breaking news
satish dhavan space centre
-
మిషన్ హీలియం–3
సూళ్లూరుపేట: అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే ప్రత్యేకతను చాటుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో బృహత్తర మిషన్కు సిద్ధమైంది. చంద్రుడిపై అన్వేషణకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే ఇప్పటి వరకు చేసిన పరిశోధనలన్నీ చంద్రుడి మధ్యరేఖపై మాత్రమే జరిగాయి. చంద్రగోళంలోని దక్షిణ భాగంలోకి ఇంత వరకూ ఏ దేశం వెళ్లిన దాఖలా లేదు. జాబిల్లి దక్షిణ భాగంలో లక్షలాది కోట్ల విలువైన హీలియం–3 అనే ఇంధన వనరుపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో చేపట్టబోయే చంద్రయాన్–2 ప్రయోగాన్ని వినియోగించుకోవాలని ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఇస్రో చంద్రుడి దక్షిణ భాగంలో ఒక రోవర్ను దించనుంది. ఈ రోవర్ చంద్రుడి ఉపరితలంపై నమూనాలను సేకరించి హీలియం–3, నీటి జాడను అన్వేషిస్తుంది. భూమిపై పరిమితంగా లభ్యమయ్యే హీలియం–3 ఐసోటోప్ చంద్రుడిపై పుష్కలంగా ఉందని ఇటీవల పలు పరిశోధనల్లో వెల్లడైంది. చంద్రయాన్–1 ద్వారా చంద్రుడిపై నీటి పరమాణువులున్న విషయాన్ని కనుగొన్న ఇస్రో..ఇప్పుడు చంద్రయాన్–2తో మరో అద్భుత విజయాన్ని అందుకోవాలనే ఆలోచనలో ఉంది. మూడు ప్రయోగాలతో సమానం.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్–2 ప్రయోగం చేపట్టాలని ఇస్రో ఇప్పటికే లక్ష్యంగా నిర్దేశించుకుంది. జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్10) ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మూడు పరికరాలను ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందించడం విశేషం. ఆర్బిటర్ను చంద్రుడి మధ్య కక్ష్యలో, ల్యాండర్, రోవర్ను దక్షిణ ధ్రువానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో దించుతారు. ఆరు చక్రాలతో దీర్ఘ చతురస్రాకారంలో ఉండే రోవర్ హీలియం–3పై ప్రయోగాలు చేసి, ఆ సమాచారాన్ని అక్కడికక్కడే విశ్లేషిస్తుంది. కనీసం 14 రోజుల పాటు 400 మీటర్లు వ్యాసార్థం పరిధిలో పరిభ్రమిస్తూ సమాచారాన్ని సేకరిస్తుంది. రోవర్ నుంచి సమాచారం ఆర్బిటర్ ద్వారా మాస్టర్ కంట్రోల్ సెంటర్(భూకేంద్రం)కు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్క మిషన్ మూడు ప్రయోగాలకు సమానమని ఇస్రో పరిశోధకులు చెబుతున్నారు. -
వచ్చే నెలలో 3 అంతరిక్ష ప్రయోగాలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి మే నెలలో మూడు ప్రయోగాలు నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా షార్లోని మొదటి ప్రయోగవేదికపై పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ అనుసంధానం పనులను శరవేగంగా శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా కార్టోశాట్ సిరీస్ ఉపగ్రహంతో పాటు మరికొన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. ఇప్పటికే నాలుగైదు దేశాలకు చెందిన ఉపగ్రహాలు షార్కు చేరుకున్నాయి. ఈ ప్రయోగాన్ని మే 25న నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నారు. రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో జీఎస్ఎల్వీ ఎఫ్–09 అనుసంధానం పనులు కూడా త్వరితగతిన చేస్తున్నారు. ఈ ప్రయోగంలో అత్యంత కీలకంగా భావిస్తున్న క్రయోజనిక్ ఇంజిన్(సీ–25) తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్ సెంటర్ (ఎల్పీఎస్సీ) నుంచి ఇప్పటికే షార్కు చేరుకుంది. ఈ ప్రయోగంలో సుమారు రెండు టన్నులు బరువు కలిగిన జీశాట్–9 అనే సమాచార ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని మే 5న నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు. మే 30న జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాన్ని కూడా చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. శుక్రవారం షార్కు విచ్చేసిన ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ ఈ విషయమై శాస్త్రవేత్తలతో చర్చించినట్లు తెలుస్తోంది.