Advertisement
Seat cancellation
-
సీటు రద్దు చేసుకుంటే ఫీజు వాపస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులు సీటు రద్దు చేసుకున్నప్పుడు అప్పటికే చెల్లించిన వార్షిక ట్యూషన్ ఫీజును తిరిగి ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000 మాత్రం సంబంధిత సంస్థలు తీసుకోవచ్చని తెలిపింది. సీటు రద్దు చేసుకునే సమయాన్ని బట్టి ట్యూషన్ ఫీజు చెల్లింపు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఫీజు రిఫండ్ పాలసీని యూజీసీ విడుదల చేసింది. అన్ని కౌన్సెలింగ్లు ముగిసి, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తేదీని కటాఫ్గా నిర్థారించింది. చెల్లింపు ప్రక్రియను ఐదు కేటగిరీలుగా విభజించింది. ఈ పాలసీని ఈ ఏడాది నుంచే ముందుకు తీసుకెళ్ళాలని అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన మేరకు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక్కో కాలేజీలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని కాలేజీల్లో ఇది లక్షల్లో ఉంది. ప్రైవేటు కాలేజీల వేధింపుల నేపథ్యంలోనే... సీటు వచ్చిన తర్వాత విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో రూ.1,000 చెల్లిస్తారు. సీటు ఖరారైనప్పుడు కాలేజీకి మొత్తం ట్యూషన్ ఫీజు చెల్లించడంతో పాటు సర్టిఫికెట్లు ఇస్తారు. అయితే కొన్నిసార్లు విద్యార్థులకు ఇతర అవకాశాలు వస్తాయి. అప్పుడు అప్పటికే చేరిన కాలేజీలో సీటు వదిలేస్తారు. ఇలాంటి సందర్భాల్లో కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా, చెల్లించిన ఫీజు రీఫండ్ చేయకుండా వేధిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. వీటిపై యూజీసి గత నెల 27న నిర్వహించిన సమావేశంలో చర్చించింది. ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇది కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకే పరిమితమవుతుందా? ఏ సంవత్సరంలో సీటు వదులుకున్నా వర్తిస్తుందా? అనే దానిపై యూజీసి స్పష్టత ఇవ్వలేదు. అడ్మిషన్ల ప్రక్రియ చివరి తేదీని కటాఫ్గా నిర్ణయించడం వల్ల కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకే ఇది పరిమితమని ప్రైవేటు కాలేజీలు అంటున్నాయి. ఐదు కేటగిరీలుగా.. ఈ సంవత్సరం అన్ని రాష్ట్రాల్లోనూ అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని యూజీసీ సూచిస్తోంది. ఈ తేదీకి ముందు, ఆ తర్వాత సీటు రద్దు చేసుకునే విద్యార్థులను వివిధ కేటగిరీలుగా విభజించారు. – అక్టోబర్ 31కి 15 రోజలు కంటే ముందే సీటు రద్దు చేసుకుంటే 100 శాతం ట్యూషన్ ఫీజును తిరిగి చెల్లించాలి. – ప్రవేశాల నోటిఫికేషన్ ఇచ్చిన తేదీకి ముందు 15 రోజుల్లో సీటు రద్దు చేసుకుంటే 90 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలి. – అడ్మిషన్ల ముగింపు తేదీ తర్వాత 15 రోజుల్లో ఎప్పుడు సీటు రద్దు చేసుకున్నా 80 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలి. – అడ్మిషన్ తేదీ ముగిసిన 15 నుంచి నెల రోజుల్లో సీటు వద్దనుకునే విద్యార్థులకు 50 శాతం ఫీజు వాపసు ఇవ్వాలి. ఆ తర్వాత సీటు వద్దనుకునే వారికి చెల్లించిన ఫీజు ఏమాత్రం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. స్పష్టత కొరవడిన యూజీసీ ఆదేశాలు ఫీజు వాపసు ఇచ్చేందుకు యూజీసీ ఇచ్చిన ఆదేశాలు మరింత స్పష్టంగా ఉంటే బాగుండేది. మార్గదర్శకాలు మొదటి సంవత్సరం విద్యార్థులకే సంబంధించినవిగా కన్పిస్తున్నాయి. అలా కాకుండా కోర్సు పూర్తయ్యే వరకూ వర్తిస్తుందనే విషయాన్ని స్పష్టం చేసి ఉంటే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – డాక్టర్ వి.బాలకృష్ణారెడ్డి (రాష్ట్ర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు) -
42,000 ఇంజనీరింగ్ సీట్లు రద్దు!
