breaking news
Telangana Retired Engineers Association
-
భూగర్భ నీరు @ కందకంతో చేరు!
నీరు మనకైనా పంటకైనా ప్రాణాధారం. భూగర్భంలో నీరంటూ ఉంటే బావి ద్వారానో, బోరు బావి ద్వారానో తోడుకొని పంటలు పండించుకోవచ్చు. అసలు భూగర్భంలోనే నీరు ఏటేటా అడుగుకు దిగిపోతుంటే అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. పంటల కోసం, పశువుల కోసం రోజూ తోడుకోవటానికి భూగర్భంలో నీరు పుష్కలంగా ఉండాలంటే.. వృథాగా చేను దాటి పోయే వర్షపు నీటి పరుగును ఆపి, భూమి లోపలికి చప్పున ఇంకింపజేసుకోవటం ఒక్కటే అత్యుత్తమ మార్గం. అందుకు కందకాలే సోపానాలంటున్నారు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు, వాన నీటి సంరక్షణ ఉద్యమకారులు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాం ప్రసాదరెడ్డి. తెలుగునాట రైతులు తమ భూముల్లో కందకాలు తవ్వుకోవటానికి పదేళ్లుగా మాట సాయం చేస్తున్నారు. వారి సూచనలు వారి మాటల్లోనే..ఎకరానికి రూ. 5 వేల ఖర్చు మన చేలో కురిసిన ప్రతి వాన బొట్టును పొలంలోనే ఇంకించుకోవాలి. మన చేను కిందే భూగర్భ జలాశయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైనప్పుడు కావలసినంత నీటిని బోర్ల ద్వారా, బావుల ద్వారా తోడుకొని సమృద్ధిగా పంటలు పండించుకోవాలంటే.. ముందు మనం ‘చేను కిందే చెరువు’ను సృష్టించుకోవాలి. అందుకు ఇదే సరైన సమయం. వానా కాలానికి ముందే పొలంలో కందకాలు తవ్వుకోవాలి. అకాల వేసవి వర్షాలను సైతం భూగర్భంలోకి ఇంకింపజేసుకోవటం తెలివైన పని. వర్షాధార, ఆరుతడి పంటలు సాగు చేసే భూముల్లో.. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకుంటే.. ఆ పొలానికి అడుగునే చెరువును నిర్మించుకున్నట్లే నీటి భద్రత నిక్కచ్చిగా దొరుకుతుంది. దీనికి ఖర్చు ఎకరానికి సగటున రూ. 5 వేలకు మించి కాదు. కందకాలకు ఎకారానికి 2 సెంట్ల భూమి అవసరం అవుతుంది. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఈ పెట్టుబడి ఎక్కువేమీ కాదని రైతులు గ్రహించాలి.ఏ యే పొలాల్లో ఎలా తవ్వాలి?పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. మీటరు లోతు, మీటరు వెడల్పున సమతల కందకాలను తవ్వుకోవాలి. నేలను బట్టి, వాలు ఎక్కువ తక్కువలను బట్టి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. పొలం ఆ చివరి నుంచి ఈ చివరికి ఒకే కందకం తవ్వకూడదు. కందకం పొడవు 25 మీటర్లుండాలి. ఆ తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి, అదే వరుసలో వాలుకు అడ్డంగా మరో 25 మీటర్ల కందకం తవ్వాలి. కందకం తవ్విన మట్టిని పొడవుగా ఒకే కట్టగా కందకం లోతట్టు వైపున గట్టు మాదిరిగా పోయాలి. ఇలా చేస్తే కందకంలోకి వచ్చిన వదర నీరు సైతం పొర్లిపోకుండా ఉంటుంది. నీటి సంరక్షణతో పాటు పొలంలోని విలువైన పైపొర మట్టి కొట్టుకుపోకుండా కూడా కాపాడుకోవచ్చు.ఎర్ర నేలల్లో ఎలా?ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కా నేలల్లో నీరు తొందరగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇటువంటి పొలాలు వాలు 2% ఉంటే.. పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. వాలు ఇంకా ఎక్కువగా ఉంటే 40 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వుకోవాలి. ఒక వేళ భూమి వాలు లేకుండా సమతలంగా ఉంటే.. కందకాలకు బదులు మడులు ఏర్పాటు చేసుకోవాలి. