Satyendra Nath Bose
-
Satyendra Nath Bose : దైవకణాల పరిశోధకుడు
ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్తల్లో పద్మవిభూషణ్ సత్యేంద్రనాథ్ బోస్ ఒకరు. కలకత్తాలో 1894 జనవరి 1న జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. విశ్వ సృష్టికి సంబంధించిన దైవ కణాల పరిశోధన వెనక సత్యేంద్ర నాథ్ బోస్ కృషి చాలా ఉంది. ప్రాథమిక కణాల (దైవకణాల)పై ఐన్స్టీన్తో కలిసి సమర్పించిన అధ్యయన ఫలితాలను ప్రస్తుతం ‘బోస్–ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్’గా పరిగణిస్తున్నారు.బోస్ సంప్రదాయ భౌతికశాస్త్రం గురించి ప్రస్తావించకుండా, ఒకేలా ఉండే కణాలతో గణన స్థితుల అద్భుతమైన మార్గం ద్వారా ప్లాంక్ యొక్క క్వాంటం వికిరణాల నియమాన్ని ఉత్పాదించి ఒక పరిశోధనా పత్రాన్ని రాశారు. దానిని నేరుగా జర్మనీలోని ఆల్బర్ట్ ఐన్స్టీన్కు పంపారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆ పరిశోధనా పత్రం ప్రాముఖ్యాన్ని గుర్తించి, దానిని జర్మన్ భాషలోకి అనువదించారు. దానిని బోస్ తరపున ప్రతిష్ఠాత్మక ‘జీట్స్క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్’కు సమర్పించారు. ఈ గుర్తింపు ఫలితంగా, బోస్ యూరోపియన్ ఎక్స్–రే, క్రిస్టల్లాగ్రఫీ ప్రయోగశాలల్లో రెండు సంవత్సరాలు పని చేయగలిగారు. ఈ సమయంలో అతను లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ, ఐన్స్టీన్లతో కలిసి పనిచేశారు. వీరు ప్రతిపాదించిన కణాల ఆధారంగానే తర్వాతి కాలంలో దైవకణానికి సంబంధించిన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవల జ్ఞాపకార్థం, కణ భౌతిక శాస్త్రంలో ప్రాథమిక ఉప పరమాణు కణాలలోని ఒక కణానికి ‘బోసాన్స్’ అని ఆయన పేరు పెట్టి అరుదైన గౌరవాన్ని అందించారు.బోస్–ఐన్స్టీన్ కండెన్సేట్ (బీఈసీ) అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సంభవించే పదార్థ స్థితి. ఆయన పరిశోధనలు అనేక ఆవిష్కరణలకు దారితీశాయి. మెరుగైన కచ్చితత్వం, స్థిరత్వంతో అత్యంతపొందికైన లేజర్లను సృష్టించడానికి బీఈసీలను ఉపయోగించవచ్చు. సూపర్ కండక్టివిటీని అధ్యయనం చేయడంలో సహాయపడతాయి. క్వాంటం కంప్యూటర్ల ప్రాథమిక యూనిట్లు అయిన క్వాంటం బిట్లనుసృష్టించడానికి ఉపయోగించవచ్చు. గురుత్వాకర్షణ, భ్రమణం,ఇతర భౌతిక పరిమాణాలను కొలవడానికి అత్యంత సున్నితమైన సెన్సార్లను సృష్టించడానికి ఉపయోగించవచ్చు.అపూర్వమైన కచ్చితత్వంతో అణు గడియారాలను సృష్టించడానికి ఉపయోగించవచ్చు. ఇది జీపీ, ఇతర నావిగేషన్ వ్యవస్థలను మెరుగుపరు స్తుంది. డీఎన్ఏ వంటి జీవసంబంధమైన అణువుల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం లక్ష్యంగా ఉన్నమందులు, చికిత్సల అభివృద్ధికి దారితీశాయి. ఆయన రూపొందించిన బోస్– ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ , బోస్– ఐన్స్టీన్ కండన్సేట్ విషయాలపై పరిశోధనలు చేసినవారికి ఏడు నోబెల్ బహుమతులు రావడం విశేషం.– మడక మధు ఉపాధ్యాయుడు, మహాదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా(నేడు సత్యేంద్రనాథ్ బోస్ వర్ధంతి)ఇదీ చదవండి: World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే! -
డియర్ ఐన్స్టీన్ సార్.. నేనెవరో మీకు తెలీదు
