small indusrties
-
చిరు వ్యాపారులకు షాక్
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: వ్యాపారాలు, చిన్న పరిశ్రమలతో స్వయం ఉపాధి కల్పించుకొని, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలపై చంద్రబాబు ప్రభుత్వం దొంగ దెబ్బ కొట్టింది. ఓ పక్క విద్యుత్ చార్జీలు పెంచడంలేదని చెబుతూనే.. వీరిపై టైమ్ ఆఫ్ డే టారిఫ్ (టీఓడీ) పేరుతో పీక్ అవర్స్లో అదనపు విద్యుత్ చార్జీల భారం మోపుతోంది. అంటే విద్యుత్ ఎక్కువగా వాడే ఉదయం, సాయంత్రం సమయాల్లో అదనపు చార్జీలు పడతాయి. చిన్న షాపుల్లో సాయంత్రం వేళ వ్యాపారం జరిగినా, జరగకపోయినా కరెంటు చార్జీలు మాత్రం భారీగా పడతాయి. ఈ సమయాల్లో లోడ్నుబట్టి యూనిట్కు 50 పైసల నుంచి 1 రూపాయి వరకు అదనపు భారం పడనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. ఇక బాదుడు మామూలుగా ఉండదు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నుంచి అత్యధికంగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తూ రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు సమయాన్ని బట్టి బాదుడు మొదలెట్టింది. ఇన్నాళ్లూ హై టెన్షన్ (హెచ్టీ) కనెక్షన్ ఉన్న పెద్ద పరిశ్రమలకు మాత్రమే అమలులో ఉన్న టైమ్ ఆఫ్ డే టారిఫ్ చార్జీలను ఇకపై లో టెన్షన్ (ఎల్టీ) పరిశ్రమలు, వాణిజ్య సర్వీసులకూ అమలు చేయనుంది. ఈ మేరకు 2025–26 ఆర్థిక సంవత్సరం రిటైల్ సరఫరా ధరలు (టారిఫ్ ఆర్డర్)ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గురువారం తిరుపతిలో విడుదల చేసింది. విద్యుత్ వినియోగించే సమయాన్ని బట్టి వినియోగదారులపై భారం మోపేందుకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చిoది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ‘పీక్ అవర్’ వినియోగంలో ఒక విధంగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ‘ఆఫ్ పీక్ అవర్’లో మరో విధంగా చార్జీలు వసూలు చేస్తారు. మిగతా సమయంలో ఇప్పుడున్న చార్జీలే వర్తిస్తాయి. ఈమేరకు చార్జీల వసూలుకు డిస్కంలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఎఆర్ఆర్) ప్రతిపాదనలకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. గ్రిడ్ డిమాండ్ ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చార్జీలు మరింతగా పెంచి విద్యుత్ బిల్లుల్లో వేయనున్నారు. పైగా ఇదీ కిలోవాట్ల లెక్కన లోడ్నుబట్టి మారిపోతుంది. అంటే 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ, 220 కేవీ లోడ్ ప్రకారం చార్జీ పడుతుంది. ఏమాత్రం లోడ్ పెరిగినా బిల్లు భారీగా పెరుగుతుంది. డిమాండ్కు సరిపడా సరఫరా చేయాలి ఈ వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 260 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఇన్చార్జి చైర్మన్ ఠాకూర్ రామ్సింగ్ ఆదేశించారు. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గృహావసరాలకు అవసరమైన అదనపు లోడ్లను డిస్కంల పరిధిలో క్రమబద్ధీకరించి కోతలు లేకుండా చూడనున్నట్లు చెప్పారు. ఇప్పుడు వాడుతున్న విద్యుత్కు అదనంగా విద్యుత్ అవసరమని అంచనా వేశామన్నారు. స్మార్ట్ మీటర్లు ఎక్కడా ఏర్పాటు చేయడంలేదని, వాటిని ఇంకా ఆమోదించలేదని, ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును మాత్రమే ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్యుత్ వాడకం పెరుగుతుండడంతో అందుకు తగినట్లుగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఏపీఆర్సీ సభ్యుడు వెంకట్రామరెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టారిఫ్ ఆర్డర్లోని మరికొన్ని నిర్ణయాలు» ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమర్పించిన ఏఆర్ఆర్ ప్రకారం.. ఆదాయ అవసరం రూ.57,544.17 కోట్లను ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఇది డిస్కంలు అడిగిన దానికంటే రూ.1,324.35 కోట్లు మాత్రమే తక్కువ. మొత్తం ఆదాయం రూ.44,323.30 కోట్లుగా నిర్ణయించింది. » రూ.12,632.40 కోట్ల ఆదాయ అంతరాన్ని ఆమోదించింది. ఇది డిస్కంలు దాఖలు చేసినదానికంటే రూ.2,050.86 కోట్లు తక్కువ. » రాష్ట్ర ప్రభుత్వం రూ.12,632.40 కోట్ల ఆదాయ అంతరాన్ని సబ్సిడీగా భరించేందుకు అంగీకరించింది. » ఎంపిక చేసిన వర్గాలకు ఉచిత విద్యుత్, రాయితీలు కొనసాగుతాయి. » రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని జెన్కోలు దిగుమతి చేసుకున్న బొగ్గు రవాణాకు రైలు, సముద్ర మార్గాలను వినియోగించుకోవచ్చు. » స్వల్ప కాలిక విద్యుత్ అవసరాల కోసం తొలిసారిగా అవర్లీ డిస్పాచ్ను తీసుకువర్వీచ్చింది. » ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇళ్లను నిర్మించుకునే లేదా పునర్నిర్మిoచే వ్యక్తులు వాణిజ్య టారిఫ్కు బదులుగా డొమెస్టిక్ టారిఫ్ బిల్ చెల్లించుకోవచ్చు. » స్థిరమైన టారిఫ్లు గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సె‹స్ వినియోగదారులకే కాకుండా ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకూ వర్తిస్తాయి. » 150 కేడబ్ల్యూ వరకు కనెక్ట్ చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు ఎల్టీ వోల్టేజ్ స్థాయిలో విద్యుత్ సరఫరా చేయడానికి ఆమోదం. డిమాండ్ చార్జీలు లేకుండా ఈవీల టారిఫ్ యూనిట్కు రూ.6.70 వసూలు చేస్తారు.కొత్తగా అదనపు లోడ్ క్రమబద్దీకరణ పథకం డెవలప్మెంట్ చార్జీల్లో 50 శాతం చెల్లించడం ద్వారా గృహ వినియోగదారులు అదనపు లోడ్ను క్రమబద్దీకరించే పథకాన్ని ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఈ పథకం 2025 మార్చి 1 నుంచి 2025 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఆన్లైన్ విండో ద్వారా వినియోగదారులు స్వచ్ఛందంగా అదనపు లోడ్లను ప్రకటించవచ్చు. డిస్కంలు అదనపు లోడ్లను క్రమబద్దీకరిస్తాయి. డెవలప్మెంట్ ఛార్జీల్లో 50 శాతం వసూలు చేస్తాయి. అదనపు లోడ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్లు కూడా సేకరిస్తాయి. ఈ అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుంది. -
Lockdown Impact: ‘చిరు’ నవ్వులు దూరం
భూపాలపల్లి: కరోనా మహమ్మారి వేల కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. అయిన వారిని కోల్పోయి వేలాది మంది దుఖః అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. లాక్డౌన్ కారణంగా పూట గడవక పనుల కోసం ఎదురుచూస్తున్నారు. వైరస్ ప్రబలడమేమో కానీ కూలీ దొరికి ఇంటికి నిత్యావసర సరుకులు తీసుకెళ్తే బాగుండు అని భావిస్తున్నారు. ఉపాధి లేక వేలాది మంది.. రాష్ట్రంలో కరోనా సెకండ్వేవ్ విజృంభించి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుంచి లాక్డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అన్ని వ్యాపార సంస్థలు తెరవాలని, మిగతా సమయాల్లో కచ్చితంగా లాక్డౌన్ పాటించాలని ప్రకటించింది. దీంతో వ్యాపారాలు, ప్రజా రవాణా, వివిధ రంగాల్లో పనులు జరుగక అసంఘటిత రంగంలోని 27 విభాగాల్లో పని చేస్తున్న సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరంతా గత 12 రోజులుగా పనులు లేక పస్తులుండాలి్సన పరిస్థితి నెలకొంది. కుటుంబాన్ని వెళ్లదీసేందు కు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. చేసేది లేక అప్పులు తీసుకొని వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయం.. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ చిరు వ్యాపారులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆటో, ట్రాలీ డ్రైవర్లు లాక్డౌన్ సడలింపు సమయంలో అడ్డాల వద్ద గిరాకీ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఫలితం లభించడం లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని హమాలీ, రిక్షా కార్మికుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. పొట్టకూటి కోసం రహదారికి ఇరువైపులా చిరు వ్యాపారం సాగించే కూరగాయలు, పండ్లు, సోడా, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, గప్చుప్, మిర్చిబండ్ల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరంతా ఇంటికే పరిమితమై వైరస్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందా.. లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచిస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. పూట ఎల్లుడు ఇబ్బంది ఐతాంది.. లాక్డౌన్ పెట్టినంక పుటకు ఎల్లుడు ఇబ్బంది ఐతాంది. ఇదివరకు రోజంతా రిక్షా తొక్కితే రూ. 400 నుంచి రూ. 500 వచ్చేవి. ఇప్పుడు రిక్షా అడిగినొళ్లే లేరు. అడ్డా మీద రోజుకు నాలుగు రిక్షాలు బయటకు వెళ్తలేవు. రోజుకు ఒక గిరాకీ వస్తే వస్తాంది.. లేదంటే లేనే లేదు. రోజుకు వంద కూడా సంపాదించకపోతే ఇల్లు ఎట్ల గడుస్తది. చాన ఇబ్బంది పడుతానం. - మొలుగూరి సారయ్య, రిక్షా కార్మికుడు ఇంటికాడనే ఉంటాన.. లాక్డౌన్ల పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకే దుకాండ్లు తియ్యాలె అంటుండ్రు. మధ్యాహ్నం అయితేనే సోడాలకు గిరాకీ ఉంటది. పొద్దుపొద్దున సోడా తాగెటోళ్లు ఎవ్వరు ఉండరు. పొయిన ఎండాకాలం మొత్తం లాక్డౌనే ఉన్నది. ఇప్పుడు కూడా గట్లనే అయింది. ఇంటి కర్చులైతే ఆగవు కదా. పని లేక, పైసలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మాలాంటి వాళ్లను ఆదుకోవాలె. - మార్కండేయ, సోడాబండి వ్యాపారి ప్రభుత్వం సాయం అందించాలి కరోనా లాక్డౌన్తో ప్రజలు ఎవరూ బయటకు వస్తలేరు. ఆర్టీసీ బస్సులే నడుస్త లేవు. ఇగ మా ఆటోలు నడుస్తయా. ఉదయం 6 గంటలకు ఆటోను అడ్డా మీద ఉంచితే ఒక్కరు కూడా కిరాయి అడుగుతలేరు. రోజుకు రూ. వంద గిరాకీ కూడా అయితలేదు. చూసి చూసి 9 గంటలకు ఇంటికి వెళ్తున్నాం. ఆటో ఫైనాన్స్కు కిస్తీ తప్పకుండా కట్టాలి్సందే. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. - యార రామకృష్ణ, ఆటో డ్రైవర్ -
కుటీర పరిశ్రమ కుదేలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు అంతరించిపోతున్నాయా? ఏటా తగ్గిపోతున్న కుటీర పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ల సంఖ్య ఇందు కు అవుననే సమాధానమిస్తోంది. కుటీర పరిశ్రమల కేటగిరీ కింద 2014–15లో 16,377 కనెక్షన్లు ఉండగా 2015–16లో ఆ సంఖ్య 10,995కు పడిపోయింది. రాష్ట్ర అర్థ గణాంక శాఖ విడుదల చేసిన వార్షిక గణాంకాల పుస్తకం–2017 దీన్ని బహిర్గతం చేసింది. 