-
అదేపనిగా టీవీ చూస్తే..
లండన్ : రోజులో అత్యధిక సమయం టీవీ చూస్తూ గడిపే వారి అకాల మరణానికి గురవడం లేదా క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. శారీరక కదలికలు లేకుండా అధిక సమయం టీవీ ముందు, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు అస్వస్థతకు లోనవడం, జీవన శైలి కారణంగా మృత్యువాతన పడే ముప్పుందని గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. స్క్రీన్ల ఎదుట గంటలకొద్దీ సమయం గడిపే వారు అకాల మరణానికి గురవుతారని, శారీరకంగా చురుకుగా ఉండేవారిలో ఈ ముప్పు తక్కువని తెలిపారు. జీవనశైలి సమస్యలతో బాధపడే వారికి అందించే చికిత్సలో తమ అథ్యయనంలో వెల్లడైన అంశాలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 3,90,000 మంది ప్రజల జీవనశైలిని విశ్లేషించిన పరిశోధకులు వీరిలో అత్యధికంగా టీవీ, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు ఊబకాయం, డయాబెటిస్, హైబీపీలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరిలో పొగతాగడం, అధిక కొవ్వు, ప్రాసెస్డ్ మాంసం తినడం వంటి అలవాట్లు పేరుకుపోయాయని కనుగొన్నారు. శారీరక కదలికలు లేకపోవడంతో వీరిలో క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదం పొంచిఉందని హెచ్చరించారు. శారీరకంగా ఫిట్గా ఉండి, చురుకుగా ఉన్న వారు అంతే సమయం టీవీ స్క్రీన్ల వద్ద గడిపినా ఎలాంటి దుష్ర్పభావాలు కనిపించలేదని అథ్యయనంలో గుర్తించారు. -
ఎక్కువ గంటలు కూర్చునే వారికి పెనుముప్పు
లండన్ : ఎక్కువ సేపు డెస్క్ పనుల్లో కుర్చీలో కూరుకుపోవడం, సోఫోకు అతుక్కుని టీవీ చూడటంలో నిమగ్నమవడం తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. శారీరక కదలికలు తక్కువగా ఉన్నవారి మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసకునే ప్రదేశం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చిచెప్పారు. ఎక్కువ గంటలు కూర్చునే వారికి పెనుముప్పు తప్పదని అథ్యయనాన్ని చేపట్టిన లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు. బద్ధకంగా గడిపే వారికి గుండె జబ్బులు, మధుమేహం, పలు రకాల క్యాన్సర్లు వంటి జీవన శైలి వ్యాదులు ముంచుకొస్తాయని ఇప్పటికే వెల్లడవగా తాజా అథ్యయనం మరికొన్ని వ్యాధులూ చురుకైన జీవన శైలి లేని వారిని చుట్టుముడతాయని పేర్కొంది. వీరి మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకునే ప్రదేశం చిన్నగా ఉండటంతో అల్జీమర్, డిమెన్షియా వంటి వ్యాధులు ప్రబలవచ్చని తెలిపింది. అల్జీమర్ ముప్పు అధికంగా ఉన్న వారిలో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చురుకైన జీవనశైలిని అలవరుచుకోవడం కీలకమని బయోస్టాటిస్టీషియన్ డాక్టర్ ప్రభా సిద్ధార్ధ్ సూచించారు. -
రెండువారాలు అలా గడిపితే..
లండన్ : ఆధునిక సౌకర్యాలు మనిషి జీవితాన్ని సుఖమయం చేసినా అదే సమయంలో లేజీనెస్ పెరగడం మన శరీరాలను ఛిద్రం చేస్తోంది. రోజంతా డెస్క్కు అంకితమవడం, అదేపనిగా డ్రైవింగ్, వారాంతాల్లో సోఫాల్లో అతుక్కుపోవడం ఇలా ఓ రెండు వారాలు గడిచినా అనారోగ్యానికి దారితీస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. నిత్యం బద్ధకంతో గడిపితే కొన్నేళ్లలోనే శరీరం వ్యాధుల కుప్పగా మారుతుందని హెచ్చరించింది. దీర్ఘకాలంలో ఇది టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, స్ర్టోక్ వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. అయితే చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ పరిస్థితిని నివారించవచ్చని చెబుతున్నారు. లిఫ్ట్కు బదులు మెట్లను ఉపయోగించడం, ఆన్లైన్ షాపింగ్కు ప్రత్యామ్నాయంగా సూపర్ మార్కెట్కు వెళ్లడం, రోజుకు అరగంట పాటు నడవడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. శరీరాన్ని చురుకుగా ఉంచకపోతే భవిష్యత్ వ్యాధులకు పునాదులు వేసినట్టేనని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ డేనియల్ కూత్బెర్ట్స్న్ హెచ్చరించారు. ఆధునిక జీవితంతో సమాజం యాంత్రిక జీవనశైలిలో మగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కదలికలు లేని జీవనశైలి ప్రమాదకరమని..ఇది దీర్ఘకాలం కొనసాగితే శరీరం వ్యాధులకు నిలయమవుతుందన్నారు. -
చర్మకాంతి కోసం సహజ పద్ధతులు..