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి.నల్లరేగడి నేలల్లో ఎలా? నల్లరేగడి నేలల్లో నీరు త్వరగా ఇంకదు. కాబట్టి, ఈ నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన (బావి లేదా బోరు కింది భాగంలో) నీటి కుంట లేదా ఫామ్ పాండ్ను తవ్వుకోవాలి. పొలాల్లో తవ్వే వాన నీటి సంరక్షణ కందకాల విషయంలో సందేహాలుంటే తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సంప్రదించవచ్చు: సంగెం చంద్రమౌళి (విశ్రాంత ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్): 98495 66009, మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి (విశ్రాంత ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) 99638 19074.3 రోజుల్లో నా జీవితం మారిపోయింది!‘సాక్షి’ దినపత్రిక ‘సాగుబడి’లో కందకాల గురించి కథనం చదివి మా 135 ఎకరాల్లో ఐదేళ్ల క్రితం మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి సూచనల మేరకు కందకాలు వేసవిలోనే తవ్వించాను. నీటి కరువు శాశ్వతంగా తీరింది. అంతకుముందు వందలాది బోర్లు తవ్వినా ప్రయోజనం లేకపోయింది. కందకాలు తవ్విన 3 రోజుల్లోనే పెద్ద వర్షం కురవటంతో బోర్లు రీచార్జ్ అయ్యి నా జీవితం నాటకీయంగా మారిపోయింది. ఆఫ్ ఇంచ్ నీరు పోసే బోర్లు 3 రోజుల్లోనే 3 ఇంచులు నీరు పోయటం మొదలైంది. అంతకుముందు బావిలో నీరు వేసవిలో 60–80 అడుగుల లోతుకు వెళ్లేవి. ఇప్పుడు 18 అడుగుల్లోనే ఉన్నాయి. బోర్లలో అయితే 12–16 అడుగుల్లోనే ఉన్నాయి. 95 ఎకరాల్లో కుంకుడు, బత్తాయి, ఉసిరి, జామ, సీతాఫలం, శ్రీగంధం తోటలకు 3 బోర్లతోనే నీరు పెడుతున్నాం. గతంలో ఈ 95 ఎకరాల్లోనే 247 బోర్లు వేసినా దొరకని నీటి భద్రత కందకాలతో ఒక్క పెద్ద వర్షంతో దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి ఎద్దడి లేనే లేదు. కుంకుడు తోట ఎండిపోయే దశలో తవ్విన కందకాల వల్ల శాశ్వతంగా గొప్ప మేలు జరిగింది. నా తోటను ఇప్పటికి అనేక రాష్ట్రాల నుంచి 6 లక్షల మంది వచ్చి చూసెళ్లారు. ఈ పుణ్యం అంతా ‘సాక్షి’ ద్వారా తెలుసుకొని, తవ్వుకున్న కందకాలదే! కందకాల్లోనే 740 కొబ్బరి చెట్లు నాటా. చక్కగా పెరుగుతున్నాయి.– లోకసాని పద్మారెడ్డి (99481 11931), పోలేపల్లి, చందంపేట మం‘‘, నల్లగొండ జిల్లా మాతో పాటు ఊరందరికీ మేలు!9 ఏళ్ల క్రితం ‘సాక్షి’ సాగుబడిలో చదివి మా వందెకరాల పొలంలో కందకాలు తవ్వుతుంటే ఊళ్లో రైతులందరూ ‘వీడేందిరా చేనంత గుంతలు కొడుతున్నాడు..’ అంటూ నన్ను పిచ్చోడి లెక్క చూశారు. అయితే, మా పొలంతో పాటు దిగువున ఉన్న రైతుల పొలాల్లో (30 వరకు) బోర్లన్నీ బాగా పారుతున్నాయి. పొలంలో 50 అడుగులకు ఒక వరుస చొప్పున కందకాలు తవ్వటంతో పాటు చెరువులు కూడా తవ్వించాను. దీంతో భూగర్భంలోకి నీరు బాగా ఇంకి, నీటి సమస్య తీరింది. 40 ఎకరాల్లో కుంకుడు తోట నాటా. 5 వేల టేకు చెట్లు నాటా. మామిడి, నేరేడు తదితర వినూత్న రకాలు సాగు చేస్తున్నా.– సాదినేని శ్రీనివాసరావు (99490 99055), శివలింగాపురం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా -
జూన్లోగా ‘సీతారామ’ మొదటి దశ పనులు
