కొత్త బాటలో క్రేజీ నటి !
నటి అనుష్క బాటలో శ్రుతీహాసన్ పయనిస్తున్నారా? ఆమె సినీ పయనం చూస్తుంటే అలా అనిపించక మానదు. అనుష్క ఆదిలో కోలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అందాలారబోతలో దుమ్మురేపారు. సుందర్.సీ దర్శకత్వంలో అనుష్క నటించిన ఈత దుస్తుల దృశ్యాలు ఇప్పటికీ గూగుల్లో సందడి చేస్తూనే ఉంటాయి. అంతగా అందాల మోత మోగించిన అనుష్క ఆ తరువాత చారిత్రిక కథా చిత్రాల్లో నటిస్తూ వీరనారిగా రణభూమిలో కదం తొక్కారు. అందుకు కత్తిసాము, గుర్రపుస్వారీ లాంటి చాలా కసరత్తులు చేశారు.
అదే విధంగా కథా పాత్ర డిమాండ్ మేరకు సుమారు 80 కిలోల వరకూ బరువు పెరిగి ఇంజి ఇడుప్పళగి చిత్రంలో నటించారు. ఇక బాహుబలి-2లో కత్తి చేత పట్టి సాహస విన్యాసాలు చేశారు. క్రేజీ నటి శ్రుతీహాసన్ కూడా తొలి చిత్రం లక్ (హింది)లోనే గ్లామర్ విషయంలో ఎల్లలు దాటారు. అలాంటి నటి ఇప్పుడు గ్లామర్ ఇమేజ్ను బ్రేక్ చేయడానికి సిద్ధం అయ్యారనిపిస్తోంది. అనుష్కతో ఈత దుస్తులు ధరింపజేసిన అదే సుందర్.సీ ఇప్పుడు శ్రుతీహాసన్ చేత కత్తి పట్టిస్తున్నారు. ఆయన తాజాగా బాహుబలి చిత్రం తరహాలో సంఘమిత్ర పేరుతో చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం అందులో శ్రుతీహాసన్ యువరాణిగా నటించనున్న విషయం తెలిసిందే.
జయంరవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం శ్రుతీహాసన్ లండన్లో కత్తి యుద్ధంలో శిక్షణ పొందారు. అదే విధంగా తను నటిస్తున్న తాజా హిందీ చిత్రం బెహన్ హోగి తేరి కోసం నటి అనుష్క అంత కాకపోయినా పాత్ర డిమాండ్ మేరకు బరువు పెరిగి నటిస్తున్నారట. ఇందులో తీయని పదార్థం కంట పడితే చాలు లొట్టలేసుకుంటూ తినేసే యువతిగా నటిస్తున్నారట. సినిమా ఆధునిక పుంతలు తొక్కుతున్న తరుణంలో ఇది చాలదు. అంతకు మించి అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వారిని సంతృప్తి పరచడానికి కథానాయకుడైనా, నాయకి అయినా కొత్తదనం కోసం తమ వంతుగా శ్రమించాల్సిందే.