న్యూఢిల్లీః మీ చర్మం కాంతివంతంగా ఉండాలనుకుంటున్నారా? ముఖంలో అందం మరింత ఇనుమడించాలనుకుంటున్నారా? అయితే నిపుణుల సూచనలు పాటించాల్సిందే. శరీరంలో ఆరోగ్యం నశించినప్పుడు.. చర్మంపై ఎంతటి ఖరీదైన క్రీములు పూసినా ప్రయోజనం ఉండదంటున్నారు కాస్మెటిక్ అండ్ ఈస్తటిక్ నిపుణులు. సరైన జీవనశైలికి తోడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సహజసిద్ధమైన మార్గాలను పాటించడంతో ముఖంలో కాంతి పెరుగుతుందని చెప్తున్నారు. కాస్మెటిక్, ఈస్తటిక్ సర్జన్.. సీనియర్ కంన్సల్టెంట్ అనూప్ ధీర్.. చర్మసౌందర్యానికి కొన్ని సులభమైన చిట్కాలను అందించారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, ముఖంలో కాంతి కనిపించాలన్నా కేవలం ఈ చిన్నపాటి జాగ్రత్తలను ఫాలో అయిపోతే చాలంటున్నారు. ఎప్పుడూ బద్ధకంగా కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం వంటివి చర్మం పొడిబారేందుకు, ముడుతలు, చారలు పడేందుకు దోహద పడతాయని, జీవన శైలిని నియమబద్ధంగా ఉంచుకోవడం ఎంతో అవసం అని అనూప్ చెప్తున్నారు. అలాగే రాత్రీ పగలూ తేడా లేకుండా చర్మానికి పూసే క్రీములను, నూనెతో వండిన, జంక్ ఫుడ్ తినడాన్నిమానుకుని.. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు తినడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందొచ్చని చెప్తున్నారు. అలాగే మెరిసే చర్మానికి హైడ్రేషన్ ఎంతో అవసరమని, అందుకు నీటిని కూడా అధిక మొత్తంలో తాగడం అవసరమంటున్నారు. నీరు శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించి, చర్మంలోపల ఉండే టాక్సిన్ ను బయటకు పంపి, పోషకాలను చేర్చేందుకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా చర్మకాంతికోసం వ్యాయామంలో తప్పనిసరిగా కార్డియోను చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియో వర్కవుట్ ముఖానికి చేసే ఫేషియల్ వంటిదని, ఈ వ్యాయామంతో వచ్చే చెమట ద్వారా చర్మంలో చిక్కుకున్న నూనె, ధూళి వంటివి బయటకు వచ్చి, చర్మం కాంతివంతంగా మారుతుందని చెప్తున్నారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో టమోటా, ఆకుకూరలు, స్ట్రాబెర్రీ, చియా విత్తనాలతోపాటు పెరుగును జోడిస్తే మంచి ఫలితాలు పొందొచ్చన్నారు. అలాగే బ్యూటీపార్లర్లకు భారీగా డబ్బును వెచ్చించే బదులు.. ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వేసుకునే ప్రయత్నం చేయమంటున్నారు. ఖరీదైన బ్రాండ్లు, ఫేస్ వాష్ లకు బదులుగా రోజ్ వాటర్ తో ముఖాన్ని కడుక్కుంటే చర్మం మరింత కాంతివంతంగా తయారౌతుందని అనూప్ ధీర్ సూచిస్తున్నారు.