సనప ఉత్సవాల్లో అపశ్రుతి
కోనేటిలోకి జారిపడి చిన్నారి మృతి
ఆత్మకూరు (రాప్తాడు) : ఆత్మకూరు మండలం సనప గ్రామంలో శుక్రవారం జరిగిన మాధవరాజుల ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కోనేటిలోకి జారిపడి మృత్యువాతపడ్డాడు. ఎస్ఐ ధరణి కిషోర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా... ధర్మవరంలోని రైతు నారాయణస్వామి, చెన్నమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు గణేష్ (10)ఉన్నారు. సనప మాధవరాజుల ఉత్సవాలకు శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి నారాయణస్వామి వచ్చారు.
సాయంత్రం మూడు గంటలకు గణేష్ ఒంటరిగా కోనేరు వద్దకు చేరుకుని అక్కడ నీటిలో ఆడుకుంటున్న పిల్లలను గమనిస్తూ మెట్లపై నుంచి అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. దీన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. చాలా సేపటి తర్వాత తమతో పాటు గణేష్ లేడనే విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడి కోసం వెదకడం మొదలుపెట్టారు. కోనేరు వద్ద చేరుకుని అనుమానంతో నీటిలో వెదకగా బాలుడి మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలాన్ని ఎస్ఐ పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.