2014–15తో పోల్చితే 2015–16లో రాష్ట్రంలోని మిగిలిన అన్ని కేటగిరీల కింద విద్యుత్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగ్గా, కుటీర పరిశ్రమల కనెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. కుటీర పరిశ్రమలు గడ్డు కాలాన్ని ఎదుర్కొని ఏటా మూతబడుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా ఏటా రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల కుల వృత్తులు, చేతి వృత్తులు చతికిలబడిపోతున్నాయి. కుటీర పరిశ్రమల స్థితిగతులపై రాష్ట్ర పరిశ్రమల శాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదని, దీన్ని ధ్రువీకరించలేమని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థితిగతుల సమాచారమే ఆ శాఖ వద్ద ఉంది. కుటీర పరిశ్రమల నమోదుకు యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణం. బడా పరిశ్రమలతో పోటీ: ధోబీ ఘాట్లు, పవర్ లూమ్స్, వడ్రంగి, కుమ్మరి, కంచారి, స్వర్ణకార, శిల్పి, కమ్మరి, ఫినాయిల్, అగర్బత్తి, కోవత్తి, అప్పడాలు, చెప్పులు, సబ్బుల తయారీ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉత్పత్తులు, ఫల కాలు, కొయ్యలతో బొమ్మల తయారీ, పచ్చళ్లు, మ్యాంగో జెల్లీ, విస్తరాకుల తయారీ పరిశ్రమలను రాష్ట్ర విద్యుత్ సంస్థలు కుటీర పరిశ్రమలుగా పరిగణించి యూనిట్కు రూ.3.75 చొప్పు న చార్జీలు వసూలు చేస్తున్నాయి. 10 హెచ్పీల విద్యుత్ లోడ్లోపు వినియోగిస్తే కుటీర పరిశ్రమలుగా గుర్తిస్తున్నాయి. విద్యుత్ లోడ్ 10 హెచ్పీలకు మించితే ఈ పరిశ్రమలను ఎల్టీ–పరిశ్రమల కేటగిరీ కింద చేర్చి రూ.6.70 చార్జీలు విధిస్తున్నాయి. చెరుకు క్రషింగ్, రొయ్యలు, చేపల పెంపకం పరిశ్రమలను ఎల్టీ–3 పరిశ్రమల కేటగిరీ నుంచి కుటీర పరిశ్రమల కేటగిరీలోకి మార్చాలన్న డిస్కంల ప్రతిపాదనలను 2016– 17 విద్యుత్ టారిఫ్ ఉత్తర్వుల్లో ఈఆర్సీ తిరస్కరించింది. నిరంతర విద్యుత్ ఇస్తున్నా, చార్జీలు పెంచకున్నా కుటీర పరిశ్రమల సంఖ్య తగ్గిపోవడం వెనక బడా పరిశ్రమలతో ఎదురవుతున్న పోటీయే కారణమని పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్పత్తులు, సేవలను భారీ పరిశ్రమలు తక్కువకే అందిస్తుండటంతో కుటీర పరిశ్రమలు నిలదొక్కుకోలేకపోతున్నాయని ఆ శాఖ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ సమస్య కాదు: టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కుటీర పరిశ్రమల నుంచి తొలగించి కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కేటగిరీ కింద చేర్చడంతోపాటు వాటి విద్యుత్ చార్జీలను తగ్గించామని దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. 5 హెచ్పీ విద్యుత్ లోడ్ లోపు విద్యుత్ వినియోగించే పరిశ్రమలు కుటీర పరిశ్రమల కేటగిరీ కింద వస్తాయన్నారు. కొన్ని పరిశ్రమలు వినియోగించే విద్యుత్ లోడ్ 5 హెచ్పీకి మించిపోతే సాధారణ పరిశ్రమల కేటగిరీలో చేరుతాయన్నారు. దీంతో కుటీర పరిశ్రమల కేటగిరీ విద్యుత్ కనె క్షన్లు తగ్గి ఉంటాయని అన్నారు. విద్యుత్ కారణంతో కుటీర పరిశ్రమలు మూతబడేందుకు అవకాశామే లేదని కొట్టిపారేశారు. -
చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి
ముకరంపుర : చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆలిండియా ఫోరమ్ ఫర్ స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వర్రావు కోరారు. మంగళవారం కరీంనగర్లోని ప్రెస్భవన్లో విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితులు, వ్యాపారం, ముడిసరుకు లేక పరిశ్రమల కోలుకోలేకపోతున్నాయన్నారు. ఈపరిస్థితుల్లో బ్యాంకులకు వడ్డీలు, వాయిదాలు కట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. అప్పులు చెల్లించలేక పరిశ్రమలు మూతపడుతున్నాయని, బ్యాంకు రుణాలు ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్లు ప్రభాకర్రావు, రాజేశ్వర స్వామి, కళ్యాణ్ చక్రవర్తి, ఎం.వాసుదేవచారి, జడల భాస్కర్రావు, రవీందర్, మేరుగు పర్శరాములు, తాటికొండ రాజు, దేవదాసు, గుడ్లపల్లి సుధాకర్, శ్యాంసుందర్, వీరేశం, శనిగరం సునీత, మధు పాల్గొన్నారు.