Telugu film stars
-
నాటా తెలుగు మహాసభలకు సినీ తారలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర అమెరికాలోని డల్లాస్లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరగనున్న నాటా తెలుగు మహాసభల్లో ప్రముఖ తెలుగు సినీ తారలు పాల్గొననున్నట్లు నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, మహాసభల కన్వీనర్ డాక్టర్ గూడూరు రమణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నటులు వరుణ్తేజ్, సుధీర్బాబు, రకుల్ ప్రీత్సింగ్, నిత్యామీనన్, ప్రణీత, మోడల్ మాధురి ఇతాగి, నందిని రాయ్, సియా గౌతమ్, రచన మౌర్య, సునీత వర్మ, తేజస్విని తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. అలాగే దర్శకులు కోదండరామిరెడ్డి, ఆదిత్య, సీవీ రెడ్డి, హరీశ్ శంకర్, మేర్లపాక గాంధీ, నిర్మాత మధుర శ్రీధర్ తదితరులు తమ అనుభవాలను పంచుకుంటారని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడు డాక్టర్ నాగిరెడ్డి, సమన్వయకర్త రామసూర్యారెడ్డి, సహ కన్వీనర్ శ్రీధర్రెడ్డి తెలిపారు. -
ఆ సినిమాపై స్టార్ల ప్రశంసల జల్లు
చెన్నై: రొటీన్కి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన క్షణం సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అడవి శేష్ అద్భుత నటన, కట్టి పడేసే స్క్రీన్ ప్లే తో విమర్శకుల అభిమానాన్ని చూరగొన్న ఈ సినిమాపై టాలీవుడ్ దర్శకులు, నటీనటులు సహా పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు రవితేజ, సుధీర్ బాబు, సందీప్ కిషన్, సుశాంత్ సహా నటి లక్ష్మి మంచు చిత్ర యూనిట్ ను అభినందనల్లో ముంచెత్తారు. అలాగే దర్శకులు వంశీ పైడిపల్లి, దాసరి మారుతి, సుజీత్ తదితరుల మన్ననలను సైతం క్షణం సినిమా దోచుకుంది. వీరంతా రవికాంత్, అడివి శేష్ కృషిని అభినందించారు. దీంతో అటు సినిమా భారీ విజయం, ఇటు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న అభినందనల వెల్లువతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగి తేలుతోంది. తనదైన ముద్రతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో శేష్ ఈ విజయంతో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందించిన హీరో అడివి శేష్, సినిమా సక్సెస్పై సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ పెట్టుబడి తమకు వచ్చిందని.. దీనిపై మొత్తం యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలిపారు. సామాన్య ప్రేక్షకుల దగ్గర నుంచి సినీ పండితుల నుంచి వస్తున్న స్పందన తనకు ఆనందాన్నిస్తోందన్నారు. కాగా అక్కినేని నాగార్జున, మహేష్ బాబు కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. హాట్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో సత్యం రాజేష్, రవి వర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అడవి శేష్కు జంటగా అదా శర్మ నటించింది. గత వారం రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్ తో ఫర్ఫెక్ట్ థ్రిల్లర్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.