అల్బర్ట్ ఐన్స్టీన్.. ఓ ప్రపంచం మేధావి. అలాంటిది అపరిచితుడిగా పరిచయం చేసుకుంటూనే ఆయన నుంచి ‘శెభాష్’ అనిపించుకున్నాడు భారత్కు చెందిన యువ శాస్త్రవేత్త. ఆయనే సత్యేంద్ర నాథ్ బోస్. భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో వీళ్లిద్దరి కృషికి బోస్-ఐన్స్టీన్ గణాంకాలుగా గుర్తింపు దక్కించుకుంది. ఆ గుర్తింపు దక్కి నేటికి 98 ఏళ్లు అవుతుంది. 1924, జూన్ 4వ తేదీన జర్మనీ భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్.. భారత్కు చెందిన సత్యేంద్రనాథ్ బోస్ కృషిని గుర్తించారు. క్వాంటమ్ మెకానిక్స్లో బోస్ కనిపెట్టిన థియరీతో ఏకీభవించారు ఐన్స్టీన్. అంతేకాదు స్వయంగా ఆయనే జర్మన్లోకి అనువదించి మరీ.. బోస్ పేరిట వ్యాసం ప్రచురించారు. భౌతిక శాస్త్రంలో అరుదైన ఈ ఘట్టానికి 98 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. గూగుల్ సత్యేంద్రనాథ్ బోస్ గౌరవార్థం డూడుల్ను రిలీజ్ చేసింది. ‘‘డియర్ సర్, మీ పరిశీలన, అభిప్రాయం కోసం నేను మీకు ఈ కథనాన్ని పంపించాను. క్లాసికల్ ఎలెక్ట్రోడైనమిక్స్ నుండి స్వతంత్రంగా ప్లాంక్ నియమం లోని గుణకం 8π ν2/c3ను తగ్గించడానికి నేను ప్రయత్నించాను. దశ-అంతరాళంలో అంతిమ ప్రాథమిక ప్రాంతంలో కంటెంట్ h3 ఉందని మాత్రమే ఊహిస్తారు. ఈ పరిశోధనా పత్రాన్ని అనువదించడానికి నాకు తగినంత జర్మన్ భాష తెలియదు. ఈ పత్రం ప్రచురణ విలువైనదని మీరు అనుకుంటే, మీరు దాని ప్రచురణను "జైట్స్క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్" లో వచ్చేటట్లు చేస్తే నేను కృతజ్ఞుడను. నేను ఎవరో మీకు తెలియదు. అలాంటి అభ్యర్థన చేయడంలో నాకు ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే మీ రచనల ద్వారా మీ బోధనల ద్వారా లాభం పొందిన మేమంతా మీ విద్యార్థులం. సాపేక్షతపై మీ పత్రాలను ఆంగ్లంలో అనువదించడానికి కలకత్తాకు చెందిన ఎవరైనా మీ అనుమతి కోరినట్లు మీకు ఇంకా గుర్తుందో,లేదో నాకు తెలియదు. మీరు ఆ అభ్యర్థనను అంగీకరించారు. అప్పటి నుండి ఆ పుస్తకం ప్రచురించబడింది. సాధారణీకరించిన సాపేక్షతపై మీ పరిశోధనా పత్రాలను నేనే అనువదించాను. మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి నేను ఆత్రుతగా ఉన్నాను’’ అంటూ లేఖ పంపారు సత్యేంద్రనాథ్ బోస్. ► ఇండియన్ ఫిజిక్స్ త్రిమూర్తులుగా.. సర్ సీవీరామన్, మేఘనాథ్ సాహా, సత్యేంధ్రనాథ్ బోస్లకు పేరుంది. ► ఫిజిక్స్ కణ భౌతికశాస్త్రంలో వినిపించే హిల్స్ బోసన్(దైవకణాలు) అనే పదంలో.. బోసాన్ అంటే ఏంటో కాదు.. బోస్ పేరు మీదే బ్రిటిష్ సైంటిస్ట్ పాల్ డిరాక్ అలా నామకరణం చేశారు. ► బోస్-ఐన్స్టీన్ స్టాటిక్స్కుగానూ.. 1956లో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఫిజిక్స్పై ఆయన పరిశోధలను, రచనలను నోబెల్ కమిటీ పట్టించుకోలేదు. ► కానీ, బోస్ ప్రతిపాదించిన బోసన్, బోస్-ఐన్స్టీన్ థియరీల ఆధారంగా చేపట్టిన పరిశోధనలకు ఏడు నోబెల్ బహుమతులు వచ్చాయంటే ఆయన కృషి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ► 1954లో భారత ప్రభుత్వం సత్యేంద్రనాథ్ బోస్ను పద్మవిభూషణ్తో సత్కరించింది. ► పలు యూనివర్సిటీలలో బోధకుడిగా, పరిశోధనా కమిటిలలోనూ ఆయన పని చేశారు. ► సత్యేంద్రనాథ్బోస్.. పశ్చిమ బెంగాల్ కోల్కతా(కలకత్తా)లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ► ప్రఫుల్ల చంద్రరాయ్, జగదీశ్చంద్రబోస్లు ఈయనకు గురువులు. ► లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ , ఐన్స్టీన్లతో కలిసి పని చేసే అవకాశం దక్కింది ఈయనకు. ► అనువర్తిత గణితశాస్త్రంలో ఎమ్మెస్సీ కలకత్తా యూనివర్సిటీ నుంచి పూర్తి చేశాడాయన. ► 1974 ఫిబ్రవరి 4వ తేదీన 80 ఏళ్ల వయసులో కలకత్తాలోనే ఆయన కన్నుమూశారు. ► కేవలం ఫిజిక్స్ మాత్రమేకాదు.. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆర్ట్స్లోనూ ఆయన ఎంతో కృషి చేశారు. ► నోబెల్ దక్కకపోతేనేం.. ఈ మేధావి మేధస్సును గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కొనియాడారు. మాతృదేశం గుర్తించింది. నేడు భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు.. తమ పరిశోధనలతో ఆయన కృషిని నిరంతరం గుర్తు చేస్తూ ఉన్నారు. -
బోస్-ఐన్స్టీన్లు ఊహించినట్టుగానే అంతరిక్షంలో..
