Torrent Pharmaceuticals
-
గుజరాత్ టైటాన్స్ సహ యజమానిగా టోరెంట్ కంపెనీ.. ప్రాంచైజీలో 67 శాతం వాటా కొనుగోలు
అహ్మదాబాద్: ఐపీఎల్ (IPL) టీమ్ గుజరాత్ టైటాన్స్లో (Gujarat Titans) ప్రముఖ పారిశ్రామిక సంస్థ టోరెంట్ గ్రూప్ (Torrent Group) 67 శాతం వాటాను దక్కించుకుంది. ఈ ఒప్పందం గతంలోనే ఖాయమైనా... బుధవారం ఫ్రాంచైజీ యాజమాన్యం దీనిని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత యజమాని సీవీసీ క్యాపిటల్స్ ఇక ముందు మిగిలిన 33 శాతం వాటాతో సహ యజమానిగా కొనసాగుతోంది. ఐపీఎల్ జట్టులో భాగమయ్యేందుకు సీవీసీ క్యాపిటల్స్కు టోరెంట్ సుమారు రూ.5,025 కోట్లు చెల్లించినట్లు సమాచారం. 2021లో టైటాన్స్ను సీవీసీ రూ.5,625 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఈ టీమ్ ప్రస్తుత విలువను రూ.7,500 కోట్లుగా లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో సీవీసీ గ్రూప్ తాము పెట్టిన పెట్టుబడిలో సుమారు 89 శాతాన్ని తిరిగి తెచ్చుకోవడంతో పాటు 33 శాతం వాటాను ఇంకా తమ వద్దే ఉంచుకోవడం విశేషం. కొత్త ఒప్పందం కారణంగా ఐపీఎల్లో భాగం కావ డం పట్ల సంతోషంగా ఉన్నామని... లీగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు టోరెంట్ గ్రూప్ డైరెక్టర్ జినాల్ మెహతా వ్యాఖ్యానించారు. టోరెంట్ దేశవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్స్, విద్యుత్, గ్యాస్ రంగాల్లో పెద్ద ఎత్తున తమ వ్యాపారాలను సాగిస్తోంది. కంపెనీ విలువ దాదాపు రూ.41 వేల కోట్లుగా ఉంది. 2022 ఐపీఎల్ సీజన్లో టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్ 2023తో రన్నరప్గా నిలిచింది. -
ఎస్సెల్ ప్రొప్యాక్- టొరంట్ ఫార్మా యమస్పీడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో హెల్త్కేర్ రంగ కంపెనీ టొరంట్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎస్సెల్ ప్రొప్యాక్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎస్సెల్ ప్రొప్యాక్ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 46 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 18 శాతం పుంజుకుని రూ. 741 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్సెల్ ప్రొప్యాక్ షేరు 14.5 శాతం దూసుకెళ్లి రూ. 235 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 243 వరకూ ఎగసింది. జూన్ చివరికల్లా కంపెనీ ఆర్వోసీఈ 4.2 శాతం బలపడి 19.9 శాతానికి ఎగసినట్లు ఎడిల్వీజ్ సెక్యూరిటీస్ పేర్కొంది. టొరంట్ ఫార్మాస్యూటికల్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో టొరంట్ ఫార్మా నికర లాభం 49 శాతం జంప్చేసి రూ. 321 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2060 కోట్లకు చేరింది. దీనిలో దేశీ ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 925 కోట్లకు చేరింది. అయితే యూఎస్ ఆదాయం 1 శాతం క్షీణతతో రూ. 373 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో టొరంట్ ఫార్మా షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 2673 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2681 వరకూ ఎగసింది. -
మరో కొనుగోలుకు టొరెంటో..
ముంబై : ఇటీవలే యూనికెమ్ ల్యాబోరేటరీస్ను కొనుగోలు చేసి, టాప్-5 ఫార్మా దిగ్గజంగా పేరు తెచ్చుకున్న టోరెంటో ఫార్మాస్యూటికల్స్, మరో యూరోపియన్ జనరిక్స్ బిజినెస్ యూనిట్ కొనుగోలుకు సిద్ధమైంది. సనోఫి యూరోపియన్ జనరిక్స్ బిజినెస్ జెంటివా ఎన్.వీని రూ.16వేల కోట్లకు టోరెంటో కొనుగోలు చేస్తున్నట్టు న్యూస్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ కొనుగోలులో టోరెంటో విజయం సాధిస్తే, కంపెనీకి అతిపెద్ద లావాదేవీ ఇదే కానుంది. ఫండింగ్ కోసం ఇప్పటికే టోరెంటో పలు దేశీయ, విదేశీ బ్యాంకులతో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. 28 మార్చి వరకు అన్ని ఫండింగ్ అరెంజ్మెంట్లు కూడా పూర్తి కానున్నాయి. జెంటివాను సనోఫి 2009లో కొనుగోలు చేసింది. జెంటీవా ప్రస్తుతం యూరప్లో మూడో అతిపెద్ద జనరిక్స్ కంపెనీ. 50 మార్కెట్లలో జెంటివా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈబీఐటీడీఏల తర్వాత జెంటివా ఆదాయాలు 150 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. టోరెంటో ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న విలువ తన ఈబీఐటీడీఏల కంటే 13 సార్లు ఎక్కువగా ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ సేల్ ప్రక్రియను విజయవంతంగా ముగించడానికి సనోఫి, జేపీ మోర్గాన్, రోథ్స్చైల్డ్ అండ్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీని నియమించుకుందని తెలుస్తోంది. -
టొరంట్ చేతికి ‘ఎల్డర్ ఫార్మా’
న్యూఢిల్లీ: ఎల్డర్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన బ్రాండెడ్ ఫార్ములేషన్ బిజినెస్ను (భారత్, నేపాల్ల బిజినెస్ను )టొరెంట్ ఫార్మా కొనుగోలు చేయనున్నది. ఈ లావాదేవీ విలువ రూ.2,000 కోట్లు. ఈ డీల్ కారణంగా మహిళల ఆరోగ్య సంరక్షణ, నొప్పి నివారణ సెగ్మెంట్లలో తమ పరిస్థితి మరింత మెరుగవుతుందని, తమ వ్యాపారం మరింత పటిష్టమవుతుందని టొరెంట్ గ్రూప్ చైర్మన్ సుధీర్ మెహతా చెప్పారు. ఈ డీల్కు కావలసిన నిధులను అంతర్గతంగానూ, బ్యాంక్ రుణాల ద్వారానూ సమకూర్చుకుంటామని వివరించారు. ఈ డీల్ కారణంగా ఇటీవల తాము ఎదుర్కొన్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఎల్డర్ ఫార్మా ఎండీ, సీఈవో అలోక్ సక్సేనా చెప్పారు. అంతే కాకుండా తమ ఆర్థిక పరిస్థితి కూడా పటిష్టమవుతుందని వివరించారు. ఈ లావాదేవీ ఇరు కంపెనీల బోర్డ్ల ఆమోదం పొందింది. ఇక వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ కల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. ఈ డీల్ ప్రభావంతో శుక్రవారం ఎన్ఎస్ఈలో టొరంట్ ఫార్మా షేర్ 4.36 శాతం క్షీణించి రూ.479.65కు, ఎల్డర్ ఫార్మా 8 శాతం క్షీణించి రూ.299.10 వద్ద ముగిసాయి.