shop owners
-
హిజ్రాల ఆగడాలు అరికట్టండి
వైఎస్ఆర్ జిల్లా, పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పట్టణంలో ఇటీవల కాలంలో హిజ్రాలు వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేయడం, అడిగినంత ఇవ్వకపోతే దాడి చేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు. హిజ్రాల ప్రవర్తనతో విసిగి, భయపడిన కిరాణా, కూరగాయల, టీ బంకుల, తోపుడుబండ్ల, వస్త్ర దుకాణాల, మటన్, చికెన్ దుకాణాల వ్యాపారులు ఆదివారం ఎస్ఐ రెడ్డి సురేష్కు వినతిపత్రం ఇచ్చి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఇటీవల కాలంలో వారానికి రెండు దఫాలు అంగళ్ల వద్దకు హిజ్రాలు డబ్బుల వసూళ్లకు రావడం, అడిగినంత ఇవ్వకపోతే దాడి చేస్తుండటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఫాస్టుఫుడ్ సెంటర్ యజమాని వెంకటరామిరెడ్డి రూ. 50 లు ఇస్తే తీసుకోకుండా రూ. 200 లేదా 100 ఇవ్వాలని దబాయించారు. అంతలేదని చెప్పిన వెంకట్రామిరెడ్డిపై నూనెగోళం ఎత్తివేసి, తినుబండారాలు విసిరివేయడంతో నూనె పడి శరీరం కాలిందని వ్యాపారులు వివరించారు. వారం క్రితం చికెన్షాపు దగ్గర అడిగినంత డబ్బు ఇవ్వలేదని, వేలాడదీసిన చికెన్ విసిరి వేశారని, టెంకాయల వ్యాపారి నాగేశ్వరరావు రూ. 100 ఇవ్వలేదని కాలితో తన్నారని, తోపుడు బండి దగ్గర తక్కెడ తీసుకెళ్లారని, అంబటి అశోక్ దగ్గర నూనె క్యాన్ ఎత్తుకెళ్లారని ఇవన్నీ హిజ్రాల ఆగడాలకు పరాకాష్ట అని వారు ఎస్ఐకి తెలిపారు. ఇదిలా ఉండగా పట్టణ శివారులోని మల్లకతువ స్పీడ్బ్రేకర్ దగ్గర, మైదుకూరు రోడ్డులో రంగసముద్రం క్రాస్రోడ్డు స్పీడ్ బ్రేకర్ దగ్గర, ఆసుపత్రి స్పీడ్ బ్రేకర్ దగ్గర వాహనాలను అటకాయించి డబ్బులు అడుగుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. హిజ్రాల పరిస్ధితి అదుపు తప్పిందని, తక్షణం వారిని పట్టణంలో లేకుండా తరిమి వేయాలని కోరారు. ఎస్ఐకి ఫిర్యాదు చేసిన వారిలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మస్తాన్, పట్టణ కార్యదర్శి మహమ్మద్ రఫి, తోపుడుబండ్ల యూనియన్ కార్యదర్శి సుబ్రమణ్యం, ఆర్యవైశ్య నాయకులు నటరాజ, అంబటి, బంగారు వ్యాపారులు రఫి, మాబు, నారాయణ, బాషా, పూల వ్యాపారులు సయ్యద్, మధు తదితరులు ఉన్నారు. -
అడిగేవారు లేరని..
►బస్టాండ్లో ప్రయాణికుల దోపిడీ ► వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్న షాపుల యజమానులు ►అటకెక్కించిన ఎంఆర్పీ విక్రయ నిబంధన ► చూసీచూడనట్లు వెళ్తున్న ఆర్టీసీ అధికారులు ► రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు ► నిద్రిస్తున్న తూనికలు, కొలత శాఖ అధికారులు కర్నూలు(రాజ్విహార్): జిల్లాలో 12డిపోల్లో 430 షాపులుండగా కర్నూలు బస్స్టేషన్లో 80, ఆరుబయట మరో 130 షాపులున్నాయి. ఐదేళ్లకోసారి తిరిగి టెండర్లు పిలుస్తారు. ఒకసారి టెండరు ఖరారు అయితే మూడేళ్ల వరకు ఒక అద్దె ఉంటుంది. నాలుగో సంవత్సరం 10శాతం పెంచుతారు. చివరి సంవత్సరం నాలుగో ఏడు చెల్లించిన నెలవారి అద్దెపై 15శాతం అదనంగా వసూలు చేస్తారు. జిల్లాలోని షాపుల నుంచి నెలకు రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తోంది. దోపిడీ ఇలా.. బస్టాండ్లలోని షాపుల్లో వస్తువులు, తినుబండరాలను నిబంధనల ప్రకారం ఎంఆర్పీ (మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్)కే అమ్మాలి. షాపులు దక్కించుకున్న యజమానులకు ఇచ్చే అగ్రిమెంట్లలో ఈవిషయాన్ని ప్రస్తావిస్తారు. అయితే, ఈ నిబంధన అమలు కావడం లేదు. రూ.10 ఎంఆర్పీ ఉన్న వస్తువును రూ.15కి అమ్ముతున్నారు. తినుబండరాలు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ సైతం ఇదే తరహాలో విక్రయిస్తున్నారు. రూ.20 ఉన్న నీళ్ల బాటిల్ను రూ.25కి అమ్ముతున్నారని నంద్యాలకు చెందిన ప్రయాణికులు శ్రీకాంత్ వాపోయాడు. దీనిపై ప్రశ్నిస్తే ‘ఇది బస్టాండ్, మాకు బాడుగ ఎక్కువగా ఉంటుంది. ఎలా అమ్ముకోవాలి’ అంటు సమాధానం చెబుతున్నారని తెలిపారు. ప్రదర్శనల వరకే ధరల పట్టిక: షాపుల్లో అమ్మే వస్తువుల పేర్లు, వాటి ఎంఆర్పీ పట్టికను ప్రయాణికులకు కనిపించేలా పెట్టాలి. అందులో చూపిన ధరలనే అమ్మాలి. కానీ ఒకటి రెండు షాపుల వద్ద తప్ప ధరల పట్టిక ఎక్కడా కన్పించదు. పట్టిక ప్రదర్శనకు పెట్టిన వాళ్లు సైతం దీనిని అమలు చేయకపోవడం గమనార్హం. చర్యలు