breaking news
Soil bearing capacity
-
భూమాతకు శోకం!
ఉలవపాడు: కరేడు చెరువు అక్రమార్కుల దెబ్బకు విలవిల్లాడుతోంది. చెరువులో ఉన్న మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది అధికారపార్టీ పెద్దలు జేసీబీలతో ట్రాక్టర్లకు ఎత్తి «ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులకు తెలిసినా ఆవైపు కన్నెత్తి చూడటంలేదు. అధికారం అండ ఉండటంతో నిస్సిగ్గుగా వ్యవవహరిస్తున్నారు. గతంలో కూడా ఓ సారి భారీగా మట్టిని తరలించారు. ఆ సమయంలో అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా రాలేదు. పని అంతా పూర్తి అయిన తరువాత వారానికి వచ్చిన జేఈ రాజశేఖరరెడ్డి.. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై కరేడు చెరువు నీటి సంఘం అధ్యక్షురాలు సింధుప్రియ పోలీసుల ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మట్టి తరలిపోతుండటం వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని రైతులు వాపోతున్నారు. భారీగా తరలింపు... శనివారం రాత్రి, ఆదివారం జేసీబీలతో సుమారు 650 ట్రిప్పులు మట్టిని తరలించినట్లు సమాచారం. కరేడు గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈ తరలింపు జరుగుతోంది. ఒక్కో ట్రాక్టరు 380 రూపాయల చొప్పున సమీపంలో నిర్మిస్తున్న హేచరీలకు తోలుతున్నారు. అంటే రెండు రోజుల్లో 2 లక్షల 47 వేల రూపాయల మట్టిని దోచేశారు. దీనికి తోడు చెరువులో క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ గుంతలు పెడుతున్నారు. అనుమతి తీసుకుని క్రమ పధ్ధతిలో మట్టి తీసుకుంటే నీటి నిల్వ పెరుగుతుంది. కానీ అక్రమార్కులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దీనివలన చెరువులో నీరు సక్రమంగా ఆయుకట్టు పొలాలకు చేరదు. గుంతల్లోనీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతుంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు సాధారణంగా చెరువు మొత్తం నీటిసంఘం అధ్యక్షురాలు సభ్యులపై అధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. తమ చెరువు నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని నీటి సంఘం అ«ధ్యక్షురాలు సింధుప్రియ ఎస్సైకి ఫోన్ చేసి తెలియచేశారు. అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరారు. దీంతో ఎస్సై నీటిపారుదల శాఖ అధికారుల చేత చెప్పించాలని.. మీరు చెపితే రానని చెప్పినట్లు తెలిపారు. తాను అధ్యక్షురాలిగా ఫిర్యాదు చేసినా అక్రమ తరలింపును ఆపడానికి నీటిపారుదల శాఖ అధికారులు కానీ, పోలీసులు కానీ రాలేదని వాపోయారు. -
మట్టి పరీక్షలతోనే సరి!
తాండూరు: కాగ్నా నది (వాగు)లో చెక్డ్యాం నిర్మాణానికి పునాదిరాయి కూడా పడలేదు. చెక్డ్యాం గురించి ప్రజాప్రతినిధులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెంచి కాగ్నా వరద జలాలను వినియోగంలోకి తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు శ్రద్ధ కనబరచడం లేదనే విషయం స్పష్టమవుతోంది. చెక్డ్యాం నిర్మాణానికి 2013 మార్చిలో సుమారు రూ.8.52 కోట్ల నిధులు (అడ్మిస్ట్రేషన్ సాంక్షన్) మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ చెక్డ్యాం నిర్మాణంతో సుమారు 35 టీఎంసీల జలాలు అందుబాటులోకి వస్తాయి. దాంతో కాగ్నా వరద జలాలు వినియోగంలోకి వచ్చి తద్వారా మహబూబ్నగర్ జిల్లా కోడంగల్లోని సుమారు 39 గ్రామాలతో, తాండూరు పట్టణ వాసులకు తాగునీటి కష్టాలు తీరుతాయి. కాగ్నాకు చుట్టుపక్కల సుమారు 750 ఎకరాల ఆయకట్టుకూ సాగునీరు అందుతుంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోకపోవడంతోనే చెక్డ్యాం పనులు మొదలవడానికి ఆలస్యమవుతోంది. గత ఏడాది చివరిలోనే చెక్డ్యాం నిర్మించనున్న ప్రాంతంలో ‘సాయిల్ బేరింగ్ కెపాసిటీ’ (ఎస్బీసీ)లో భాగంగా మట్టి పరీక్షలు నిర్వహించారు. చెక్డ్యాం నిర్మాణానికి కాగ్నా సమీపంలోని యాలాల మండల పరిధిలో ఒకటిరెండు గ్రామాల్లో దాదాపు 5ఎకరాల 2గుంటల భూమిని సేకరించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. కానీ నిర్మాణ పనులకు మోక్షం కలగడం లేదు. నిధుల సాంకేతిక మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. చెక్డ్యాం నిర్మాణం ప్లాన్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉండటం కూడా ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చెక్డ్యాం నిర్మాణానికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించి పనులు మొదలయ్యేలా ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెంచాలని స్థానికులు కోరుతున్నారు.