా కథనాలు వెలువడుతున్నాయి.
నకిలీ నోట్ల కట్టడికి ఈ చర్య దోహదం చేస్తుందని అధికారులే చెబుతున్నారు.
2005కు ముందు ఎన్ని నోట్లు?
రూ. 1,000 నోట్లు: 42,10,00,000
నోట్ల విలువ: రూ. 42,100 కోట్లు
రూ. 500 నోట్లు: 305,50,00,000
నోట్ల విలువ: రూ. 1.52 లక్షల కోట్లు
రూ. 100 నోట్లు: 1232,80,00,000
నోట్ల విలువ: రూ. 1,23,282 కోట్లు
గతంలో ఒకసారి ఇలాగే...?
1977లో మొరార్జీదేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం.. నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఎక్కువ విలువ గల నోట్లను ఉపసంహరించింది. కానీ.. ఆశించిన ఫలితాలు దక్కలేదు. కారణం.. నల్లధనమంతా నేపాల్కు తరలిపోయింది. భారత కరెన్సీకి భారత్లో గల విలువ నేపాల్లోనూ ఉండటమే. నాటి తీరుపై సునీల్ పంత్ అనే ప్రభుత్వ బ్యాంకు మాజీ ఉన్నతాధికారి స్పందిస్తూ... ‘‘1977లో ఆర్బీఐ అధిక విలువ గల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. జనం వచ్చి వాటిని మార్చుకుంటారని మేం ఎదురుచూస్తుండేవాళ్లం. కానీ.. అలా జరగలేదు. అప్రకటిత కరెన్సీని బయటపెట్టాలంటూ ఒత్తిడి చేయటం వల్ల.. నల్లధనం సరుకుల వంటి ఇతర ఆస్తుల రూపంలోకి మారుతుంది.’’ అని చెప్పారు.
సందేహాలు... సమాధానాలు
ఏ నోట్లకు ఇది వర్తిస్తుంది?
ప్రస్తుతం రూ.5, 10, 20, 50, 100, 500, 1,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. వీటికి తాజా నిబంధన వర్తిస్తుంది.
పాత నోట్లు చెల్లవంటున్నారు.
మరి ఏటీఎంలలో అవి వస్తేనో..?
2005కు ముందున్న పాత నోట్ల మార్పిడిని బ్యాంకుల ద్వారా ఇప్పటికే ఆరంభించినట్లు ఆర్బీఐ స్పష్టంచేసింది. అంటే బ్యాంకులు పాత నోట్ల బదులు కొత్త నోట్లే వాడుతున్నాయన్న మాట. దీనర్థం అవి కస్టమర్లకు ఇచ్చే నోట్లు గానీ, ఏటీఎంలలో పెడుతున్నవి గానీ పాతవి ఉండవు.
ఏ బ్యాంకుకైనా వెళ్లి, ఎంతయినా మార్చుకోవచ్చా? ఎలాంటి వ్యక్తిగత వివరాలూ ఇవ్వాల్సిన అవసరం లేదా?
ఆర్బీఐ చెబుతున్న దాని ప్రకారం జులై 1 తరవాతే... ఇతర బ్రాంచుల్లో 10 కన్నా ఎక్కువ నోట్లిస్తే వివరాలు సమర్పించాలి. అంతకు ముందయితే ఎలాంటి వివరాలూ ఇవ్వకుండానే ఎన్ని నోట్లయినా మార్చుకోవచ్చు. దీనిపై ఓ ప్రయివేటు జాతీయ బ్యాంకు ప్రతినిధిని సంప్రతించగా ‘‘జులై 1కన్నా ముందు ఎలాంటి నిబంధనా వర్తించదనే అనుకుంటున్నాం. మేం ఎవరు నోట్లు తెచ్చినా మార్చడానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ బ్యాంకు ఉన్నతాధికారిని సంప్రదించగా‘‘మాకు ఆర్బీఐ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలూ రాలేదు. రేపటి నుంచి మా కస్టమర్లు వచ్చి నోట్లిస్తేనే మారుస్తాం. తదుపరి మార్గదర్శకాలు వస్తే ఇతరులిచ్చే నోట్ల గురించి కూడా ఆలోచిస్తాం’’ అని చెప్పారు.
ఈ ప్రభావం దేనిపై ఉండొచ్చు?
పాత కరెన్సీ నోట్లు వెనక్కిచ్చి కొత్త కరెన్సీ నోట్లతో మార్పిడి చేసుకోలేని వాళ్లు.. దాన్ని బంగారంలో పెట్టుబడిగా పెట్టొచ్చు. దాంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధర పెరగవచ్చు.
భూములు, స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో 2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను అంగీకరించే అవకాశం ఉండదు. అందుకని ఆ ప్రభావం రియల్టీ మార్కెట్పై ఉండొచ్చు.
ఇప్పటివరకూ లాకర్లలో దాచేసిన కరెన్సీ నోట్లను వెలికితీసి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కనుక మార్కెట్లో కొనుగోళ్లు పెరగవచ్చు.
మార్పిడి చేసుకోలేని సొమ్మును విదేశీ కరెన్సీలోకి మార్చుకునేందుకు హవాలా రాకెట్లను ఆశ్రయించే అవకాశముంది.