ఎరుపెక్కిన ఏవోబీ
విజయవంతంగా సంస్మరణ వారోత్సవాలు
భారీ ర్యాలీ, అమరులకు విప్లవ వందనాలు
బాక్సైట్ కోసం వేసే రోడ్డును అడ్డుకుంటాం
మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ కార్యదర్శి మంగ్లన్న
పెదబయలు : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ఆదివారం మావోయిస్టుల ఎర్రజెండాలు, బ్యానర్లతో ఎరుపెక్కింది. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను దళసభ్యులు విజయవంతంగా నిర్వహించారు. సరిహద్దుల్లోని మారుమూల అటవీ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ బహిరంగ సభలో విప్లవ గీతాలను ఆలపించారు. మన్యంలో బాక్సైట్, కాఫీ, సాయుధ పోరాటంలో జీవితాలు త్యాగం చేసిన కామ్రెడ్ నరేందర్, మహేందర్,శరత్, లాలు, బీగాల్, సొన్నుల పేరులో భారీ స్థూపం నిర్మించి, శ్రద్ధాంజలి ఘటించి విప్లవాభి వందనాలు తెలిపారు. కామ్రేడ్ చలసాని ప్రసాద్కు విప్లవ జోహార్లు అర్పించారు. సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ మంగ్లన్న పేరిట ఈమేరకు ఆదివారం ఓ ప్రకటన వెలువడింది. సభలో మంగ్లన్న మాట్లాడుతూ మన్యంలోని విలువైన బాక్సైట్ను దోచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర పన్నుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే మారుమూల గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తున్నారని, దీనిని అడ్డుకుంటామని ప్రకటించారు. మన్యంలో పోలీసు ఔట్పోస్టులు, రహదారులు, సెల్టవర్లు నిర్మాణంపై ఎక్కువ శ్రద్ధకనబరుస్తున్నారని, ఇతర మౌలిక సదుపాయాలను పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో జనమైత్రిలు నిర్వహించి చిల్లర సామగ్రి అందించి పోలీసులు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.
మన్యంలో అక్రమ అరెస్టులు నిలిపివేయాలని, సాయుధ విప్లవాన్ని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ప్రభుత్వ కుట్రను ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులంటూ పోలీసులు ప్రచారం చేసి అధికారులు మారుమూల గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారని, ఆదివాసీ విప్లవ రైతుకూలీ సంఘం, మహిళా సంఘం నాయకులు ప్రసంగించారని,స్థూపాల వద్ద లొంగుబాట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని తెలిపారు. పోలీసు బలగాలు దింపినా, శిబిరాలు పెట్టినా, ప్రజల విప్లవ భావాలను, చైతన్యాన్ని అడ్డుకోలేరన్నారు.
స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి:
ఎపిడమిక్ దృష్ట్యా మారుమూల గూడేల్లోని గిరిజనులకు వైద్యం అందించడానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని మంగ్లన్న పిలుపునిచ్చారు. వ్యాధుల కాలం ముంచుకొచ్చినా పీెహ చ్సీల్లో మందులు, వైద్యులు లేరని, మలేరియా,టైఫాయిడ్, ఇతర ప్రాణాంతక వ్యాధులతో గిరిజనం విలవిల్లాడుతున్నారన్నారు. ప్రకటలు తప్ప ప్రభుత్వ ైవె ద్యం కానరావడం లేదన్నారు. మారుమూల గ్రామాల్లోని చదువుకున్నవారికి శిక్షణ ఇచ్చి ప్రజా వైద్యం పేరుతో సేవలు అందిస్తున్నామన్నారు.
ఒనకఢిల్లీ ప్రాంతంలో పోస్టర్లు, బ్యానర్లు
ముంచంగిపుట్టు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని ఒనకఢిల్లీ ప్రాంతంలో ఆదివారం మవోయిస్టుల వాల్ పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. అమరవీరుల స్థూపం వద్ద దళసభ్యులు నివాళులర్పించారు. దాని చుట్టూ బ్యానర్లు కట్టి, పోస్టర్లు అత్తికించారు. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, మల్కన్గిరి జిల్లా జైలులో ఉన్న మావోస్టు ఖైదీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు గిరిజనులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కర్తన్పల్లి నుంచి మన్యకొండ వరకు కొత్తగా నిర్మస్తున్న రోడ్డు పనులు తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. పంద్రాగస్టును బహిష్కరించి బ్లాక్ డేగా పాటించాలన్నారు. కొండరెడ్డిలను ఆదివాసీలుగా గుర్తించాలని బ్యానర్లు, పోస్టర్లలో పేర్కొన్నారు.