ఇలా.. ఎంఆర్పీ విస్మరిస్తే మూడంచెల తరహాలో చర్యలు తీసుకుంటారు. మొదటి సారి రూ.500, రెండో సారి రూ.1000 జరిమాన విధిస్తారు. మూడో సారి కూడా ఆదే షాపుపై కేసు నమోద అయితే షోకాజ్ నోటీసు ఇచ్చి షాపు టెంటరు లైసెన్స్ రద్దు చేస్తారు. ఇప్పటి వరకు కేవలం పాతికలోపే కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శ్రీబాలాజీలో రాత్రిపూట అధిక ధరలు కొత్త బస్టాండ్లోని శ్రీ బాలాజీ క్యాంటీన్ చీకటి వ్యాపారానికి తెర లేపిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాత్రయితే చాలు ధరలు మరిపోతున్నాయని, పగలు ఉన్న ధరలను పెంచి రాత్రి వేళల్లో అధిక రేట్ల తినుబండరాలు, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తదితర పానియాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. వీటిపై గతంలో ఆర్టీసీ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వారిపై విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టించుకోని తూనికలు, కొలతల శాఖ బస్టాండ్లలో ప్రయాణికులు దోపిడీకి గురవుతుంటే తూనికలు, కొలతల శాఖ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు. ఎప్పుడో ఓసారి దాడులు నిర్వహించి వదిలేస్తున్నారు. కర్నూలు బస్స్టేషన్ నుంచి ప్రతీరోజు దాదాపు 50వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరి నుంచి రూ.లక్షల దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు కొత్త బస్టాండ్లోని బాలాజీ క్యాంటీన్లో వస్తువులను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. పగలు ఒక రేటు, రాత్రి వేళల్లో ఒక రేటు పెట్టి తినిబండరాలు విక్రయిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎంఆర్పీ కంటే రూ.2 నుంచి రూ.5వరకు అధికంగా అమ్ముతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. - ఎం. గోవిందు, పాతబస్తీ ఫిర్యాదు చేస్తే చర్యలు: బస్టాండ్లలో అధిక ధరలకు వస్తువులు అమ్మరాదు. ఎమ్మార్పీకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు విక్రయిస్తే ప్రయాణికులు కంట్రోలర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. -శ్రీనివాసులు, డీసీటీఎం -
తిరుమలలో వ్యాపారుల మధ్య ఘర్షణ
-
నిబంధనలకు అనుగుణంగా
కడప అగ్రికల్చర్, న్యూస్లైన్ : టపాసులు విక్రయించే యజమానులు నిర్ణయించిన ప్రదేశాల్లో నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్మల అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దీపావళి పండుగ సంద ర్భాన్ని పురస్కరించుకుని బహిరంగ ప్రదేశాల్లో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈనెల 29వ తేది సాయంత్రం 5 గంటల వరకు టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటికే 205 టపాసుల విక్రయ కేంద్రాలకు దరఖాస్తులు వచ్చాయన్నారు. అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్, పోలీసు అధికారుల సహకారంతో టపాసుల విక్రయ కేంద్రాల స్థలాలు గుర్తించి లక్కీ డిప్ ద్వారా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. టపాసులు కాల్చేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సిటీ కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. టపాసుల విక్రయకేంద్రాలను ఎదురెదురుగా కేటాయించకూడదన్నారు. విక్రయ కేంద్రాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్కాని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేలా విద్యుత్ అధికారులు అందుబాటులో ఉంటూ విక్రయదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. కేంద్రాల వద్ద విక్రయదారులు 200 లీటర్ల నీటిని నిల్వ ఉండే డ్రమ్ములను, మూడు బకెట్ల ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నవంబరు 1 నుంచి 3వ తేది వరకు విక్రయ కేంద్రాలలో టపాసులను విక్రయించుకోవచ్చన్నారు. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు టపాసులను కాల్చేలా చూడాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, డీఆర్వో ఈశ్వరయ్య, కడప ఆర్డీఓ హరిత, డీఎస్పీ రాజేశ్వర్రెడ్డి, కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శ్రీలక్ష్మితోపాటు టపాసుల విక్రయ కేంద్రాల నిర్వాహకులు, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.