పారిస్ : శతాబ్ధం కిందట భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్ర నాథ్ బోస్, జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్లు ఊహించిందే నిజమైంది. సాధారణంగా అణువులు సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా స్థితుల్లో ఉంటాయి. అయితే వీటితోపాటూ ఐదో స్థితి కూడా ఉంటుందని బోస్-ఐన్స్టీన్లు ముందుగానే ఊహించారు. ఈ స్థితినే బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్గా పిలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంతరిక్షంలో నాసా శాస్త్రవేత్తలు తొలిసారిగా ఐదవ స్థితి(బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్)ని గమనించారు. దీంతో విశ్వానికి సంబంధించి అనేక చిక్కుముడులకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఒక నిర్దిష్ట మూలకం అణువులను సంపూర్ణ సున్నా ఉష్ణోగ్రతకు(0 కెల్విన్, -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్లు) చల్లార్చినప్పుడు ఒక పదార్ధం బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ల స్థితికి చేరుకుంటుందని వీరు అంచనా వేశారు. అటువంటి స్థితిలో, ఒక మూలకంలోని అణువులు క్వాంటం లక్షణాలను కలిగి ఉన్న ఒకే స్థితిలోకి మారుతాయి. ఈ సమయంలో అణువులు క్వాంటం లక్షణాలతో, ఒకే తరందైర్ఘ్యంతో ఒకే ఎన్టిటీగా మారిపోతాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా శాస్త్రవేత్తలు బీఈసీలపై జరుగుతున్న పరీక్షల ఫలితాలను గురువారం వెల్లడించారు. కాగా, క్వాంటం సిద్దాతంత పరిణామ క్రమంలో ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఐన్స్టీన్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక సత్యేంద్రనాథ్ బోస్ 1920 లో క్వాంటం మెకానిక్స్లో బోస్-ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ సిద్ధాంతానికి ఎనలేని కృషి చేశారు. ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ను 1954లో ప్రదానం చేసింది. -
దైవకణం జోలికెళితే వినాశనమే!
విశ్వంలో అన్ని రకాల పదార్థాలకూ ద్రవ్యరాశి, ఆకారం, పరిమాణాలు సమకూరేందుకు కారణమని భావిస్తున్న దైవకణం(హిగ్స్ బోసాన్) జోలికి వెళితే విశ్వ వినాశనం తప్పదట. అత్యధిక శక్తి స్థాయిల వద్ద దైవకణం స్థిరత్వాన్ని కోల్పోతుందట. అదే గనక జరిగితే విశ్వం, కాలం అకస్మాత్తుగా ధ్వంసం అయిపోతాయని బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు, ఖగోళ పరిశోధకుల ప్రసంగాల సంకలనంతో ప్రచురించిన ‘స్టార్మస్’ అనే పుస్తకం ముందుమాటలో హాకింగ్ ఈ మేరకు పలు విషయాలు వివరించారు. వంద బిలియన్ గిగా-ఎలక్ట్రాన్ వోల్టులకు మించిన శక్తి వద్ద దైవకణం అస్థిరంగా మారుతుందని, ఫలితంగా గాలిబుడగలా నిరంతరం కాంతివేగంతో విస్తరిస్తున్న విశ్వంలో శూన్యం లోపించి ఆ బుడగ ధ్వంసం అవుతుందని హాకింగ్ పేర్కొన్నారు. కాగా, స్విట్జర్లాండ్ సరిహద్దులో భూగర్భంలో భారీ గొట్టాలతో నిర్మించిన లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్(ఎల్హెచ్సీ) ప్రయోగంలో ప్రొటాన్లను కాంతివేగంతో ఢీకొట్టించిన సెర్న్ శాస్త్రవేత్తల బృందం 2012లో దైవకణం ఉనికిని కనుగొంది. దైవకణ ంపై పరిశోధనల్లో విశేష కృషి చేసిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ స్మారకార్థం దీనికి బోసాన్గా నామకరణం చేశారు.