ఐటీ రిటర్న్స్ లో కచ్చితంగా అవి చెప్పాల్సిందే!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు చేసిన అనంతరం అకౌంట్లో 2 లక్షలు లేదా అంతకుమించి డిపాజిట్ చేస్తే కచ్చితంగా మీపై ఐటీ డేగకన్ను పడినట్టేనని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత తొలి 50 రోజుల్లో 2 లక్షల లేదా అంతకమించి డిపాజిట్ చేసిన వివరాలను 2017-18కి సంబంధించిన కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో తప్పనిసరిగా నమోదుచేయాలని ప్రభుత్వం శుక్రవారం పేర్కొంది. ఒక్క పేజీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్ ను ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టింది. దీనిలో నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31కి మధ్యలో రూ.2 లక్షలకు మించి నగదు డిపాజిట్ వివరాలను నమోదుచేయడానికి ప్రత్యేక పేజీని కూడా కేటాయించింది. నల్లధనం వెలికితీతకు, అవినీతిని రూపుమాపడానికి నవంబర్ 8న హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వాటిని బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు గడువిచ్చిన సంగతి తెలిసిందే.
వ్యాపారాలు కాకుండా మిగతా వనరులతో రూ.50 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఆర్జించే వ్యక్తుల కోసం వన్-పేజీ ఇన్కమ్ రిటర్న్ ఫామ్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ అవకాశంతో రెండు కోట్ల మంది ప్రజలు లబ్దిపొందనున్నట్టు కేంద్రప్రత్యక్ష పన్ను బోర్డు(సీబీటీడీ) చైర్మన్ సుశిల్ చంద్రా చెప్పారు. ప్రస్తుతం 29 కోట్ల మంది పన్నుచెల్లించేవారిలో ఆరు కోట్ల మందే పాన్ కార్డు కలిగి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తీసుకొచ్చిన ప్రక్రియతో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తేలికగా నమోదుచేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది రిటర్న్స్ ఫైల్ చేసే వారందరికీ ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటున్నట్టు తెలిపారు.