tarlupadu
-
ఎండిన మిరపకు నష్ట పరిహారం ఇవ్వాలి
► రైతు సంఘం కార్యదర్శి ఏరువ పాపిరెడ్డి తర్లుపాడు: కరువు వలన ఎండిపోయిన మిరప పంటను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం కార్యదర్శి ఏరువ పాపిరెడ్డి కోరారు. ఈ నెల 4న గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని చలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మండలంలోని నాయుడుపల్లె, చెన్నారెడ్డిపల్లె, సీతానాగులవరం, తుమ్మలచెరువు, మీర్జాపేట, కారుమానుపల్లె గ్రామాల్లో రైతు సంఘం నాయకులు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మిరప పంట తెగుళ్లతో గణనీయంగా తగ్గటంతో పాటు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు పొలాలను వదలేశారన్నారు. ఎకరాకు 1.50లక్షల వరకు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయంలో ధరలు పడిపోవటంతో రైతులు అప్పుల పాలయ్యారన్నారు. మిర్చి పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎకరాకు 50వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. దళారుల మాయజాలంతో పండించిన మిరప పంటకు ధరలు లేవని, క్వింటా 5వేలకు మించి అమ్మటం లేదన్నారు. మార్క్ఫెడ్ ద్వార క్వింటా మిర్చి 10వేల రూపాయలకు కొనుగోలు చేయించాలని కోరారు. వర్షాలు లేక తీవ్ర కరువు ఏర్పడి బోర్లు ఎండిపోయి మిర్చి పంటలు నిలువున వదలి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ఏడాది క్వింటా 15వేలు అమ్మకం చేసినా మిర్చి ఈ ఏడాది 5వేలకు దిగజారిందని, 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామన్న ప్రభుత్వం బడ్జెట్లో దాని ఊసే లేదన్నారు. గిట్టుబాటు ధర కోసం, కరువు వలన ఎండిన మిర్చి, పత్తి పంటలను నమోదు చేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న జరిగే ధర్నా కార్యక్రమంలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తవనం నారాయణరెడ్డి, వెన్నా సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వాటర్షెడ్లో అవినీతి ఊట
► రాత్రిళ్లు యంత్రాలతో ... పగలు కూలీలతో పనులు ఉపాధికి అడ్డుపడుతున్న యంత్రాలు తర్లుపాడు : అధికారం మనది అయితే కూలీల స్థానంలో యంత్రాలు వాడినా బిల్లులు వస్తాయనేది వారి ధీమా. అంతా అనుకున్నట్లుగా జరిగింది. పనులు వేగంగా చేసేందుకు ఉదయం కూలీలను పనులకు రప్పిస్తారు. రాత్రయ్యే సరికి యంత్రాలు రంగంలోకి దిగుతాయి. పనులను చకాచకా పూర్తి చేసేందుకు అనువుగా ప్రణాళికలు తయారు చేశారు. ఇదీ ఏదో ప్రైవేటు వ్యవహారం కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లోని కూలీలకు ఉపాధి కల్పించేందుకు వాటర్ షెడ్ పథకాన్ని ఏర్పాటు చేసింది. అయితే నిబంధనలకు నీళ్లు వదిలి వాటర్షెడ్ పనుల్లో అవినీతి ఊట సాగుతుంది. అధికారం ఉపయోగించి పనులు దక్కించుకున్న లబ్ధిదారులు యంత్రాలతో రాత్రుళ్లు పనులు చేయిస్తూ నామమాత్రంగా ఒకరిద్దరు కూలీలను పిలిపించి కూలీలతో పనులను చేయిస్తున్నట్లుగా ఫోటోలు చూపించి నిధులు స్వాహా చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు లేక, ఉపాధి పనులు లేక కూలీలు వలసబాట పట్టారు. అధికారులు మాత్రం మాముళ్ల మత్తులో కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తూ యంత్రాలతో పనులు చేయించినా బిల్లులు చెల్లిస్తున్నారు. 10 రోజులుగా తర్లుపాడు మండలంలో రైతు వారీ కుంటలను యంత్రాలతో చేయిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఉపాధి కూలీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వర్క్ ఆర్డర్ తెచ్చుకున్నటువంటి సర్వే నంబర్లలో కాకుండా ప్రభుత్వ భూములు, పొరంబోకు భూముల్లో పను లు చేయిస్తూ బిల్లులు చేయించుకుంటున్నారు. తర్లుపాడు చెరువు, అలుగు వైపు, ఈతచెట్ల వాగు, అంకాలమ్మ మాన్యం భూముల్లో ఇటీవల రైతు వారీ కుంటలను యంత్రాలతో చేశారు. గ్రామానికి చెందిన ఆవులమంద గంగమ్మ పొలంలో తమకు తెలియకుండానే అధికార పార్టీ నాయకులు పంట సంజీవని కుంటలను తీశారని వాపోతుంది. ఈ విషయంపై వాటర్షెడ్ అధికారులను వివరణ కోరగా పనులను పరిశీలించి యంత్రాలతో పనులు చేసినట్లు రుజువు అయితే బిల్లులు నిలుపుదల చేస్తామంటున్నారు. మాకు తెలియకుండానే పొలంలో గుంతలు తీశారు: మాకు ఈతచెట్ల వాగు సమీపంలోని అంకాలమ్మ మాన్యంలో 3ఎకరాల పొలం ఉంది. ఇటీవల వర్షాలు లేక బీడు పెట్టాం. నాలుగు రోజుల కిందట గ్రామానికి చెందిన నాయకులు తమ పొలంలో ప్రొక్లెయిన్లతో గుంతలు తీయించారు. ఆవులమంద రమణయ్య