సాక్షి, కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తవుతాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ బృందం తెలిపింది. గురువారం ఐదుగురు ఇంజనీర్ల బృందం భద్రాద్రి జిల్లాలో పర్యటించింది. సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద జరుగుతున్న మొదటి దశ పంప్హౌజ్, పాల్వంచ మండ లం నాగారం వద్ద కిన్నెరసాని నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్, ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద జరుగుతున్న రెండోదశ పంప్హౌజ్, కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్హౌజ్ పనులను పరిశీలించింది. అనంతరం ఒడ్డురామవరం వద్ద విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంఎస్పీ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గోదావరి నుంచి ఈ పథకాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మిం చాలనుకున్న రాజీవ్సాగర్, ఇందిరాసాగర్లను కలిపి రీ ఇంజినీరింగ్ చేసి సీతారామ రూపొందించినట్లు తెలిపారు. చురుకుగా పనులు సీతారామ మొదటి దశ పంప్హౌస్ వరకు మెయిన్ కెనాల్ పనులు చురుకుగా జరుగుతున్నాయని ఎంఎస్పీ రెడ్డి తెలిపారు. ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద నిర్మిస్తున్న రెండోదశ పంప్హౌజ్ పను లు వచ్చే అక్టోబరులోగా పూర్తవుతాయని తెలిపారు. ములకలపల్లి మండలంలోని కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్హౌజ్ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు.110 కిలోమీటర్ల కెనాల్లో 50 కిలోమీటర్ల కెనాల్ 3,800 ఎకరాల అటవీ ప్రాంతం లో ఉందన్నారు. ఇందుకు సంబంధించి అటవీ అనుమతులు తీసుకున్నారన్నారు. దీంతో ఆటంకా లు లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు.వచ్చేనెలలో డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ బృందంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.చంద్రమౌళి, వ ర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్, ఉపాధ్యక్షులు డాక్టర్ రమణనాయక్, మహాత్మరెడ్డి ఉన్నారు. వీరి వెంట సీతా రామ సీఈ సుధాకర్, ఎస్ఈ నాగేశ్వరరావు ఉన్నారు. -
పొలాల్లో కందకాలతోనే సాగు నీటి భద్రత!
పొలంలో కురిసిన ప్రతి వాన చినుకుపైనా ఆ పొలం యజమానికి హక్కుంది. పొలంలో కురిసే ప్రతి చినుకునూ బయటకు పోకుండా భూమిలోకి ఇంకింపంజేసుకుంటే రైతులకు నీటి కష్టాలే ఉండవని నిపుణులు చెబుతున్నారు. కుండపోతగా కురిసే వర్షాన్ని పొలాల్లోనే భూమిలోకి ఇంకింపజేసుకోవడమే సర్వోత్తమం. పొలంలో వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పుతో, ప్రతి 50 మీటర్లకు ఒకచోట, కందకాలు తవ్వుకుంటే కుండపోత వర్షం కురిసినా నీరు పొలం దాటి వెళ్లదు. వర్షాలు తక్కువైనా బావులు, బోర్లలో నీటి నిల్వలకు కొరతే ఉండదు. సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇదేనంటున్నారు నిపుణులు. ఎకరానికి రూ. 1,500 ఖర్చుతో రైతులే తమ పొలాలకు సాగు నీటి భద్రత సాధించుకోవచ్చు. సలహాలు, సూచనలకు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు ఎస్. చంద్రమౌళి (98495 66009), ప్రధాన కార్యదర్శి ఎం. శ్యాం ప్రసాద్ రెడ్డి (99638 19074) లను సంప్రదించవచ్చు.