సాక్షి, హైదరాబాద్: నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కాలేజీలే ముందుకు వచ్చి సీట్ల రద్దుకు దరఖాస్తు చేస్తున్నాయి. ఈ నెల 13 నాటికి 213 ఇంజనీరింగ్ కాలేజీలు 42 వేల సీట్ల రద్దుకు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 13 కాలేజీలు పూర్తిగా మూసివేసేందుకు అర్జీ పెట్టుకున్నాయి. యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్న వెంటనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఆమోదం తెలిపింది. సీట్ల రద్దుకు అవసరమైన నిరభ్యంతర పత్రాల (ఎన్వోసీ) జారీని మంగళవారం ప్రారంభించింది. వరుస చర్యలతో కొరడా..: నిర్ణీత నిబంధనలు అమలు చేయని, నాణ్యత ప్రమాణలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై ఇటీవలి కాలంలో జేఎన్టీయూహెచ్ కొరడా ఝుళిపిం చింది. దీంతో యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. గత విద్యా సంవత్సరం (2014-15) ప్రవేశాల సందర్భంగా నిబంధనలు పాటించని, లోపాలు ఉన్న 163 కాలేజీలకు అనుబంధ గుర్తింపును (అఫిలియేషన్) జేఎన్టీయూహెచ్ నిరాకరించింది. దీనిపై యాజమాన్యాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. చివరకు షరతులతో అఫిలియేషన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే ప్రవేశాలు పూర్తి కావడంతో వాటిల్లో పెద్దగా విద్యార్థులు చేరలేదు. పైగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయా కాలేజీల్లో జాతీయ విద్యా సంస్థలకు చెందిన నిఫుణులతో జేఎన్టీయూహెచ్ తనిఖీలు చేపట్టింది. అందులోనూ లోపాలు ఉన్నట్లు తేలింది. దీంతో 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 143 కాలేజీల్లో 807 బ్రాంచీలకు అనుబంధ గుర్తింపును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త విద్యా సంవత్సరం వచ్చేసింది. 2015-16 విద్యా సంవత్సరంలో కాలేజీలు మళ్లీ తమ అనుబంధ గుర్తింపును జేఎన్టీయూహెచ్లో రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అయితే గతానుభవాల దృష్ట్యా గతంలో అనుమతులు పొందిన అన్ని సీట్లలో అడ్మిషన్లకు ఈసారి ప్రవేశాలు చేపట్టట్లేదు. 213 కాలేజీల్లోని 42 వేల సీట్లను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేశాయి. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఎన్ని సీట్లకు అనుమతి పొందుతారో అన్ని సీట్లకు అవసరమైన ఫ్యాకల్టీని, వసతులను యాజమాన్యాలు ఏర్పాటు చేయాల్సిందే. అయితే ప్రస్తుతం ఎక్కువ కాలేజీల్లో సగం సీట్లు కూడా భర్తీ కావట్లేదు కానీ మొత్తం సీట్లకు అవసరమైన ఫ్యాకల్టీ నియమించాల్సి ఉండటం, వసతులను కల్పించాల్సి ఉండటంతో ఆ సీట్ల రద్దు కోసమే దరఖాస్తు చేశాయి. వాటి రద్దుకు ఆమోదం తెలుపుతూ జేఎన్టీయూహెచ్ ఎన్వోసీలను ఇస్తోంది. మళ్లీ తనిఖీలు! 2015-16 విద్యా సంవత్సరంలో కాలేజీల కు అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో జేఎన్టీయూహెచ్ మళ్లీ తనిఖీలు చేయనుంది. లోపాలు, నిర్ణీత నిబంధనలు పాటించని కాలేజీల్లో బ్రాంచీల కు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం లేదు. దీంతో మరిన్ని సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు తేలిన లోపాలను బట్టి చూస్తే గత ఏడాది అనుబంధ గుర్తింపును నిరాకరించిన 143 కాలేజీల్లో సగం వరకు కాలేజీలకు 2015-16 ప్రవేశాల కోసం అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి కనిపించట్లేదని చెబుతున్నారు. ఆయా కాలేజీలన్నీ ఫ్యాకల్టీని పక్కాగా నియమించి, సదుపాయాలు కల్పిస్తేనే గుర్తింపు వస్తుందంటున్నారు.